ఒక అవ్వ, మనవరాలు హైదరాబాద్ నుంచి తిరుమల కొండకు వచ్చారు. దర్శనం ముగించుకుని తిరుగు ప్రయాణంలో భాగంగా తిరుపతి రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. స్టేషన్ దగ్గరే గోవిందరాజ స్వామి గుడి ఉంది. శనివారమైన ఆరోజు ఉదయం గుడి ముందర నుంచి నగర సంకీర్తన ప్రారంభం కాబోతున్నది. కొందరు మహిళలు ఆ గుడి ముందే రకరకాల పూలు, తులసి మాలలు గంపల్లో పెట్టుకుని అమ్ముతూ ఉన్నారు. అవ్వకి తను పుట్టిన ఊర్లో చిన్నప్పుడు చేసే నగర సంకీర్తనలు గుర్తుకొచ్చాయి. తనకు కూడా నగర సంకీర్తన చేయాలని ఉందని మనవరాలితో చెప్పింది. అయితే మోకాళ్ల నొప్పులు ఎక్కువగా ఉన్నాయని, ఎక్కువ దూరం నడవలేనని వాపోయింది. దాంతోపాటు నగర సంకీర్తన పూర్తయ్యేసరికి రైలు వెళ్లిపోతుందని కూడా ఆవేదన వ్యక్తం చేసింది.
ఇంజినీరింగ్ చదువుతున్న మనవరాలు నగర సంకీర్తన బృందం వైపు చూసింది. తన్మయత్వంతో పాటలు పాడుతున్న గాయకులు, నృత్యం, కోలాటం చేసే వారు, తాళాలు, చిడతలు లాంటి వాద్య పరికరాలు వాడుతున్న భక్తులు కనిపించారు. ఆ బృందానికి ముందు కాషాయం ధరించిన ఓ వ్యక్తి అఖండ దీప స్తంభాన్ని పట్టుకుని నిలబడి ఉన్నాడు. దానికి చిన్న పూలమాల చుట్టి ఉన్నారు. అంతా గమనించిన మనవరాలు అవ్వా… నగర సంకీర్తన చేసే ఆరోగ్యం, సమయం ప్రస్తుతానికి నీకు లేవు. మనసుంటే భక్తికి దూరమనేది ఉండదు. ఒక తులసి మాల కొనుక్కో. కార్యక్రమం పూర్తయ్యేంతవరకూ ఉండే అఖండ దీప స్తంభానికి తులసిమాలను చుట్టు. నీవు తిరగలేకపోయినా నీవు అందించిన తులసిమాల నగరమంతా తిరుగుతుంది. నీ భక్తి ఆ సంకీర్తనలో భాగమవుతుంది అని చెప్పింది. మనవరాలికి ఆలోచనకు అవ్వ మురిసిపోయింది. గబగబా వెళ్లి తులసిమాల కొని అఖండ దీప స్తంభానికి చుట్టింది. ‘అందరూ చేరి భజనలు చేస్తే దిగిరాడా మాధవుడు…’ అని గాయకుడు పాడుతూ ఉండగా భజన బృందం ముందుకు కదిలింది. దీప స్తంభంపైన ఊరేగుతున్న తులసి మాలను చూసిన అవ్వ కళ్లు ఆనంద బాష్పాలు రాల్చాయి.