Brahmanandam | పాపమైనా పుణ్యమైనా.. జీవి చేసే చర్యకు భగవంతుడిచ్చే ప్రతిచర్యనే కర్మసిద్ధాంతం అంటారు. బ్రహ్మానందంతో కాసేపు మాట్లాడినప్పుడు.. ఆయన జీవితాన్ని పరికించి చూసినప్పుడు.. కర్మసిద్ధాంతానికి ప్రతీకగా కనిపించారు. కర్మసిద్ధాంతం అనేది జగత్తుకు ఈశ్వరుడు ఇచ్చిన వరం అంటారాయన. అందులో నిజం లేకపోతే… ఆ బ్రహ్మానందం అనే పేరేంటి?.. పుట్టెడు బాధల్లో ఉన్నవాణ్ని కూడా ఒక్క లుక్కుతో ఫక్కున నవ్వించగలగటమేంటి? దశాబ్దాలపాటు కావాల్సినన్ని నవ్వుల్ని పంచి, కోట్లాదిమందిని రుణగ్రస్తుల్ని చేయటమేంటి? ఎవరో రాసిన స్క్రిప్ట్లా లేదూ!? తల్లిదండ్రులు ఇదంతా ముందే ఊహించి ఆ పేరు పెట్టరుగా? అదే కర్మసిద్ధాంతం అంటే. ఇదంతా గతజన్మ పుణ్యఫలం.. ఈశ్వర కవనం.
బ్రహ్మానందం అనగానే అందరూ గొప్ప హాస్యనటుడు అంటారు. కొందరు మహానటుడు అంటారు. కానీ, ఆయనతో కాసేపు కూర్చుంటే తనలో ఓ తత్వవేత్త కనిపిస్తాడు. ఆధ్యాత్మికవేత్త వినిపిస్తాడు.. బ్రహ్మజ్ఞానిగా గోచరిస్తాడు. ఆ జ్ఞానాన్నంతా క్రోడీకరించి, తన జీవితాన్ని భావితరాలకు పాఠ్యాంశం చేయాలనే సంకల్పంతో బ్రహ్మానందం చేసిన ఓ గొప్ప ప్రయత్నం.. ఆత్మకథ రాసుకోవడం. ‘నేను మీ బ్రహ్మానందం’, ‘ME YOURS BRAHMANANDAM’ పేర్లతో తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో తన ఆత్మకథను గ్రంథస్థం చేశారు బ్రహ్మానందం. ఈ సందర్భంగా ఈ పుస్తకం గురించి ‘నమస్తే తెలంగాణ’తో ఆయన ముచ్చట మీకోసం..
ఇంకెప్పుడు రాయాలి? అంతా అయిపోయిన తర్వాత రాస్తే ఎవరు చదువుతారు? వెలుగులో ఉన్నప్పుడే చెప్పాలనుకున్నది చెప్పేయాలి. అప్పుడే మాటలకు విలువ ఉంటుంది.
సూర్యుడి కాంతి జగత్తుకు ఉపయోగపడితే… మిణుగురు కాంతి దాని పరిసరాలకు ఉపయోగపడుతుంది. దేని పరిధి దానిది. అలాగే నా జీవితం కూడా కొందరికైనా వెలుగు చూపుతుందనే చిరు ఆశ. స్కూల్కు వెళ్లే రోజుల్లో ఓసారి మా ఇంట్లో అన్నం లేకపోతే మా పిన్నివాళ్లింట్లో భోంచేసి బడికి బయలుదేరాను. ఎదురుగా అమ్మ వస్తూ ‘వంట చేస్తాను.. తినెళ్లు’ అన్నది. ‘స్కూల్కి టైమ్ అవుతుందిగదమ్మా.. అందుకే పిన్నివాళ్ల ఇంట్లో తినేశాను..’ అన్నాను. చచ్చేలా కొట్టింది. గుక్కపట్టి ఏడుస్తున్న నాతో అప్పుడు అమ్మ చెప్పిన మాట ఇప్పటికీ గుర్తుండిపోయింది.. ‘18 రోజులు తినకుండా ఉంటే మనిషి చనిపోతాడు. కాబట్టి 17రోజులు పస్తులున్నా పర్లా.. ఈ లోపేం చావవ్.’.. ఆత్మాభిమానం అంటే ఏంటో ఆ మాటలతో అర్థమైంది. నాటినుంచి నేటి వరకూ ఎక్కడా చేయి చాచిందిలేదు. బ్రహ్మానందం జీవితంలో చెప్పుకోలేని స్ట్రగుల్స్ చాలా ఉన్నాయి. అవన్నీ ఇందులో ఉంటాయి. స్వశక్తి, దైవశక్తి సమన్వయమే జీవితం. ప్రయత్న లోపం లేకపోతే దైవం కచ్చితంగా సహకరిస్తుంది. నా ఆత్మకథ పరమార్థం కూడా అదే. ఎక్కడో మారుమూల పేదరికంలో పుట్టి పెరిగిన కుర్రాడు.. చెప్పులు కూడా కొనుక్కులేని స్థితిలో ఉన్న కుర్రాడు.. పట్టుదలతో చదువుకొని లెక్చరర్ స్థాయికి ఎలా రాగలిగాడు? సైకిల్ కొనుక్కోవడమే పెద్ద విషయమైన ఆ కుర్రాడు.. కార్లలో తిరిగే స్థాయికి ఎలా ఎదిగాడు? విమానంలో ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి చేతులమీదుగా పద్మశ్రీ ఎలా అందుకున్నాడు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానమే ఈ పుస్తకం.
