ఓ యువకుడు కష్టాలను అధిగమిస్తూ జాతీయస్థాయిలో పతకాలు సాధిస్తున్నాడు. భవిష్యత్తులో అంతర్జాతీయ వేదికల మీద భారత్ తరఫున సైక్లింగ్లో పాల్గొనడమే తన లక్ష్యమని చెబుతున్నాడు. జనగాం జిల్లా తరిగొప్పుల గ్రామానికి చెందిన ప్రణయ్ గౌడ్ కండ్లన్నీ ఒలింపిక్స్ మీదే.
‘నా పేరు ప్రణయ్ గౌడ్. మాది జనగాం జిల్లా. మా ఊరు తరిగొప్పుల. అక్కడే ఎనిమిదో తరగతి వరకు చదివాను. నాన్న పేరు కొయ్యడ రాజు, అమ్మ విజయ. పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ వాళ్లు స్పోర్ట్స్ కోటాలో బీఎస్సీ (స్పోర్ట్స్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్)లో సీటు ఇచ్చారు. ప్రస్తుతం మూడో సంవత్సరం చదువుతున్నా. నాకు ఎనిమిదో తరగతి వరకు సైక్లింగ్ అంటే తెలియదు. మా ఊరికి చెందిన నాగరాజు అన్న అప్పటికే సైక్లింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. తనే మా ఊళ్లో సైక్లింగ్ పోటీలు పెట్టించాడు. మా నాన్న సైకిల్తో నేను పాల్గొన్నా. మొదటి బహుమతి వచ్చింది. అప్పుడే కోచ్ మ్యాక్స్వెల్ ట్రెవర్ సార్ పరిచయం అయ్యారు. ఆయన తన పేరు మీద హైదరాబాద్లో సైక్లింగ్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్నారు. ‘నీకు సైక్లింగ్లో ఇంట్రస్ట్ ఉంటే నా దగ్గరికి రా. నేనే అన్నీ చూసుకుంటాను. నిన్ను మంచి సైక్లిస్ట్ను చేస్తాను’ అని చెప్పారు. తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు నేను హైదరాబాద్కి వచ్చాను. అప్పటి నుంచి అన్నీ సారే చూసుకుంటున్నారు. ఇప్పటి వరకు 17 సార్లు నేషనల్ ఈవెంట్స్లో పాల్గొన్నాను. అనేక పతకాలు సాధించాను. ఇండియా తరఫున అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలన్నదే నా ఆశ. ప్రస్తుతం ‘డెక్లథాన్’ అనే స్పోర్ట్స్ షోరూంలో పార్ట్టైమ్ ఉద్యోగం చేస్తూ నా ఖర్చులకు సంపాదించుకుంటున్నా.
పట్టు సాధించాడు
ప్రణయ్ ట్రాక్ సైక్లింగ్లో పట్టు సాధించాడు. ప్రోత్సహిస్తే మరిన్ని పతకాలు ఖాయం. జాతీయ స్థాయిలో సైక్లిస్ట్గా ఎదగాలంటే ముందు నుంచే మంచి ట్రైనింగ్, సరైన డైట్ అవసరం. అందుకే నేను నా ఇన్స్టిట్యూట్లో ఆరేండ్ల వయసు నుంచే కోచింగ్ ఇస్తున్నాను. 12 ఏండ్లు వచ్చేసరికి ట్రాక్లో వస్తారని నా నమ్మకం.
కొందరికి ఉచితంగానే శిక్షణ, బస, డైట్.. అన్నీ సమకూరుస్తున్నా. సైక్లింగ్ అనేది ఖర్చుతో కూడుకున్నది. అందుకే కేంద్ర ప్రభుత్వ ‘ఖేలో ఇండియా’ ప్రాజెక్టు లక్ష్యంగా పిల్లలను తయారు చేస్తున్నాను. ఎంపికైతే డైట్, ఎక్విప్మెంట్, ఎడ్యుకేషన్.. అన్నీ కేంద్ర ప్రభుత్వమే చూస్తుంది. ఆ స్థాయికి వీళ్లను తయారుచేయాలన్నదే నా లక్ష్యం. ఆ తర్వాత ఒలింపిక్స్ వరకూ సులభంగా వెళ్లొచ్చు.
– మ్యాక్స్వెల్ ట్రెవర్
– నాగోజు సత్యనారాయణ