ఆగస్టు 22 ప్రపంచ జానపద దినోత్సవం
పల్లె జీవనం నుంచి, పామరుడి శ్రమ నుంచి పుట్టిందే జానపదం. ఆ శ్రామికుడు పాడుకున్నదే జానపద గీతం. ఇదొక వారసత్వ సంపద, జాతి సాంస్కృతిక చిహ్నం. అక్షరం పుట్టకముందు నుంచే అక్షయ మైనచరిత్రను మౌఖిక రూపంలో భద్రపరుస్తున్న అపురూప కళా రూపం. సాంకేతికత అందుబాటులోకి రాకముందే ప్రజలకు వినోదాన్ని, విజ్ఞానాన్ని పంచిన తిరుగులేని సమాచార మాధ్యమం. ఆధునిక టెక్నాలజీ రాకతో అంతరించే దశకు చేరుకున్న జానపద కళారూపాలు.. తిరిగి అదే సాంకేతిక పరిజ్ఞానం దన్నుతో కొత్త పుంతలు తొక్కుతున్నాయి.
తెలంగాణ జానపద కళారూపాలది ప్రత్యేక స్థానం. రెండువేల ఏండ్లనాడే తత్వశాస్త్రాన్ని మథించి శిల్ప, నృత్య, హస్తకళల రూపంలో మనదైన జీవన విధానాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన నేల ఇది. నిర్మాణ వైచిత్రిలో దేశాన్నే అబ్బురపరచిన పాలమూరు, నిర్మల్ బొమ్మలు, పెంబర్తి కంచుకళలు, చేర్యాల నకాషి చిత్రాలు.. కురవి, ఐనవోలు, కొమ్మాల, కోటంచ, ఏడుపాయల, కొండగట్టు, కీసర, మేడారం జాతర్లు.. బోనాలు, బొడ్డెమ్మ, బతుకమ్మ, పీర్లు.. జానపద తెలంగాణ సుసంపన్నతకు తారాణం. ఉమ్మడి పాలకులు తమ సాంస్కృతిక ఆధిపత్య భావజాలంతో తెలంగాణ యాసను, భాషను, సంస్కృతిని అడుగడుగునా కించపరిచారు. పేరెన్నికగన్న కళాకారులకూ అవమానాలు తప్పలేదు. స్వరాష్ట్రం వచ్చాక కళారూపాలు కొత్త చివురులు తొడుగుతున్నాయి.
సర్కారు కృషి..
తెలంగాణలో 100కు పైగా జానపద కళారూపాలు ఉన్నాయి. అందులో చాలా భాగం ఆశ్రితాలే. అంటే, వివిధ కులాలపై ఆధారపడి బతుకుతున్నవే. గిరిజన తెగలకు కూడా పట్టెడ, డోలి, తోటి, పర్ధాన్ వంటి ఆశ్రిత కళారూపాలున్నాయి. రాష్ట్ర ఏర్పాటు తరువాత భాషా సాంసృతికశాఖ పునర్నిర్మాణానికి సీఎం కేసీఆర్ తీసుకొన్నచర్యలు తెలంగాణ జానపదానికి కొత్త ఊపిరులూదుతున్నాయి. భాషకు, యాసకు మంచి రోజులు వచ్చాయి. తెలంగాణ బతుకమ్మ విశ్వ వ్యాప్తంగా జేజేలు అందుకొంటున్నది. ప్రపంచం అబ్బురపడేలా యాదాద్రి ఆలయాల పునర్నిర్మాణం జరిగింది. జాతర్లు, బోనాలు ఘనంగా సాగుతున్నాయి. తెలంగాణ కళాకారులకు సముచిత స్థానం లభించింది. తెలంగాణ పాటకు పట్టాభిషేకం జరిగింది. తెలంగాణ హస్తకళలు దేశవిదేశాలకు పాకుతున్నాయి. తెలంగాణ సర్కారు ప్రతి వేడుకలోనూ జానపదాలను భాగం చేస్తున్నది. తాజాగా జరుగుతున్న వజ్రోత్సవాలే అందుకు నిదర్శనం.
ఒగ్గుడోలు శిక్షణ-పరిశోధనలు
అంతరించిపోతున్న అనేక ప్రాచీన కళారూపాలపై మన సర్కారు డాక్యుమెంటరీలు సిద్ధం చేయిస్తున్నది. ఇప్పటికే తెలంగాణ జానపద వాద్యపరికరాలు, కళాకారుల జీవితాలు, పటం కథలు తదితర ఇతివృత్తాలతో డాక్యుమెంటరీలను రూపొందించింది తెలుగు యూనివర్సిటీ. ఒగ్గుడోలుపై ఔత్సాహిక యువ కళాకారులకు ప్రత్యేక తర్ఫీదు ఇప్పించింది. ఒగ్గుడోలు కళాప్రదర్శనలో ఉన్న 32 రకాల అడుగులు, దరువులు, విన్యాసాలపై యువతకు శిక్షణనిచ్చింది. కిన్నెరమెట్లపై శిక్షణ శిబిరాలు నిర్వహించింది. అదేవిధంగా నిర్మల్ బొమ్మలకు, పెంబర్తి కళారూపాలకు అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించి పెట్టింది.
సాంకేతిక దన్ను..
జానపద సాహిత్యమంతా మౌఖిక రూపంలోనే ఉన్నది. పిడికెడంతమంది కళాకారులు వాటిని ఇంకా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ఆ వయోధికులకు సర్కారు భరోసా ఇస్తున్నది. సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి రావడంతో.. మూలనపడిన జానపదాలూ తిరిగి ఉనికిలోకి వస్తున్నాయి. మారుమూల ప్రాంతాల్లోని ఔత్సాహికులు సైతం స్వయంగా వీడియోలు రికార్డు చేస్తున్నారు. తెలంగాణ పల్లెపాటల్ని దేశమంతా పాడుకుంటున్నారు. ఇది మంచి పరిణామం. కళకు కొత్త కళ వచ్చిందనడానికి సాక్ష్యం.
…? మ్యాకం రవికుమార్