‘రావణుణ్ని సంహరించేది ఎవరు?’ ‘నేను..’, ‘నేను..’ అంటున్నారంతా! కానీ, అంతలోనే ఓ దివ్య తేజస్సు ఆవిర్భవించింది. ‘రావణుణ్ని నేను సంహరిస్తాను. అంతేకాదు, పద్నాలుగువేల సంవత్సరాలు ఈ భూమండలాన్ని పాలిస్తాను’ అని ప్రకటించింది. ఆ దివ్య తేజస్సే.. విష్ణు తేజస్సు. అది విశ్వరూప విన్యాసం.. నారాయణుడు, నరుడిగా ఆవిర్భవించిన అపురూప ఘట్టం. రాముడిగా నిలిచిన విష్ణుతత్వం. దేవుడిగా ఎదిగిన మానుషత్వం. భౌతికంగా ఎన్నడూ విశ్వరూపం ప్రదర్శించకున్నా, రామాయణంలో పలు సన్నివేశాలు రామచంద్రుడి విశ్వరూపాన్ని కళ్లముందు ఉంచుతాయి.
ఈ నెల 29న భద్రాచలం శ్రీరామ విశ్వరూప దర్శనం
భద్రాచలంంలో ఏటా ‘విశ్వరూప సేవ’ వైభవంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి తర్వాత పక్షం రోజులకు వచ్చే కృష్ణ ద్వాదశి నాడు మహా ప్రభుత్వోత్సవ క్రతువు చేస్తారు. దీనినే శ్రీరాముడి ‘విశ్వరూప దర్శన సేవ’గా పరిగణిస్తారు. ఇందులో భాగంగా భద్రాద్రి ఉప ఆలయాల్లో పూజలు అందుకుంటున్న దేవతల ఉత్సవమూర్తులన్నిటినీ ఒకే మంటపంలో కొలువుదీరుస్తారు. శ్రీరాముడికి స్వర్ణ పుష్పార్చనతోపాటు ప్రత్యేక పూజలు చేస్తారు. సాయంత్రం దర్బార్ సేవ నిర్వహిస్తారు. ఈ విశ్వరూప సేవ శ్రీరంగం క్షేత్రంలోనూ జరుపుతారు. భక్త రామదాసు హయాంలో శ్రీరంగం నుంచి అర్చకులను తీసుకువచ్చి ఈ క్రతువు చేశారట. ఆ సంప్రదాయం నేటికీ కొనసాగుతున్నది. ‘విశ్వరూప సేవ’లో రకరకాల కూరగాయలతో చేసిన ‘కదంబం’ అనే ప్రసాదాన్ని భక్తులకు పంచుతారు.
బాల రాముడిగా..
యాగ రక్షణ కోసం లక్ష్మణుడు తోడుగా విశ్వామిత్రుడి వెంట నడిచాడు బాల రాముడు. బ్రహ్మర్షి నుంచి అస్త్ర విద్యలు పొందాడు. విశ్వామిత్రుడి ఆజ్ఞమేరకు వారికి ఎదురుపడిన తాటకిని హతమార్చాడు. తర్వాత యాగం మొదలైంది. రామలక్ష్మణులు ఇద్దరూ కంటి మీద కునుకు లేకుండా కాపు కాశారు. యాగం చివరి రోజు మారీచ, సుబాహులు వెయ్యిమంది రాక్షసులతో వచ్చిపడ్డారు. యజ్ఞకుండాల్లో నెత్తురు పోయడానికి ప్రయత్నించారు. లిప్తపాటులో స్పందించి మారీచుడిపైకి మానవాస్ర్తాన్ని సంధించాడు. ఆ దెబ్బకు అతను వంద యోజనాల దూరం వెళ్లి పడ్డాడు. తర్వాత ఆగ్నేయాస్త్రంతో సుబాహుణ్ని సంహరించాడు. వాయవ్యాస్త్రంతో మిగిలిన రాక్షసులనూ తుదముట్టించాడు. బాల రాముడి పరాక్రమాన్ని చూసి మురిసిపోయాడు విశ్వామిత్రుడు.
గంటా పన్నెండు నిమిషాల్లో..
శూర్పణఖ ముక్కు, చెవులు కోశాడు లక్ష్మణుడు. అహం దెబ్బతిన్న రావణ సోదరి దండకారణ్యంలోని ఖరదూషణాది రాక్షసులను రాముడిపైకి ఉసిగొలిపింది. మొదట ఖరుడు కొందరు కింకరులను రాముడిపైకి పంపుతాడు. వచ్చిన వారిని వచ్చినట్టే మట్టుపెడతాడు రాముడు. ఇక లాభం లేదనుకొని పద్నాలుగువేల మంది సైన్యంతో రాముడిపైకి దండెత్తాడు ఖరుడు. దూషణుడు త్రిశిరస్కుడు, ప్రమాథి, స్థూలాక్షుడు, మహాకపాలుడు వంటి రాక్షసులు వెంటరాగా రాముడిపై యుద్ధానికి దిగుతాడు ఖరుడు. రాక్షసుల దాడి నేపథ్యంలో సీతమ్మను పర్ణశాలలోకి పంపి, లక్ష్మణుడిని ఆమెకు కాపలాగా ఉండమని చెబుతాడు రాముడు. తను ధనుర్బాణాలు ధరించి వేలమంది రాక్షసులతో ఒంటరిపోరుకు సిద్ధపడతాడు. ఆ సమయంలో రాముడు అరివీర భయంకరంగా కనిపిస్తాడు. ‘పినాకిని ధనుస్సును చేబూని దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి నిల్చున్న శివుడిలా రాముడు ఉన్నాడం’ంటూ అభివర్ణించాడు వాల్మీకి మహర్షి. రాముడి యుద్ధ విన్యాసాన్ని చూసి దేవతలు సైతం ఆశ్చర్యపోయారట. తూణీరంలో నుంచి బాణం ఎప్పుడు తీశాడో, ఎప్పుడు వింటినారిని సంధించాడో, ఎప్పుడు బాణం వదిలాడో పోల్చుకోలేకపోయారట. ఏకకాలంలో పదమూడు బాణాలను ఎక్కుపెట్టి స్వైరవిహారం చేశాడట రాముడు. కేవలం గంటా పన్నెండు నిమిషాల్లో ఖరదూషణాదులను, పద్నాలుగు వేల మంది రాక్షాసులను సంహరించాడు రాముడు.
