తాంబూలంలో ఇచ్చిన పండ్లను దేవుడికి నివేదించవచ్చా? * ఎస్.యశస్విన్, హైదరాబాద్
పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి
తదహం భక్త్యుపహృతమ్ అశ్నామి ప్రయతాత్మనః॥
(భగవద్గీత 9-26)
‘నిర్మలమైన మనసుతో, నిష్కామ భావంతో సమర్పించే పత్రం, పుష్పం, ఫలం, నీరు నాకు అత్యంత ప్రీతికరమైనవి. వీటిని భక్తితో సమర్పిస్తే నేను స్వీకరించి సంతృప్తి చెందుతాను’ అని శ్రీకృష్ణుడు స్వయంగా బోధించాడు. ఆ భగవంతుడే వీటన్నిటినీ ప్రకృతిలో భాగంగా సృష్టించాడు. పూజలో ఉపయోగించే తులసీదళాలు, పత్రి వంటి ఎన్నో పత్రాలను, అందమైన పూలను, రుచికరమైన పండ్లను, స్వచ్ఛమైన నీటిని ప్రకృతి మనకు ఉచితంగా ప్రసాదించింది. వాటిని ఇస్తున్నందుకు చెట్లకు గానీ, నేల తల్లికి గానీ మనం తిరిగి ఏ మూల్యమూ చెల్లించడం లేదు. వాటిని మన స్వప్రయోజనాలకు వాడుకుంటున్నాం. పైపెచ్చు కాలుష్యంతో ప్రకృతికి కీడు తలపెడుతున్నాం. కాగా, ఒకసారి ఉపయోగించడంతో వివిధ పదార్థాల స్వచ్ఛత అంతరిస్తుంది. కాబట్టి ఒకసారి ఉపయోగించిన పదార్థాలను దేవుడికి తిరిగి నివేదించ కూడదు. దైవారాధనలో మనసుతోపాటు మనం నివేదించే పదార్థాలు కూడా పవిత్రంగా ఉండాలి. లేకుంటే విరుద్ధమైన ఫలితాలు కలుగుతాయి. కాబట్టి, తాంబూలంలో తీసుకున్న పండ్లు వ్యక్తిగత ఉపయోగానికి మినహా దైవారాధనలో పనికిరావు.
– డా॥ శాస్ర్తుల రఘుపతి
73867 58370