‘దశాహోరాత్రమ్’ అనేదే దసరాగా మారింది. జగన్మాత విజయ దుర్గాదేవి తొమ్మిది రోజులు మహిషాసురునితో పోరాడి మట్టుపెట్టిన పదో రోజును విజయానికి సంకేతంగా.. వేడుకగా దసరాను జరుపుకొంటున్నాం. అదే సమస్త విజయాలకు ఆనవాలుగా విజయదశమిగా మారింది. శ్రీరాముడు విజయ దశమి రోజున అపరాజితాదేవిని పూజించి, పాలపిట్టను దర్శించి రావణ సంహారానికి వెళ్లాడనీ, విజయోత్సాహంతో తిరిగి వచ్చాడనీ జానపదుల విశ్వాసం. అజ్ఞాతవాసం ముగించుకున్న పాండవులు విజయదుర్గా స్వరూపిణిగా భావించే జమ్మిచెట్టును పూజించి, ప్రదక్షిణలు చేసి వెళ్తుండగా వాళ్లకు పాలపిట్ట దర్శనం ఇచ్చిందనీ, అందుకే వారు కౌరవులను జయించారన్న కథ ప్రచారంలో ఉంది. అయితే, రామాయణ, మహాభారత కావ్యాల్లో మాత్రం పాలపిట్ట ప్రస్తావన కనిపించదు. కానీ, దసరా రోజున ఊరికి ఈశాన్య భాగంలో విజయదుర్గా స్వరూపిణిగా భావించే జమ్మిచెట్టును పూజించి, ప్రదక్షిణలు చేసి, సీమోల్లంఘనం అంటే ఊరి సరిహద్దును దాటాలని ధర్మ శాస్త్రం చెబుతున్నది. ఆ సమయంలో పాలపిట్టను దర్శించుకుంటే సకల శుభాలు, సమస్త విజయాలు కలుగుతాయని విశ్వాసం. అందుకే, పాలపిట్ట దర్శనాన్ని అదృష్టంగా భావిస్తారు. అది క్రమంగా ఒక సంప్రదాయంగా మారింది.
డా॥ శాస్ర్తుల రఘుపతి