గర్భిణుల్లో వచ్చే డిప్రెషన్.. పుట్టబోయే బిడ్డపై ప్రభావం చూపుతుందట. పిల్లలు యుక్తవయసుకు వచ్చేసరికి వారిలో మానసిక రుగ్మతలకు దారితీస్తుందట. ది జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్ నెట్వర్క్లో ప్రచురితమైన తాజా అధ్యయనం ఈ విషయాన్ని వెల్లడించింది. ఇందుకోసం అమెరికాలోని ఏవాన్ లాంగిట్యూడినల్ స్టడీ ఆఫ్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్లో పాల్గొన్న 5,329 మంది డేటాను పరిశోధకులు పరిశీలించారు. తల్లిదండ్రుల డిప్రెషన్, పిల్లల మానసిక ఆరోగ్య లక్షణాలకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ముఖ్యంగా, గర్భధారణ 32వ వారంలో తల్లికి కలిగే డిప్రెషన్.. పుట్టబోయే బిడ్డలో మానసిక రుగ్మతలను కలిగిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇందుకు గల కారణాలనూ వివరించారు. గర్భిణి తీవ్రమైన ఒత్తిడికి లోనైనప్పుడు.. ఆమె శరీరంలో కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ విడుదలవుతుంది. సాధారణంగా ఈ హార్మోన్ను ప్లాసెంటా నియంత్రిస్తుంది. కానీ, ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు అది బిడ్డ మెదడు అభివృద్ధిపై ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా.. గర్భంలో ఉన్నప్పుడు శిశువు మెదడు వేగంగా అభివృద్ధి చెందుతుంది.
ఈ సమయంలో తల్లి డిప్రెషన్ వల్ల కలిగే రసాయన మార్పులు, బిడ్డ మెదడులోని ఎమిగ్డాలా, ప్రీఫ్రంటల్ కార్టెక్స్ వంటి భాగాల పనితీరును ప్రభావితం చేస్తాయట. ఇవే భాగాలు భావోద్వేగాలను, ఆలోచనలను కూడా నియంత్రిస్తాయి. ఇలాంటి పిల్లలు కౌమార దశకు చేరుకున్నప్పుడు వారిలో కొన్ని మానసిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి, గర్భిణిగా ఉన్నప్పుడు ఎలాంటి ఆందోళన పెట్టుకోవద్దనీ, ఒత్తిడిని తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. ఇందుకోసం ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చూసుకోవాలనీ, యోగా, ధ్యానం లాంటివి ఆశ్రయించాలనీ చెబుతున్నారు.