పరుగు ఆపి కాస్త సేదతీరితే గమ్యంవైపు మరింత ఉత్సాహంతో అడుగులు వేయొచ్చు. సంధికాలంలో జీవితాన్ని తరచి చూసుకునే వీలుంటుంది. మన కథానాయికల్లో కొంత మంది ఇదే ఫిలాసఫీని ఫాలో అవుతున్నారు. వృత్తిపరంగా వచ్చిన విరామాన్ని కెరీర్కు ప్రతిబంధకంగా భావించకుండా దానినొక సానుకూలాంశంగా స్వీకరిస్తున్నారు. ప్రయాణంలోని తప్పొప్పుల్ని సమీక్షించుకోవడానికి బ్రేక్ అవశ్యమని చెబుతున్నారు. తిరిగి నూతనోత్తేజంతో కెరీర్లో దూసుకుపోవడానికి విరామం మంచిదే అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
వరుణ్తేజ్ కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వంలో 2015లో రూపొందిన ‘కంచె’ సినిమాలో చక్కటి అభినయంతో ఆకట్టుకుంది ప్రగ్యాజైస్వాల్. పీరియాడికల్ వార్ డ్రామాగా రూపొందిన ఈసినిమాలో ఆమె నటన, పాత్రకు ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా ద్వారా కెరీర్లో తొలి కమర్షియల్ సక్సెస్ అందుకున్న ప్రగ్యాజైస్వాల్ టాలీవుడ్లో మాత్రం ఆశించిన మేర అవకాశాల్ని దక్కించుకోలేకపోయింది. ‘ఓం నమో వేంకటేశాయ’, ‘గుంటూరోడు’తో పాటు మరికొన్ని సినిమాల్లో కథానాయికగా నటించినా ఆమెకు ఆ సినిమాలేవీ విజయాల్ని తెచ్చిపెట్టలేకపోయాయి. 2018లో విడుదలైన ‘ఆచారి అమెరికా యాత్ర’ తర్వాత టాలీవుడ్కు దూరమైంది ప్రగ్యాజైస్వాల్. తాజాగా బాలకృష్ణ ‘అఖండ’ చిత్రంలో కథానాయికగా నటించే అవకాశాన్ని అందుకున్న ఆమె ఈ సినిమాతో మూడేళ్ల తర్వాత తెలుగులో పునరాగమనం చేయబోతున్నది.
పవన్కల్యాణ్, అల్లు అర్జున్, నాని లాంటి అగ్ర కథానాయకులతో సినిమాలు చేసినా అను ఇమ్మాన్యుయేల్కు అదృష్టం మాత్రం కలిసిరాలేదు. ‘అజ్ఞాతవాసి’, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ లాంటి భారీ చిత్రాల్లో కథానాయికగా నటించి అందరి దృష్టిని ఆకర్షించిందీ సొగసరి. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ చిత్రాలు పరాజయం పాలవడంతో దాదాపు మూడేళ్ల పాటు తెలుగు సినిమాలకు దూరమైంది . ఈ ఏడాది ఆరంభంలో ‘అల్లుడు అదుర్స్’తో పునరాగమనం చేసిన అను ఇమ్మాన్యుయేల్ ప్రస్తుతం ‘మహాసముద్రం’ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. నటిగా తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకునేందుకు ఈ మూడేళ్ల విరామం ఉపకరించిందని చెప్పింది అను ఇమ్మాన్యుయేల్.
మహేష్బాబు, సుకుమార్ కలయికలో రూపొందిన ‘వన్ నేనొక్కడినే’ సినిమాతో టాలీవుడ్లో అరంగేట్రం చేసింది ముంబయి ముద్దుగుమ్మ కృతిసనన్. తొలి సినిమాలో అందచందాలతో ఆకట్టుకున్న ఆమె ఆ తర్వాత నాగచైతన్య సరసన ‘దోచేయ్’లోనూ నటించింది. ఆ తర్వాత బాలీవుడ్ బాట పట్టిన ఈ సుందరి అగ్ర కథానాయికల్లో ఒకరిగా ఎదిగింది. దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత ‘ఆదిపురుష్’ సినిమాతో తిరిగి టాలీవుడ్ గడప తొక్కబోతున్నది కృతిసనన్. ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. రామాయణ గాథ ఆధారంగా త్రీడీ హంగులతో రూపొందుతున్న ఈ చిత్రంలో సీత పాత్రలో ఆమె కనిపించబోతున్నది. ఈ సినిమా తనకు జాతీయస్థాయిలో గుర్తింపును తీసుకొస్తుందనే నమ్మకం ఉందని చెప్పింది కృతిసనన్. గత కొంతకాలంగా సినిమాల ఎంపికలో నవ్యతకు ప్రాముఖ్యతనిస్తోంది సమంత. ‘జాను’ పరాజయం తర్వాత ఏడాది పాటు తెలుగు సినిమాలకు విరామం తీసుకున్న ఆమె ఇటీవలే ‘శాకుంతలం’ చిత్రానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. శకుంతల, దుష్యంతుల ప్రణయగాథను దృశ్యమానం చేస్తూ పౌరాణిక కథాంశంతో దర్శకుడు గుణశేఖర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఇందులో శకుంతలగా సమంత కనిపించబోతున్నది. ఆమె కెరీర్ తొలి పౌరాణిక సినిమా ఇది. దిల్రాజు, నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జయాపజయాలకు అతీతంగా తెలుగులో అనుపమ పరమేశ్వరన్ కెరీర్ సాగుతోంది. ‘రాక్షసుడు’తర్వాత తెలుగు సినిమాలకు రెండేళ్ల విరామం తీసుకున్న ఆమె ప్రస్తుతం నిఖిల్ సరసన ‘18 పేజెస్’ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ‘ప్రేమమ్’లో నాగచైతన్యకు జోడీగా నటించిన మడోన్నా సెబాస్టియన్ ఐదేళ్ల తర్వాత నాని ‘శ్యామ్సింగరాయ్’తో మళ్లీ తెలుగు తెరపై కనిపించబోతున్నది. కథానాయికగా చక్కటి అవకాశాలతో దూసుకుపోతున్న తరుణంలో స్వీయ కారణాలతో మూడేళ్ల పాటు సినిమాలకు దూరమైంది శృతిహాసన్. సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఏడాది తెలుగులో పునరాగమనం చేసిన ఆమె ‘క్రాక్’, ‘వకీల్సాబ్’ చిత్రాలతో మంచి విజయాల్ని దక్కించుకుంది.