గిర్మాజీపేట, సెప్టెంబర్ 1: పోరాడి సాధించుకొన్న తెలంగాణలో జెట్స్పీడ్తో అభివృద్ధి జరుగుతున్నదని, ప్రజలు దీన్ని గుర్తించి వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను మరోసారి గెలిపించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ కోరారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, మేయర్ గుండు సుధారాణితో కలిసి వినోద్ కుమార్ శుక్రవారం 29వ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జన హితమే సీఎం కేసీఆర్ అభిమతమని చెప్పారు. సబ్బండ వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర సర్కారు కృషి చేస్తున్నదన్నారు. పుష్కలంగా సాగునీరు.. 24గంటల కరెంటుతో రైతుల్లో సంబురం నెలకొందని, ఏటా రెండు పంటలు పండించి ఆర్థికంగా నిలదొక్కుకొన్నారని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రా నాయకుల వల్లే తెలంగాణ వెనుకబడిందని, అప్పటి కాంగ్రెస్ నాయకులు గంగిరెద్దుల్లా తలలు ఊపడంతో ఈ ప్రాంతానికి అన్యాయం జరిగిందని విమర్శించారు.
అన్ని వర్గాల ప్రజల, వృత్తిదారుల అభ్యన్నతి, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన చీఫ్ విప్, పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్, మేయర్ గుండు సుధారాణితో కలిసి 29వ డివిజన్లో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం 29వ డివిజన్లోని కుంటిభద్రయ్య గుడి ఆవరణలో ఏర్పాటుచేసిన సమావేశంలో బోయినపల్లి మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణలో అందరూ సుభిక్షంగా ఉండాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారన్నారు. గ్రామాల ప్రజలు ఆరోగ్యంగా ఉంటూ సమయానుకూలంగా పంటలు పండించి ఆర్థికాభివృద్ధిని సాధించినపుడు మాత్రమే పట్టణ ప్రజల జీవనం సాగుతుందన్నారు. తద్వారా పట్టణ ప్రజలు కూడా ఆర్థిక స్థిరత కలిగి ఉంటారని ముందుచూపుతో గ్రహించిన సీఎం కేసీఆర్ వ్యవసాయానికి సాగునీరు అందించడంతో గ్రామాల ప్రజలు, కర్షకులు ఆర్థిక ప్రగతిని సాధించుతున్నారన్నారు. ప్రస్తుత జనరేషన్ పిల్లలు కరెంట్ పోయిందంటే ఆశ్యర్యపోవడానికి కారణం సీఎం కేసీఆర్ తెలంగాణలో 24 గంటల పాటు నిరంతర కరెంట్ సరఫరా చేయటమే అని ప్రశంసించారు. ఇవన్నీ గత పాలకుల హయాంలో జరగలేదన్నారు. ప్రజలు వీటన్నింటిని గుర్తించాలని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో గోదావరి జలాలు తెలంగాణలో నిల్వ చేయలేమని చెబితే అప్పటి స్థానిక రాజకీయనాయకులు గంగిరెద్దులా తల ఊపారన్నారు.
సీఎం కేసీఆర్ వాళ్ల మాటలు నమ్మకుండా గోదావరి జలాలను 120 బిల్డింగుల ఎత్తుకు పంపింగ్ చేసి నిల్వ ఉంచారన్నారు. ఇప్పుడు మండుటెండల్లో కూడా చెరువుల మత్తళ్లు దూకుతున్నాయంటే అది సీఎం కేసీఆర్ ఘనతే అనారు. దాస్యం వినయ్భాస్కర్ మాట్లాడుతూ 2009లో శాసనసభ్యుడిగా గెలిపించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని, టికెట్ ఇచ్చింది కేసీఆర్ అని గుర్తుచేశారు. కేసీఆర్ నమ్మకాన్ని వమ్ముచేయకుండా ప్రజల ఆశయాలకు అనుకూలంగా పనిచేశానన్నారు. 2009 కంటే ముందు నా డివిజన్కు రూ.50 వేలు నిధులు తీసుకురాలేని పరిస్థితి ఉందన్నారు. 2009లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా రూ.5 లక్షలు కూడా తీసుకురాలేక పోయానన్నారు. తెలంగాణ వచ్చిన తరువాత ఒక్కొక్క డివిజన్కు రూ.50 కోట్ల నిధులతో అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లు చెప్పారు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియని కొత్తకొత్త కాలనీలు కొత్తకొత్త సమస్యలు ఉంటాయని అన్నింటిని అధిగమించి పనిచేసినప్పుడే అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. కష్టకాలంలో ఎల్లప్పుడూ ప్రజల మధ్యలో ఉండేది బీఆర్ఎస్ కార్యకర్తలే అని అన్నారు. 40 ఏండ్ల క్రితం ఈ నియోజకవర్గంలో పేదవారందరూ ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్నారని, వారందరికీ తెలంగాణ ప్రభుత్వం ఆత్మగౌరవంతో పట్టాలు ఇచ్చిందన్నారు.
భద్రకాళీ చెరువుకు మత్తడిపడితే సోషల్మీడియా ద్వారా అక్కడి ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చి భయబ్రాంతులకు గురిచేశారన్నారు. కేంద్రం నుంచి ఒక్క పైసా తీసుకురానటువంటి వారు ఇక్కడ అనేక అకృత్యాలకు పాల్పడుతున్నారన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో వీరంతా ఎటుపోయారని ప్రశ్నించారు. నియోజకవర్గంలోని 46 వేల కుటుంబాలకు అన్ని రకాలుగా అండగా ఉంటున్నానన్నారు. ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆరే అని .. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమని అన్నారు. 11, 29 డివిజన్లలో రూ.61.48 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయన్నారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సైతం పురపాలక శాఖా మంత్రి వర్యులు కేటీ రామారావు రూ.250 కోట్ల అభివృద్ధి నిధులు ఇచ్చి పట్టణాన్ని ఆదుకున్నారన్నారు. మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ అండదండలతో డివిజన్ను ప్రగతిపథంలో తీసుకెళ్తున్నానన్నారు.
తన డివిజన్ అభివృద్ధిని చూసి కొంతమంది కళ్లు కుట్టి, కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, వారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. ఇప్పటి వరకు రామన్నపేటలో వరద నీరు రాలేదని ఇటీవల కురిసిన వర్షాల వలన రావడం దురదృష్టకరమన్నారు. మంత్రి కేటీఆర్ అభివృద్ధి పనులకు రూ. 158 కోట్లు మంజూరు చేయడం హర్షణీయమన్నారు. కాగా, ఇటీవల వరదల సమయంలో అహర్నిశలు శ్రమించిన జీడబ్ల్యూంసీ సిబ్బంది, ఇంజినీరింగ్ విభాగాధిపతులను మేయర్ సుధారాణి, ఎమ్మెల్యే దాస్యం, బోయినపల్లి వినోద్కుమార్ శాలువాలు కప్పి సత్కరించారు. అనంతరం డివిజన్కు చెందిన కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా, కుడా చైర్మన్ సుందర్రాజ్యాదవ్, లైబ్రరీ చైర్మన్ అజీజ్ఖాన్, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు కొడకండ్ల సదాంత్, డివిజన్ బీఆర్ఎస్ నాయకులు ఎల్లయ్య, రాచర్ల రాము, సురేశ్ పాల్గొన్నారు.