హసన్పర్తి, మార్చి 25 : ఎర్రగట్టుగుట్ట వేంకటేశ్వరస్వామి జాతర బ్రహ్మోత్సవాలు సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. హసన్పర్తి, భీమారంలోని వేంకటేశ్వరస్వామి ఆలయాల నుంచి రథాలపై శ్రీదేవి, భూదేవీ సమేత స్వామివారి ప్రతిమలను డప్పుచప్పుళ్లతో ఊరేగింపుగా ఎర్రగట్టు గుట్ట వేంకటేశ్వరస్వామి ఆలయానికి తీసుకొచ్చారు. రాత్రి 11.48 గంటలకు అర్చకులు వైభవంగా స్వామివారి కల్యాణం నిర్వహించారు. అనంతరం జాతర ప్రారంభమైంది. ఈ జాతరకు వివిధ రాష్ర్టాల నుంచి భక్తులు తరలివచ్చి వేంకటేశ్వరస్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. అలాగే, వివిధ గ్రామాల నుంచి భక్తులు రాత్రి ఎడ్లబండ్లతో వచ్చి గుడిచుట్టూ తిరిగి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ వేడుకలు ఐదు రోజులపాటు జరుగనున్నాయి.