కేపీహెచ్బీ కాలనీ, ఏప్రిల్ 14 : కూకట్పల్లి నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. గురువారం కూకట్పల్లి జోనల్ కార్యాలయం ఎదుట రూ.20 లక్షలతో చేపడుతున్న వీడీసీసీ రోడ్డు పనులు, జోనల్ ఆఫీస్ కార్యాలయంలో రూ.2 లక్షలతో పునరుద్ధరించిన యూసీడీ సెక్షన్ను ఎమ్మెల్యే కృష్ణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ.. ఏడేండ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి పనుల వల్ల దీర్ఘకాలిక సమస్యలన్నీ పరిష్కారమైనట్లు తెలిపారు. కోట్లాది రూపాయల నిధులను వెచ్చించి రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యలను పరిష్కరించడంతో పాటు పార్కులు, క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి చేశామన్నారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం కేపీహెచ్బీ కాలనీలో ఫ్లైఓవర్ బ్రిడ్జి, అండర్పాస్ బ్రిడ్జిలు అందుబాటులోకి వచ్చాయని తద్వారా ప్రజల ఇబ్బందులు తొలిగాయన్నారు. బాలానగర్ ఫ్లైఓవర్, మాదాపూర్, కైత్లాపూర్ ఆర్వోబీ పనులు పూర్తయితే ట్రాఫిక్ సమస్యలు చాలావరకు తీరుతాయన్నారు. వర్షాకాలంలో ముంపు సమస్యలు తలెత్తకుండా నాలాలన్నింటినీ పునరుద్దరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఉప కమిషనర్ రవికుమార్, ప్రాజెక్టు ఆఫీసర్లు శ్రీనివాస్, సంధ్య, మాజీ కార్పొరేటర్ పగడాల బాబూరావు, కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు దేవాది హరినాథ్, ప్రభాకర్ గౌడ్, అంజి, సప్పిడి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
బాలానగర్, ఏప్రిల్ 15 : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. గురువారం ఫతేనగర్ డివిజన్ పరిధి శివాలయం రోడ్డులో రూ. 19 లక్షల నిధులతో తాగునీటి పైపులైన్ పనులకు డివిజన్ కార్పొరేటర్ పండాల సతీశ్గౌడ్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల తాగునీటి ఇబ్బందులు నివారించడం కోసం కోట్లాది నిధులు కేటాయించి రిజర్వాయర్లు నిర్మించినట్లు తెలిపారు. ఆయా రిజర్వాయర్ల ద్వారా నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు తాగునీటి వసతిని మెరుగుపరిచినట్లు ఆయన తెలిపారు. ఫతేనగర్ డివిజన్లో అన్ని ప్రాంతాల ప్రజలకు తాగునీటి ఇబ్బందులను నివారించినట్లు తెలిపారు. ప్రజల ఇబ్బందులను దూరం చేయడానికే ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో జలమండలి మేనేజర్ సుప్రజ, నాయకులు కె. రాములు, కె. భిక్షపతి, సతీశ్, సుధాకర్రెడ్డి, సత్యనారాయణ, కె. రాము, కె. కీర్తి, శంకర్గౌడ్, సురేంద్నాయుడు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యలను పరిష్కరించి, నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నానని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కూకట్పల్లి నియోజకవర్గం మూసాపేట్ వై జంక్షన్ నుంచి బోయిన్పల్లి క్రాస్ రోడ్డు వరకు రూ.70 లక్షల వ్యయంతో, బాలానగర్ నర్సాపూర్ క్రాస్రోడ్డు నుంచి ఐడీపీఎల్ క్రాస్రోడ్డు వరకు రూ.184 లక్షల వ్యయంతో ఏర్పాటు చేయనున్న ఫుట్పాత్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి, ఫతేనగర్ కార్పొరేటర్ పండాల సతీశ్ గౌడ్, కూకట్పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నర్సాపూర్ చౌరస్తావద్ద ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో బాలానగర్ డివిజన్ అధ్యక్షుడు మందడి సుధాకర్ రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.