కృష్ణ పాదాలనే నమ్ముకొని, కృష్ణ లీలలే వింటూ పెరిగాడు ఓ మహనీయుడు. ఆ కృష్ణ నామంతోనే మానవాళి జీవితాలనూ ఉద్ధరించాలనుకున్నారు. ‘హరేకృష్ణ’ ఉద్యమంతో ఆధ్యాత్మిక తరంగా లను ఉవ్వెత్తున ఎగిసేలా చేశారు. ప్రపంచానికి కృష్ణ ప్రేమను పంచి విశ్వ విజేతగా నిలిచారు. ఆ మహనీయుడే ఇస్కాన్ వ్యవస్థాపకుడు శ్రీల ప్రభుపాదులు. ఆ కారణజన్ముడి 126వ జయంతి సందర్భంగా వారి జీవితంలోని కొన్ని సంఘటనలు…
1896 సెప్టెంబర్ 1.. ఊరూవాడా కృష్ణాష్టమి సంబురాలు ఇంకా జరుగుతున్నాయి. కలకత్తాకు కొద్ది దూరంలో, గంగానదీ తీరం, విస్తరించిన పనసచెట్టు కింద రెండు చిన్నగదుల ఇల్లు. ఓ ఇల్లాలు పురుటి నొప్పులతో ఆయాసపడుతున్నది. దూరంగా కృష్ణ భజనలు లీలగా వినిపిస్తున్నాయి. ఆ భగవంతుడి లీలలను విశ్వవ్యాప్తం చేసే నందలాలుడు ఆ ఇంట పుట్టాడు. దివ్యతేజస్సుతో వెలిగిపోతున్న కొడుకును చూసి తల్లి రజని ప్రసవ వేదన మరచిపోయింది. పండంటి బిడ్డను ఎత్తుకొని తండ్రి మోహన్ డే మురిసి పోయాడు. అభయ్ చరణ్ అని పేరు పెట్టాడు. ఆ అభయ్ చరణే భక్తివేదాంత స్వామి. ఆయనే శ్రీల ప్రభుపాద దాస. అంతర్జాతీయ హరేకృష్ణ ఉద్యమ సంస్థాపకాచార్య.
నడిపించిన రథయాత్ర
ఆషాఢ మాసంలో పూరి రథోత్సవం కన్నులపండువగా సాగుతుంది. అదే సమయంలో కలకత్తాలోనూ స్థానికులు రథయాత్ర నిర్వహించేవారు. ఈ యాత్రను చూసిన బాల అభయ్, చిన్న రథం కొనివ్వమని తండ్రిని కోరాడు. వీధులన్నీ తిరిగినా అతను కోరిన రథం దొరకలేదు. అభయ్ ముఖం ముడుచుకుపోయింది. కన్నీళ్లు ఆగలేదు. ఏడుస్తున్న కొడుకును సముదాయిస్తూ ఇంటికి దారితీశాడు మోహన్ డే. మార్గంలో ఓ వృద్ధురాలు ఎదురైంది. పిల్లాడు ఎందుకు ఏడుస్తున్నాడని అడిగింది. కారణం తెలుసుకొని తన దగ్గర మూడు అడుగుల రథం ఉందనీ, కావాలంటే తీసుకో వచ్చని చెప్పింది. అభయ్ ముఖం విప్పారింది. కండ్లు తుడుచుకుంటూ రథాన్ని చూశాడు. అచ్చంగా తను కోరుకున్నదే! మూడు అడుగుల ఎత్తు, ఇబ్బంది లేకుండా నడిచే చక్రాలు, విగ్రహాలు పెట్టుకోవడానికి స్థిరమైన గోపురం..! కృష్ణుడి అనుగ్రహం మొదటిసారి తనపై ప్రసరించిందన్న భావన కలిగింది అభయ్కి. తండ్రీకొడుకులు రథానికి రంగులు వేశారు. కొయ్యగుర్రాన్ని అమర్చారు. అందంగా అలంకరించారు. పీఠంపై జగన్నాథుణ్ని కొలువుదీర్చారు. ‘హరేకృష్ణ’ నామ సంకీర్తన చేస్తూ ముందుకుసాగుతున్న అభయ్ వెంట వీధివీధంతా కదిలింది. అలా మొదలైన కృష్ణ చైతన్య యాత్ర విశ్వవ్యాప్తమైంది.
