మంగ్లీ అంటేనే జానపదం. ఆ గొంతుకలో పల్లెదనం ప్రవహిస్తుంది. మట్టిపరిమళం గుప్పుమంటుంది. కాబట్టే, ఆమె పాడిన ‘జాలేవోసినవేమయ్యా ఓ జంగమయ్యా’ జానపదం ఇప్పటివరకు 26 లక్షల పైచిలుకు వ్యూస్ను కొల్లగొట్టింది. ఈ పాటను దివంగత జానపద వాగ్గేయకారుడు కమటం రామస్వామి రచించారు. గ్రామీణ మహిళ అంతరంగాన్ని ఆవిష్కరించే గీతమిది. ‘జాలేవోసినవేమయ్యా ఓ జంగమయ్యా.. రైకే కుట్టినవేమయ్యా.. జాలెకూలీ జాలెకిత్తూ.. కుట్టుకూలీ కుట్టుకిత్తూ.. రైకమీదా మనసువెట్టీ రంగు రంగుల జాలెవొయ్యీ’ అంటూ చీర రైకల సోకులు వివరించే సందర్భమిది.
మంచిగా కుట్టమంటూ దర్జీని దర్జాగా అడుగుతుంది. అంతలోనే, ‘అంచుకూ అద్దాలువొయ్యీ.. లంచమిస్తా మంచిగెయ్యీ’ అంటూ అద్దాల కొంగును ముద్దొచ్చేలా అలంకరించమని బతిమాలుతుంది. చివరికి, ‘అమ్మతోడూ జంగమయ్యా అడిగినందుకు కోపమయ్యా’ అంటూ తాను విసిగించి ఉంటే కనుక.. కోప్పడొద్దనీ, చీర మాత్రం మంచిగా రావాలనీ నొక్కి చెబుతుంది. ఇది అచ్చమైన పాలమూరు కోలాటం పాట. రామస్వామి రాసిన ‘చెట్టుకిందా కూసున్నవమ్మా.. సల్లంగా సూడే ఓ మైసమ్మా’ పాటను కూడా మంగ్లీ గతంలో పాడింది.