అంబర్పేట, ఏప్రిల్ 19 : నగరంలో పారిశుధ్య నిర్వహణ ఎలా జరుగుతున్నదో తెలుసుకునేందుకు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి సోమవారం ఆకస్మిక తనఖీ నిర్వహించారు. ఇందులో భాగంగా ఆమె అంబర్పేట డివిజన్లోని గ్రీన్ల్యాండ్ హోటల్ చౌరస్తా, పటేల్నగర్ చౌరస్తాలలో ఉన్న చెత్త డంపింగ్ పాయింట్ను సందర్శించి అక్కడ ఉన్న డస్ట్బిన్ను పరిశీలించారు. మేయర్ అక్కడకు వచ్చిన సమయంలో చెత్త లేకుండా అంతా పరిశుభ్రంగా ఉండటం చూసి అన్నిచోట్ల ఇలాగే ఉంచాలని ఏఎంఓహెచ్ డా. హేమలతకు చెప్పారు. పారిశుధ్య కార్మికులు సక్రమంగా విధులు నిర్వర్తించాలని తెలిపారు. అక్కడ గోడ కూలిపోయి ఉండటాన్ని గమనించిన మేయర్ వెంటనే ఆ గోడ నిర్మాణాన్ని చేపట్టాలని ఆదేశించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అదే సమయంలో ఒక వ్యక్తి బైక్పై కవర్లో చెత్త తీసుకొని వచ్చి అక్కడ వేయడానికి ప్రయత్నించగా గమనించిన మేయర్ ఇంటి దగ్గరకు వచ్చే ఆటోకు చెత్త ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. చెత్తను స్వచ్ఛ ఆటోకే ఇవ్వాలని అతనికి చెప్పి పంపించారు. ఈ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాలని ఆమె పేర్కొన్నారు.