ఓ ధనవంతుడు నదీ తీరాన ఉన్న ఆశ్రమానికి వెళ్లి అక్కడి గురువుకు నమస్కరించాడు. ఆ ధనికుణ్ని సాదరంగా పలకరించాడు గురువు. ‘ఆశ్రమం అంతా చూసిరండి. మధ్యాహ్నం అందరితో కలిసి భోజనం చేద్దాం’ అన్నాడు. ‘నాలాంటి శ్రీమంతుడు సాదాసీదా జనంతో కూర్చొని భోజనం చేయడం ఏమిటి?’ అన్నట్లుగా ముఖం చిట్లించాడు ధనికుడు. అది గమనించిన గురువు అక్కడే చెట్ల కింద చదరంగం ఆడుతున్న వారిని చూపిస్తూ ‘మీరు కూడా కాసేపు చదరంగం ఆడండి’ అన్నాడు. గంట తర్వాత ఆ ధనికుడు గురువు దగ్గరికి ఉత్సాహంగా వచ్చాడు.
‘ఆటలో నేను గెలిచాను గురువు గారు’ అన్నాడు. ‘ఓ అలాగా! ఆట అయిపోయిందిగా పావులను దాచారా?’ అని ప్రశ్నించాడు. ‘చిన్నపెట్టెలో భద్రంగా దాచామ’ని చెప్పాడు ధనికుడు. ‘రాజు, మంత్రి పావులు వేరే పెట్టెలోనే కదా ఉంచారు!’ అని అడిగాడు గురువు. ‘ప్రత్యేకంగా ఎందుకండి? వాటిని కూడా అదే పెట్టెలో ఉంచాం’ అన్నాడు ధనికుడు. ‘అదేమిటి? సిపాయిలతో సమానంగా రాజు, మంత్రులను ఒకే పెట్టెలో భద్రపరచడం ఎంతవరకు న్యాయం?’ అన్నాడు.
‘ఆట అయిపోయాక రాజు, సిపాయి అని ప్రత్యేకించి చూడరు కదా గురూజీ’ అన్నాడు ధనికుడు. అప్పుడు గురువు చిన్నగా నవ్వుతూ ‘ప్రపంచమనే చదరంగం ఆటలో మనం రాజుగా ఉన్నా, సిపాయిగా ఉన్నా.. ఆట ముగిశాక మట్టిలోకి చేరుకోవాల్సిందే! అక్కడ అందరూ సమానులే’ అన్నాడు. గురువు మాటల్లోని లోతును అర్థం చేసుకున్నాడు ధనికుడు. అందరితో కలిసి భోజనానికి ఉపక్రమించాడు.
…? ఆర్.సి.కృష్ణస్వామి రాజు, 9393662821
శుభాలు ఇచ్చేవాడు..
ఆ నో భద్రాః క్రతవోయంతు విశ్వతః (యజుర్వేదం-25.2)
పరమేశ్వరుడు జగన్నాథుడు. జగత్తు అంతా వ్యాపించి ఉన్నవాడు. అన్ని దిక్కుల్లో ప్రకాశించేవాడు. సకల శుభాలూ (భద్రాలు) ఇచ్చేవాడు. అలాంటి పరమేశ్వరుడు ‘మనకు అన్ని దిక్కుల నుంచి ఎల్లవేళలా శుభాలే కలుగజేయాలి’ అని ప్రార్థించాలి.
…? ఆచార్య మసన చెన్నప్ప, 98856 54381