అంగన్వాడీలు, ప్రభుత్వ ఆసుపత్రులకు కూడా..
ఆరోగ్యం కోసమే సురక్షిత నీరు
కొవిడ్ కారణంగా పెరిగిన మంచినీటి వినియోగం
ఖమ్మం, మార్చి 23: కలుషిత నీటిని, ఫ్లోరైడ్ రక్కసిని పారదోలేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘భగీరథుడిని’ తీసుకొచ్చింది. పల్లెలు, తండాలు, గూడేల్లోని ఇంటింటికీ శుద్ధజలం అందించేందుకు భగీరథ ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యింది. ‘సుజలం సఫలం’ అనే నినాదంతో మారుమూల పల్లెలకూ సురక్షిత నీరు అందేలా పనులను యజ్ఞంలా పూర్తి చేసింది. ఇప్పటికే చాలా గ్రామాలకు శుద్ధజలం అందిస్తుండగా.. సర్కారు బడికి, గుడికి, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రులు, కార్యాలయాలకు భగీరథ నీరు అందించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఖమ్మం జిల్లాలో ఇందుకు సంబంధించిన పనులను శరవేగంగా చేపడుతున్నది. ఇప్పటికే 584 గ్రామ పంచాయతీలు, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్తోపాటు వైరా, మధిర, సత్తుపల్లి మున్సిపాలిటీల్లో ప్రతి ఇంటికీ భగీరథ నీరందిస్తోంది. జిల్లాలోని ప్రభుత్వ, పంచాయతీ కార్యాలయాలు, ఆలయాలు, మసీదులు, చర్చీలకు నల్లా కనెక్షన్లు ఇచ్చి శుద్ధజలం అందించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీని ద్వారా నీటి కొరత తీరడంతోపాటు సురక్షిత నీరందనున్నది.
గ్రామ పంచాయతీ కార్యాలయాలకు, చర్చీలకు, మసీదులకు, దేవాలయాలకు నల్లా కనెక్షన్లు ఇస్తున్నారు. వీటి ద్వారాభక్తులకు మంచినీటి కొరత లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. కొవిడ్ కారణంగా ప్రతి ఒక్కరిలోనూ ఆరోగ్యంపై అవగాహన పెరిగింది. సురక్షిత మంచినీటిని డబ్బులు పెట్టి కొనుక్కొని తాగుతున్నారు. ప్రభుత్వం కొవిడ్ కంటే ముందుగానే మిషన్ భగీరథను ప్రవేశపెట్టింది. నల్లాల ద్వారా ఇంటింటికీ మంచినీరు అందిస్తున్న ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ భవనాలు, ఆస్తులు ఎక్కడ ఉంటే అక్కడ భగీరథ నల్లా కనెక్షన్ ఇవ్వాలని నిర్ణయించింది.
1,311 ప్రభుత్వ విద్యాసంస్థలకు..
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు కలుషిత, ఫ్లోరైడ్ నీరు తాగి వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు మిషన్ భగీరథ నీటిని ప్రతి పాఠశాలకూ అందిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో 1,004 ప్రాథమిక పాఠశాలలు, 211 ఉన్నత పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన 56 గురుకులాలు, కేంద్రీయ విద్యాలయాలు, మోడల్ స్కూళ్లు, నవోదయ స్కూళ్లు 4, కేజీబీవీలు 14, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 19, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు 5, పీజీ కళాశాల ఒకటి ఉన్నాయి. మొత్తం 1311 ప్రభుత్వ విద్యాసంస్థలకు నల్లా కనెక్షన్లు ఇచ్చారు. గతంలో పాఠశాలల విద్యార్థులకు మంచినీరు అందాలంటే ఎంతో వ్యయప్రయాసలు పడాల్సి వచ్చేది. పాఠశాల ఆవరణలో బోర్లు, బావులు ఉంటే కొంతమేర నీటి ఎద్దడి తక్కువగా ఉండేది. లేదా కొన్ని గ్రామాల్లో పంచాయతీల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. అది కూడా సురక్షితమైనది కాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడిన సంఘటలు అనేకం. ప్రస్తుతం భగీరథ నీటిని అందించడం వల్ల విద్యార్థులకు తాగునీటి సమస్య తీరినట్లయింది.
అంగన్వాడీ కేంద్రాలకు..
ఖమ్మం జిల్లాలోని 1,864 అంగన్వాడీ కేంద్రాలకు శుద్ధిచేసిన తాగునీరును అందించేందుకు జిల్లా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. వీటిలో ప్రభుత్వ భవనాలు ఉన్న ప్రతి అంగన్వాడీ కేంద్రానికీ మంచినీరు అందించేందుకు నల్లా కనెక్షన్ ఇస్తున్నారు.
ప్రార్థనా మందిరాలకు..
జిల్లాలోని అన్ని ప్రార్థనా మందిరాలకూ మిషన్ భగీరథ మంచినీరు అందుతుంది. ప్రభుత్వ గుర్తింపు ఉన్నవి, లేనివి కలిపి సుమారు 386 దేవాలయాలు ఉన్నాయి. వీటన్నింటికీ మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లు ఇచ్చారు. సుమారు 2 వేల చర్చీలు ఉండగా వాటిల్లో చాలా వరకూ నల్లా కలెక్షన్లు ఇచ్చారు. 287 మసీదులకు కూడా నల్లాలను బిగించారు.
ఆసుపత్రులు, గ్రామ పంచాయతీలకు..
584 గ్రామ పంచాయతీల్లో ప్రతి పంచాయతీ భవనం వద్ద మిషన్ భగీరథ నల్లా కనెక్షన్ ఇచ్చారు. కొన్ని గ్రామాల్లో ఉన్న కమ్యూనిటీ హాళ్లు, గ్రంథాలయాలకు కూడా నల్లా కనెక్షన్ ఇచ్చారు. 26 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 4 అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 3 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లతోపాటు ఖమ్మం ప్రభుత్వ ప్రధాన వైద్యశాల, సత్తుపల్లి, నేలకొండపల్లి ప్రభుత్వ వైద్యశాలలకు కూడా మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లు ఇచ్చారు.
ప్రతి ప్రభుత్వ భవనానికీ నల్లా కనెక్షన్
‘రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రతి ప్రభుత్వ భవనానికీ మిషన్ భగీరథ నల్లా కనెక్షన్ ఇస్తున్నాం. దాదాపు అన్ని రకాల భవనాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలు, అంగన్వాడీలు, పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రార్థనా మందిరాలకు సురక్షిత మంచినీటిని అందించాలనే ఉద్దేశంతో ఉచితంగానే నల్లా కనెక్షన్లు ఇస్తున్నాం.’
-పుష్పలత, ఈఈ, మిషన్ భగీరథ