హనుమకొండ, జనవరి 8 : దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ఎస్సీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులు, వయోజనుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. హనుమకొండలో నూతనంగా నిర్మించిన దివ్యాంగుల వసతి గృహాన్ని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్తో కలిసి ఆదివారం సాయంత్రం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ చీఫ్ విప్ ప్రత్యేక చొరవతో రూ.1.80 కోట్లతో దివ్యాంగులకు వసతి గృహాన్ని నిర్మించినట్లు తెలిపారు.
హాస్టల్ స్థలం ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను మంత్రి ఆదేశించారు. బ్యాక్లాగ్ పోస్టుల సమస్యను త్వరలో పరిష్కరించనున్నట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే 1.32 లక్షల పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం.. కొత్తగా 80 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఓహెచ్ దివ్యాంగులకు రోస్టర్ విధానం సాధ్యాసాధ్యాలను పరిశీలించడంతో పాటు బ్యాక్లాగ్ పోస్టుల్లో అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
సీఎం కేసీఆర్ దివ్యాంగులకు అన్నిరకాల సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దేశంలో ఎకడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రూ.3,016 పింఛన్ అందిస్తున్నట్లు వివరించారు. గత ప్రభుత్వాలు దివ్యాంగులను పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దివ్యాంగులకు ఇచ్చే మూడు చక్రాల సైకిళ్ల కోసం కాళ్ల చెప్పులు అరిగేలా తిరిగేవారని, ఇప్పడు ఫోన్ చేస్తే వారి ఇంటికి తీసుకెళ్లి ఇస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
బడాయికొట్టే గుజరాత్ రాష్ట్రంలో అన్ని రకాలకు సంబంధించి 12 వేల మందికి పింఛన్లు ఇస్తుంటే, తెలంగాణలో 48 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నట్లు వెల్లడించారు. బీజేపీ రాష్ర్టాల ప్రభుత్వాలు మసకబారి పోయాయని ఆయన ఎద్దేవా చేశారు. ఉద్యోగాల భర్తీ విషయంలో కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇన్ని నోటిఫికేషన్లా అని ఆశ్చర్యపోయాడని గుర్తు చేశారు. త్వరలో దివ్యాంగుల శిక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తామని చేప్పారు.
సుబేదారిలోని దివ్యాంగుల హాస్టల్ స్థలం ఆక్రమణకాకుండా రక్షణ చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ తెలిపారు. ఈ విషయంలో ఇప్పటికే కలెక్టర్, పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఆక్రమణదారులు హాస్టల్ వార్డెన్పై దాడులకు పాల్పడుతున్నారని దివ్యాంగులు చెప్పడంతో వెంటనే వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేయాలని సుబేదారి పోలీసులను చీఫ్ విప్ ఆదేశించారు. అధికారుల నిర్లక్ష్యంతో స్థలం ఆక్రమణకు గురవుతుందన్నారు.
దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు వివరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, దివ్యాంగుల హాస్టళ్లలో పౌష్టికాహారం అందిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోనే అత్యాధునిక వసతులతో దివ్యాంగుల హాస్టల్ నిర్మించడం ఇదే మొదటిదని అన్నారు.
2014 నుంచి 2020 వరకు రూ.36 కోట్ల విలువ చేసే పరికరాలను 40 వేల మందికి అందజేసినట్లు ఆయన చెప్పారు. అనంతరం హాస్టల్ ఆవరణలో మొక్కలు నాటారు. జిల్లా పరిషత్ చైర్మన్ సుధీర్కుమార్, కుడా చైర్మన్ సుందర్రాజ్యాదవ్, సివిల్ సప్లయ్ విభాగం విజిలెన్స్ మెంబర్ డాక్టర్ కే అనితారెడ్డి, జిల్లా సంక్షేమాధికారి ఎం సబిత, కార్పొరేటర్ వసంత, మాజీ కార్పొరేటర్ జోరిక రమేశ్, విద్యార్థి సంఘం నాయకుడు వీరేందర్, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.