పర్పుల్ కలర్లో ఐఫోన్ 12 సిరీస్ హ్యాండ్సెట్లు.. ఐమ్యాక్ కనీస ధర రూ.1,19,900
న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: అంతర్జాతీయ టెక్ దిగ్గజం యాపిల్ ఈ ఏడాది తన తొలి ఈవెంట్ను మంగళవారం అమెరికాలో నిర్వహించింది. ‘స్ప్రింగ్ ఈవెంట్-2021’ పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలు నూతన ఉత్పత్తులను ఆవిష్కరించింది. వీటిలో ఐప్యాడ్ ప్రో ట్యాబ్లెట్లు, యాపిల్ టీవీ 4కే, సిరి రిమోట్, ఎయిర్ట్యాగ్ లాంటివి ఉన్నాయి. అంతేకాకుండా యాపిల్ ఉత్పత్తుల్లో బెస్ట్ సెల్లర్గా నిలిచిన ఐఫోన్ 12 (రూ.79,900), ఐఫోన్ 12 మినీ (రూ.69,900) హ్యాండ్సెట్లను పర్పుల్ కలర్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇవి ఈ నెల 23 నుంచి బుకింగ్కు అందుబాటులో ఉంటాయని, ఏప్రిల్ 30 నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. అయితే ఇవి భారత్లో అందుబాటులో ఉంటాయో లేదో వెల్లడించలేదు. మరోవైపు ఎం-1 చిప్తో పనిచేసే సరికొత్త ఐమ్యాక్ డెస్క్టాప్ కంప్యూటర్ను కూడా ఆవిష్కరించింది. మూడు రకాల స్టోరేజీ ఆప్షన్లలో లభ్యమయ్యే ఈ డెస్క్టాప్ బేస్ వేరియంట్ ధరను రూ.1,19,900గా నిర్ణయించింది. 24 అంగుళాల 4.5కే రెటీనా డిస్ప్లేతో కూడిన కొత్త ఐమ్యాక్లో 7-కోర్ జీపీయూ, 1080పీ ఫేస్టైమ్ హెచ్డీ కెమేరా, స్టూడియో క్వాలిటీ మైక్స్, సిక్స్ స్పీకర్ సౌండ్ సిస్టమ్, టచ్ ఐడీ లాంటి ప్రత్యేక ఫీచర్లున్నాయి.