కాకిపై బ్రహ్మాస్త్రం
వనవాస సమయంలో సీతారాములు చిత్రకూట పర్వతంపై ఉంటున్న రోజులవి. ఓ రోజు పర్ణశాల బయట సీతమ్మ మాంసపు ఒరుగులను ఎండబెడుతున్నది. కోనేటిలో స్నానం చేసి వచ్చిన రాముడు సీతమ్మ చెంత చేరాడు. ఇంతలో ఒక కాకి (ఇంద్రుడి కొడుకు కాకాసురుడు) వచ్చి ఓ మాంసం ముక్కను నోట కరుచుకుంది. దానిపైకి మట్టి పెడ్డ విసిరింది సీత. మళ్లీ ఆ కాకి వచ్చి సీతమ్మ వక్షస్థలంపై గాయం చేసింది. కోపంతో తన వడ్డాణాన్ని దానిపైకి వేయబోయింది సీత. రాముడు వారించి, కాకిపై వడ్డాణం విసురుతావా? అంటాడు. కాసేపటికి రాముడు సీత ఒడిలో తలపెట్టుకొని నిద్రపోయాడు. ఇంతలో మళ్లీ వచ్చింది కాకి. సీతమ్మపై తిరిగి దాడి చేసి వక్షస్థలం నుంచి మాంసాన్ని నోట కరిచింది. రక్తం బొటబొటా కారి రాముడి నుదుటిపై పడింది. నిద్రలేచిన రాముడు గాయంతో బాధపడుతున్న సీతను చూసి కోపంతో ఊగిపోయాడు. సమీపంలో నోట మాంసంతో కాకి కనిపించింది. క్షణం ఉపేక్షించకుండా పక్కనే ఉన్న దర్భ (గడ్డి పోచ)ను తీసుకొని, బ్రహ్మాస్ర్తాన్ని అభిమంత్రించి దానిపై ప్రయోగిస్తాడు. కాకాసురుడు ప్రాణభయంతో ముల్లోకాలు తిరిగి, ఎవరూ కాపాడకపోవడంతో చివరికి రాముడి చెంతకు వచ్చి శరణు వేడుతాడు. రాముడు అభయమిస్తాడు. బ్రహ్మాస్ర్తానికి ఆహారంగా తన కుడి కన్ను సమర్పిస్తాడు కాకాసురుడు. ఈ దృష్టాంతాన్ని తన జాడ తెలుసుకోవడానికి అశోక వనానికి వచ్చిన ఆంజనేయుడికి చెబుతుంది సీతమ్మ. తనపై దాడి చేసిన కాకిపై బ్రహ్మాస్త్రం ప్రయోగించిన రాముడు ఎంతటి పరాక్రమవంతుడో చెబుతూనే, ఇప్పుడు ఎందుకు ఉపేక్షిస్తున్నాడని అడుగుతుంది.
నిలబడి చూడండి
రామాయణంలో పతాక ఘట్టం.. రామరావణ యుద్ధం. రావణుడు దివ్య రథంపై రణభూమికి వచ్చాడు. నేలపై ఉండి పోరాడుతున్న రాముడికి రథం పంపాడు ఇంద్రుడు. దానిని అధిరోహించి యుద్ధానికి సిద్ధమయ్యాడు రాముడు. ఇద్దరి మధ్య యుద్ధం మొదలైంది. వారిద్దరి బాణ పరంపర ఆకాశాన్ని కప్పేసింది. ‘మీరెవ్వరూ యుద్ధం చేయకండి. అలా నిలబడి చూస్తూ ఉండండి. రావణుడో, రాముడో తేలిపోవాలి’ అన్నాడు రాముడు. రావణుడు ఇరవై చేతులతో ఆయుధాలను రాముడి మీదికి ప్రయోగిస్తున్నాడు. వాటిని తుత్తునియలు చేయసాగాడు రాముడు. అలా ఇద్దరి మధ్య యుద్ధం గంటో, రెండు గంటలో సాగలేదు, ఏకంగా ఏడు పగళ్లు, ఏడు రాత్రులు కొనసాగింది. ఇద్దరు పరాక్రమశాలుల యుద్ధాన్ని వర్ణిస్తూ వాల్మీకి మహర్షి ‘ఆకాశానికి ఆకాశమే పోలిక, సముద్రానికి సముద్రమే పోలిక. రామ-రావణ యుద్ధానికి రామ-రావణ యుద్ధమే పోలిక’ అన్నాడు. చివరికి బ్రహ్మాస్త్రంతో లోకకంటకుడైన దశకంఠుడిని సంహరించి అవతార ప్రయోజనం పూర్తిచేశాడు రాముడు.