వరంగల్చౌరస్తా, జూన్ 13: మనిషి ప్రాణాలను నిలిపే రక్తం ప్రాణాపాయ స్థితిలో అందక చనిపోతున్న వారి సంఖ్య చాలానే ఉంటున్నది. అలాంటి పరిస్థితిలో ఉన్న వారితో తమకు బంధుత్వాలు లేకున్నా తమ రక్తాన్ని పంచి రక్తబంధాన్ని కలుకొంటూ తమదైన రీతిలో సమాజానికి సేవ చేస్తున్న వారే రక్తదాతలు. లక్షల కోట్లు ఖర్చు చేసినా కృత్రిమంగా తయారు చేయలేని రక్తాన్ని దాతలు మాత్రమే ఇవ్వగలరు. అనుమానాలు, అపోహలకు పోయి రక్తదానం చేయడానికి ముందుకు రాని చాలా మందిలో రక్తదానం మూలంగా ఎలాంటి ఇబ్బందులు లేవనే నమ్మకాన్ని కలిగిస్తూ తాము చేస్తూ.. మరొకరితో చేయిస్తూ.. క్షతగాత్రుల ప్రాణాలు కాపాడుతున్నారు.
స్నేహితుడి తల్లి మరణం తట్టుకోలేక ..
సమయానికి రక్తం అందక నా స్నేహితుడు తన తల్లిని కోల్పోయిన ఘటన నన్ను 28 సార్లు రక్తదానం చేయడంతోపాటు శిబిరాలు ఏర్పాటు చేసేలా చేసింది. దీంతో యువనేతాజీ ఫౌండేషన్ను స్థాపించి మిత్రుల సహకారంతో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటి వరకు సుమారు ఐదు వేల మందితో రక్తదానం చేయించడంతోపాటు తక్కువ మందిలో మాత్రమే ఉండే బ్లడ్ గ్రూపు కలిగిన వారితో ప్రత్యేక వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నాం. కరోనా కాలంలో ప్లాస్మా సేకరణ కేంద్రానికి సైతం ఫౌండేషన్ తరఫున సహకారం అందించాం. ఇతర జిల్లాల నుంచి దాతలను పిలిపించి రక్తం అందించిన సందర్భాలూ చాలానే ఉన్నాయి. రక్తం పొందిన వ్యక్తి లేదా వారి కుటుంబ సభ్యులు కలిసి కృతజ్ఞతలు తెలిపిన సందర్భంలో పొందే ఆనందం మాటల్లో చెప్పలేనిది.
– కొత్తకొండ అరుణ్కుమార్, యువనేతాజీ ఫౌండేషన్ అధ్యక్షుడు, వరంగల్ గిర్మాజీపేట
యువత రక్తదానం చేయాలి
ఈ రోజుల్లో మానవుని శరీరంలోని కొన్ని అవయవాలను కృత్రిమంగా తయారు చేసి ప్రాణాలు నిలిపే అవకాశాలు ఉన్నాయి. కానీ, కోట్లు ఖర్చు చేసినా కృత్రిమంగా తయారు చేయలేనిది రక్తం. క్షతగాత్రుల ప్రాణాలను కాపాడటానికి అవసరమైన రక్తాన్ని దాతల నుంచి మాత్రమే సేకరించగలం. రక్తదానం చేయడాన్ని బాధ్యతగా భావించాలి. ముఖ్యంగా 18 నుంచి 50 ఏళ్లలోపు వయస్సు కలిగి ఉండి, 50 కేజీల బరువుకు మించి ఉన్న వారు రక్తదానం చేయొచ్చు. గతంతో పోల్చితే రక్తదాతల సంఖ్య పెరిగినప్పటికీ అంతకు మించి రక్తం వినియోగం పెరిగింది. దీంతో నిత్యం రక్తం సేకరణ తప్పనిసరిగా మారింది.
– డాక్టర్ అప్పాల ప్రసాద్,
ఎంజీఎం బ్లడ్ బ్యాంకు వైద్యాధికారి 126వ సారి రక్తదానానికి సిద్ధంగా ఉన్నా..
సుమారు 34 ఏళ్ల నుంచి ప్రతి మూడు నెలలకోకసారి రక్తదానం చేస్తున్నా. మొదట్లో జూన్ 14న నా పుట్టిన రోజు అని ఎంజీఎంలో రక్తదానం చేశాను. అదేరోజు రక్తదాతల దినోత్సవమని తెలిసి ఏటా రక్తదానం చేస్తున్నా. రక్తదానం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వైద్యులు చెప్పారు. అప్పటి నుంచి మూడు నెలలకోకసారి రక్తదానం చేస్తున్నా. నాటి నుంచి నేటి వరకు ప్రపంచ రక్తదాన దినోత్సవం, ప్రపంచ రక్తదాతల దినోత్సవంతోపాటు గాంధీ జయంతి లాంటి ప్రత్యేక సందర్భాల్లో మూడు నెలలకోసారి రక్తం ఇస్తున్నా. నేను రక్తదానం చేయడంతోపాటు మా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సైతం సుమారు 100 పైగా యూనిట్ల రక్తాన్ని అందించాం.
– తోట రాజేశ్వర్రావు, మట్టెవాడ, వరంగల్
నేడు ఎంజీఎంలో మెగా రక్తదాన శిబిరం
వరంగల్చౌరస్తా: ఎంజీఎం బ్లడ్ బ్యాంకులో బుధవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు యువనేతాజీ ఫౌండేషన్ అధ్యక్షుడు కొత్తకొండ అరుణ్కుమార్ తెలిపారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎంజీఎం బ్లడ్ బ్యాంకులో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ శిబిరాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులతోపాటు అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి అందించేందుకు ఏర్పాటు చేస్తున్న ఈ శిబిరంలో పాల్గొనే వారు 9666109108, 9951751796, 9490115105, 7993997791 నంబర్లలో సంప్రదించాలని కోరారు.