ఆధ్యాత్మిక గురువు
ఒకరోజు నరేన్ అనే స్నేహితుడు అభయ్ని కలిశాడు. ‘మాయాపూర్ నుంచి ఒక సాధువు వచ్చాడు. మేం చూశాం. నువ్వూ రా! వెళ్దాం’ అన్నాడు. సాధువులపై భిన్నాభిప్రాయం కలిగి ఉన్న అభయ్ మొదట రానన్నాడు. స్నేహితుడి ప్రోద్బలంతో ఆశ్రమానికి వెళ్లాడు. శ్రీల భక్తి సిద్ధాంత స్వామిని చూశాడు. మొదటి చూపులోనే ప్రభావితుడయ్యాడు. ‘మీరు చదువుకున్న యువకుల్లా కనబడుతున్నారు. చైతన్య మహాప్రభు సందేశాలను ప్రపంచమంతా ఎందుకు వ్యాప్తి చేయకూడదు?’ అని అన్నారు భక్తి సిద్ధాంత సరస్వతి. ‘బ్రిటిష్వారు పాలిస్తున్న బానిస దేశం మనది, బానిసలమైన మనం ఏం మాట్లాడినా విదేశీయులు నవ్వు కోవడానికే పనికొస్తుంది’ అన్నాడు అభయ్. భక్తి సిద్ధాంత చిరునవ్వుతో ‘బానిసత్వం తాత్కాలికం. మనిషి ఉన్నంతకాలం కృష్ణ చైతన్యం ఉంటుంది’ అని ఉపదేశించారు. స్వామీజీ మాటలతో.. కవ్వం చిలికిన చందంగా ఆధ్యాత్మిక స్పృహ మనసు అడుగు నుంచి పైకి వచ్చినట్టయింది.
దక్షత గల శిష్యుడికి దీక్ష
1932 అక్టోబర్లో భక్తిసిద్ధాంత సరస్వతి వందలమంది శిష్యులతో కలిసి నెలరోజులపాటు యమునా నది ఒడ్డున ‘పరిక్రమ’ నిర్వహించాలని సంకల్పించారు. అభయ్కి ఈ విషయం తెలిసి తనూ వారిని కలవాలని అనుకున్నాడు. కానీ, వ్యాపార రీత్యా సమయం లేక మానుకున్నాడు. అయితే, తన మనసులో కోరికను ఆపుకోలేక కనీసం ఒక్కరోజైనా తన గురువుతో గడపాలని బయల్దేరాడు. చాలాకాలం తర్వాత వారిని చూడబోతున్నాని అభయ్ హృదయం ఉప్పొంగిపోయింది. గౌడీయ పరిక్రమ శిబిరానికి వెళ్లాడు. భక్తిసిద్ధాంతకు నమస్కరించాడు అభయ్. స్వామి ఒక్కక్షణం ఆగి అతణ్ని చూశారు.
ఆ చూపులో గురువు తనకు దీక్ష ప్రసాదిస్తున్న భావన కలిగింది. దీక్ష తీసుకోవాలన్న కోరికను బలపరచిన కటాక్ష వీక్షణమది. తర్వాత కొన్నాళ్లకు గౌడీయ మందిరం శంకుస్థాపన కోసం భక్తి సిద్ధాంత స్వామి ప్రయాగకు వచ్చారు. అభయ్తోపాటు మరికొందరు దీక్ష తీసుకోవడానికి వెళ్లారు. అభయ్ వంక స్వామి అనుగ్రహ పూర్వకంగా చూశారు. అతని దక్షతను గుర్తించారు. సశాస్త్రీయంగా హోమం నిర్వహించి దీక్షనొసిగారు. ‘అభయ్ చరణారవింద దాస’ అని నామకరణం చేశారు. తర్వాత కొన్నేండ్లకు ‘అభయ్ చరణారవింద దాస’ పూర్తిస్థాయిలో సన్యాసాశ్రమం స్వీకరించి ‘భక్తివేదాంత-శ్రీల ప్రభుపాద దాస’గా విఖ్యాతి చెందారు.