ఆత్మవంచన లేకుండా రాసుకునే ఏ జీవితగాథ అయినా ఆత్మకథే. అవాకులు చవాకులు చదివేవాళ్లకోసం ఈ పుస్తకం రాయలేదు. మనిషి జీవితంలో వివాదాలు సహజం. వాటివల్ల సమాజానికి ఉపయోగం ఏంటి? బాధపడటం.. బాధ పెట్టడం.. తప్పు చేయడం.. తప్పు దిద్దుకోవడం.. ఆత్మవంచన చేసుకోవడం.. ఆత్మపరిశీలన చేసుకోవడం.. తల దించుకునేలా బతకడం.. తల ఎత్తుకునేలా జీవించడం.. ఇవన్నీ మానవ సహజాలు. చేసిన చెడునో.. సాధించిన ఘనతనో చెప్పుకోవడం కోసం ఈ పుస్తకం రాయలేదు. జీవితంలో ఎదురైన బాధలైనా, అవమానాలైనా, ఆనందాలైనా నాకు పాఠాలే! కష్టాలూ, అవమానాలు నన్ను బాధించలేదు. ఇప్పటివరకూ చాలామంది పెద్దవాళ్లు తమ ఆత్మకథలు రాసుకున్నారు. వాటికి పూర్తి భిన్నమైనది నా ఆత్మకథ. ఇందులో అంతా ఉండదు.. అన్నీ ఉంటాయి. ఆ గమ్మత్తేంటో చదివితేనే తెలుస్తుంది.
అహంకారంగా మాట్లాడుతున్నానని అనుకోవద్దు.. ఏవీ లేవు. మహామహుల ఆత్మకథలు చదివాను. ఎవరి ఆలోచనా విధానం వారిది. వారికి కరెక్ట్ అనిపించింది వారు రాశారు. చేసిన తప్పులను నిర్మొహమాటంగా చెప్పడం నిజాయతీ అని వారు అనుకున్నారు. సమాజానికి ఉపయోగపడని నిజాయతీ ఎందుకు అని నేను అనుకుంటున్నాను.
రీడింగ్ ఎమోషన్ కోసం నేను రాయలేదు. ఎమోషన్, డ్రామా ఉంటేనే చదువుతారనుకుంటే దయచేసి చదవొద్దు. చదువరులకు మసిపూసి మారేడుకాయ చేయడం నాకు చేతకాదు. చెప్పాలనుకున్నది సూటిగా చెప్పాను. భావితరాలకు ఉపయోగపడని డ్రామా, ఫిక్షన్ నాకు అవసరం లేదు.
ఎవరి దగ్గరో సర్టిఫికెట్ కోసం నేను ఈ ఆత్మకథ రాయలేదు. ఎవర్నీ సంతృప్తి పరచడం నా ఉద్దేశం కాదు. సమాజానికి ఉపయోగపడే మెటీరియల్ మాత్రమే ఇందులో వాడాను.
నీకిష్టమైతే చదువ్.. లేకపోతే మానెయ్! నచ్చినవాళ్లే చదువుతారు. విత్తనం నాటగానే మొక్క రాదు. సమయం పడుతుంది. నా వరకైతే.. డబ్బు కోసమో.. పేరుప్రఖ్యాతుల కోసమో రాసిన పుస్తకం కాదిది. నాలో ఉన్న సంఘర్షణలన్నిటినీ పుస్తకరూపంలో పెట్టి ‘ఇదికూడా మీరు అనుభవించి చావండ్రా..’ అని నేను ఈ పుస్తకం రాయలేదు. అసలు కాంట్రవర్సీలే రాయాలనుకుంటే నా జీవితంలో ఉన్నన్ని కాంట్రవర్సీలు ఎక్కడా లేవు. అవన్నీ రాసి విడుదల చేస్తే పుస్తకాలన్నీ హాట్ కేకులే. కానీ, అది నా అభిమతం కాదు. మళ్లీ చెబుతున్నా. ఇందులో అంతా ఉండదు.. అన్నీ ఉంటాయి.
ఇందులో ముందుమాటలు.. వెనుక మాటలు లేవు. బావుంటే చదువుతారు.. అంతే!
నేను మామూలుగా మాట్లాడినా, డైలాగ్ చెప్పినా అందులో స్పష్టత ఉంటుందంటే కారణం భాషపై నాకున్న పట్టు. పాత్రకు తగ్గట్టుగా భాష ఉండాలి. ధూర్జటిలాంటి మహాకవీంద్రులే తమ కావ్యాల్లో పాత్రలను బట్టే భాషను వాడారు. గురువులు బోధించిన జ్ఞానం. చదివిన కావ్యాలు, చేసిన సినిమాలు.. ఇవన్నీ నాలో సాహిత్యాభిలాషను ద్విగుణీకృతం చేశాయి. ఈ పుస్తక రచనలో అది తోడ్పడింది. నేను చెపుతూ ఉంటే.. రచయిత హాసం రాజా దీన్ని గ్రంథస్థం చేశాడు. నా మాటల్నే అందంగా భావగర్భితంగా అర్థవంతంగా అక్షరాలతో పొందుపరిచాడు.
రేపు వెళ్లిపోతుంటే.. ఈరోజు రాసేది సమగ్ర చరిత్ర. ఇంకా ఉన్నానుగా..(నవ్వుతూ)
-నరసింహా బుర్రా