ఈ మధ్య హైదరాబాద్లో ఓ జంతు ప్రేమికురాలు ‘పిల్లి కనబడుట లేదు’ అంటూ దిన పత్రికల్లో ప్రకటన ఇచ్చింది. ఆచూకీ చెప్పిన వారికి రూ.50వేల బహుమతి కూడా ప్రకటించింది. అక్కడక్కడా ‘మా పెంపుడు కుక్క కనిపించడం లేదు’ తరహా పోస్టర్లు దర్శనమిస్తూనే ఉంటాయి. ఇష్టమైన జంతువులు కనిపించకపోతే.. తమ కుటుంబసభ్యులు తప్పిపోయినట్టు బాధపడతారు చాలామంది. అలాంటివారికి ఓ శుభవార్తను తీసుకొచ్చింది ‘మార్స్ పెట్కేర్’ సంస్థ. ఇది ‘పాసమ్’ అనే యాప్ ద్వారా తప్పిపోయిన జంతువులు ఎక్కడున్నాయో ట్రాక్ చేస్తుంది. ‘ఇదొక మొబైల్ ఫేషియల్ రికగ్నిషన్ యాప్. అతి త్వరలోనే పెట్స్ ప్రేమికులకు అందుబాటులోకి రానున్నది. మనుషుల్లానే జంతువులకూ ప్రత్యేకమైన ముఖాకృతి ఉంటుంది. దాన్ని క్యాప్చర్ చేసి, ట్రాక్ చేస్తుంది. వేలాది శునకాల చిత్రాలతో ఈ యాప్ను ప్రయోగాత్మకంగా పరీక్షించారు. నూటికి నూరుశాతం కచ్చితత్వం ఉన్నట్టు తేలింది. దీనికి కృత్రిమ మేధనూ జోడించాం’ అంటారు మార్స్ పెట్కేర్ ఇండియా ప్రతినిధి గణేశ్ రమణి.