శ్రీల ప్రభుపాదుల వారు కృష్ణ చైతన్యంపై 70కిపైగా గ్రంథాలు రచించారు. 1968-77 వరకు 22వేల పేజీల భాష్యాల ప్రచురణకు వీలుగా శబ్ద యంత్రాల్లో నిక్షిప్తం చేశారు. వారి సంస్కృత అనువాదాలు, భాష్య రచనలు ప్రామాణికతకు, జ్ఞాన గాంభీర్యానికీ పెట్టిందిపేరు. తన గ్రంథాలను ప్రచురించేందుకు భక్తివేదాంత బుక్ ట్రస్ట్ను నెలకొల్పారు.
కృష్ణుడు తోడుగా..
‘విదేశాలకు వెళ్లి కృష్ణ చైతన్యం ప్రచారం చేయి’ అని భక్తివేదాంతుడిని భక్తిసిద్ధాంత సరస్వతి అడిగి అప్పటికి నలభై ఏండ్లు అయింది. తర్వాత అభయ్ సంసారి అయ్యారు. పిల్లలకు తండ్రి అయ్యారు. వ్యాపారవేత్తగా ఎదిగారు. అభయ్ చరణారవిందగా, భక్తివేదాంత స్వామిగా కృష్ణుడికి తన జీవితాన్ని అంకితం చేశారు. దాదాపు 70 ఏండ్ల వయసులో విదేశాలకు వెళ్లే అవకాశం వచ్చింది ప్రభుపాదులకు. భక్తుల సహకారంతో 1965 ఆగస్టు 13న అమెరికా వెళ్లే ‘జలదూత’ ఓడ ఎక్కారు. ఓడ నడి సంద్రానికి చేరుకుంది. హోరున వర్షం. బృందావనం నుంచి దూరమవుతానన్న ఆలోచన కలిగింది స్వామికి. ఆగస్టు 20న కృష్ణాష్టమి సందర్భంగా ఓడలోనే కృష్ణ తత్త్వంపై ప్రసంగించారు స్వామి. అదే తత్తాన్ని అమెరికాలో వినిపించాలి. విదేశాల్లో గెలిపించాలి.
అదే ఆలోచన. సముద్రయానంలో రెండుసార్లు తీవ్రమైన గుండెపోటుకు గురయ్యారు స్వామి. ఆ సమయంలో స్వప్నంలో శ్రీకృష్ణుడు సాక్షాత్కరించాడు. తోడుగా ఉండి జలదూత నౌకను క్షేమంగా గమ్యానికి చేర్చినట్టు అనిపించింది స్వామికి. మొత్తానికి సెప్టెంబర్ 19న అమెరికాలో అడుగుపెట్టారు ప్రభుపాదులు. అక్కడి భక్తుల సహకారంతో ఆ దేశంలో కృష్ణ తత్తాన్ని ప్రచారం చేశారు. 1966 అక్టోబర్ 9న న్యూయార్క్లోని టాంప్కిన్స్క్వేర్ పార్క్లో హరేకృష్ణ సంకీర్తనం చేపట్టిన శ్రీల ప్రభుపాదులు పశ్చిమదేశాల్లో శ్రీచైతన్య మహాప్రభువు సంకీర్తనోద్యమానికి నాంది పలికారు. హరేకృష్ణ ఉద్యమంలో భాగంగా ‘ఇస్కాన్’ సంస్థను నెలకొల్పి ప్రపంచ వ్యాప్తంగా 108 రాధాకృష్ణ మందిరాలను నిర్మించారు. ఆధ్యాత్మిక సాధన కోసం, భగవంతుడి అనుగ్రహం కోసం ‘హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే, హరేరామ హరేరామ రామ రామ హరే హరే’ నామాన్ని అనుగ్రహించి, నిత్యం 16 మాలలు జపించాలని సూచించారు. కృష్ణ భక్తులకు దిశను నిర్దేశించారు.