వరంగల్, మార్చి 2 : గ్రేటర్ కార్పొరేషన్ ఆవరణలో చేపట్టిన నూతన పరిపాలనా భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని మేయర్ గుండు సుధారాణి ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం అధికారులతో కలిసి నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రూ. 20 కోట్లతో నిర్మిస్తున్న పరిపాలనా భవనంలో అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. రజకుల అభ్యున్నతి కోసం రాష్ట్ర వ్యాప్తంగా 141 మున్సిపాలిటీల్లో మోడ్రన్ ధోబీ ఘాట్ల నిర్మాణం కోసం రూ. 282 కోట్లు మంజూరు చేసిన మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. మేయర్ వెంట ఎస్ఈ ప్రవీణ్ చంద్ర, ఈఈ రాజయ్య, సిటీ ప్లానర్ వెంకన్న, సీహెచ్వో శ్రీనివాసరావు, సీఎంహెచ్వో డాక్టర్ రాజేశ్, డీఈలు రవికుమార్, రవికిరణ్ ఉన్నారు.
ఖాళీ ప్రదేశాల అభివృద్ధి..
వరంగల్ మహా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చిన్నారుల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని మేయర్ తెలిపారు. గురువారం ‘లండన్ స్కూల్ ఆఫ్ అర్బన్-95’ అనే అంశంపై జూమ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. వివిధ దేశాలకు చెందిన 114 మంది మేయర్లు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కార్పొరేషన్ బడ్జెట్లో 10 శాతం నిధులను గ్రీన్ బడ్జెట్కు కేటాయించి నగరంలో చిన్నారుల కోసం పార్కులు, ఓపెన్ స్పేసెస్ను అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. నిరుపయోగ వస్తువులతో స్లమ్ కాలనీలో 56 గంటల్లో పిల్లల కోసం ‘చిట్టి’ పార్కును ఏర్పాటు చేశామని తెలిపారు.
మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అఫైర్స్ ద్వారా జాతీయ స్థాయిలో అవార్డును గెలుచుకున్నామని చెప్పారు. ప్రణాళికాబద్ధంగా నగరంలో గ్రీనరీ, పార్కులను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. 3 సంవత్సరాలు పైబడిన పిల్లలు, వారి తల్లిదండ్రులకు అనుకూలమైన వాతావరణం కల్పించడం, రహదారుల వెంట పచ్చదనం పెంపొందించేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు.