రెస్టారెంట్లు కిటకిటలాడిపోతున్నాయి. స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్కు క్షణం కూడా తీరిక ఉండటం లేదు. ఏ ఇద్దరు కలిసినా రుచుల ముచ్చటే! నిన్న మొన్నటి వరకూ నోరు కట్టేసుకున్న భోజన ప్రియులంతా.. తిండి మొహం ఎరుగనట్టు కుంభాలకు కుంభాలు ఖాళీ చేస్తున్నారు. మెట్రో నగరాలైన న్యూఢిల్లీ, కోల్కతా, హైదరాబాద్ సహా వివిధ పట్టణాల్లో రెస్టారెంట్లలో తినేవారి సంఖ్య పెరిగింది. రెస్టారెంట్ సాంకేతిక వేదిక అయిన ‘డైనౌట్’ విడుదల చేసిన నివేదిక ఇదే విషయాన్ని వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే జులై- సెప్టెంబర్ నెలల్లో రెస్టారెంట్లలో ఆర్డర్ల విలువ 20 శాతం పెరిగిందని ‘డైనౌట్’ పేర్కొంది. ఇంతకాలం, పత్యం కూటితో సరిపెట్టుకోవాల్సి వచ్చిందన్న అసంతృప్తి, కరోనా మహమ్మారి ఏడాదిపాటు జిహ్వకు సంకెళ్లు వేసిందన్న బాధ, ‘కొవిడ్ను జయించేశాం’ అన్న ఆనందం.. అన్నీ కలగలసి జనాలను రెస్టారెంట్లకు రప్పిస్తున్నట్టు సైకాలజిస్టుల విశ్లేషణ. ఈ ధోరణికి మానసిక నిపుణులు పెట్టిన ముద్దుపేరు ‘రివెంజ్ డైనింగ్’.