ఖిలావరంగల్, డిసెంబర్ 1 : తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ కిష్టయ్యను యావత్ తెలంగాణ ప్రజానీకం మరువదని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. గురువారం ఖిలావరంగల్ పడమర కోటలోని చమన్ దగ్గర మాజీ కార్పొరేటర్, ముదిరాజ్ మహాసభ వరంగల్ జిల్లా అధ్యక్షుడు బయ్య స్వామి అధ్యక్షతన మలిదశ ఉద్యమంలో అమరుడైన కిష్టయ్య 13వ వర్ధంతి సభను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే తెలంగాణ అమరవీరుల స్తూపంపై పూలు చల్లి పోలీస్ కిష్టయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ కోసం అమరుడైన కిష్టయ్య కుటుంబానికి ప్రభుత్వం ఉద్యోగం, ఆర్థికసాయం చేసి అండగా నిలిచిందన్నారు.
తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసిన కుటుంబాలను సీఎం కేసీఆర్ ఆదుకున్నారని గుర్తుచేశారు. ముదిరాజ్ల కోసం ప్రభుత్వం సొసైటీలను ఏర్పాటు చేసి సబ్సిడీలను అందజేస్తున్నదన్నారు. 67 ఏండ్లలో సమైక్య పాలకులు కులవృత్తులకు అన్యాయం చేశారని చెప్పారు. రాజకీయాలు ముఖ్యం కాదని, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే మా ఎజెండా అని అన్నారు. అద్భుతమైన సూపర్ స్పెషాలిటీ దవాఖానను నిర్మిస్తున్నామని, నియోజకవర్గంలో ఏడు గురుకులాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్రాంత ప్రజలు ఎదగాలనే సంకల్పంతోనే మడమ తిప్పకుండా కొనసాగుతున్నామన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు పనిగట్టుకొని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని తెలిపారు. కరోనా కష్టకాలంలో ప్రజల సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు చేశామని, అన్నివేళల్లో మీకు తోడుగా ఉండి మీ అభివృద్ధికి బాటలు వేస్తానని చెప్పారు.
కార్యక్రమంలో 37,38వ డివిజన్ కార్పొరేటర్లు బోగి సువర్ణ-సురేశ్, బైరబోయిన ఉమా-దామోదర్యాదవ్ దంపతులు, 27వ డివిజన్ కార్పొరేటర్ చింతాకుల అనిల్, ముదిరాజ్ నాయకులు చింతాకుల సునీల్, సంగరబోయిన చందర్, సంగరబోయిన విజయ్, అభిలాశ్, రావుల రాజేశ్, బొల్ల సుజాత, సిరబోయిన శ్రీనివాస్, సోమేశ్వర్, మధు, రాజేశ్, జనార్దన్, బంగారి నవీన్ తదితరులు పాల్గొన్నారు.
లక్ష్మీ మెగాటౌన్ షిప్ నూతన ప్యానెల్ సభ్యులకు శుభాకాంక్షలు..
గిర్మాజీపేట : లక్ష్మీ మెగా టౌన్షిప్ యాజమానులు నూతనంగా ఎన్నుకున్న ప్యానెల్ సభ్యులు, కార్పొరేటర్ కావటి కవిత-రాజుయాదవ్ గురువారం శివనగర్లోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే నరేందర్ను కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ప్యానెల్ అధ్యక్షుడిగా నేలకుర్తి కరుణాకర్రెడ్డి, జనరల్ సెక్రటరీగా కొడకండ్ల రామచంద్రమూర్తి, కోశాధికారిగా బంక సుదర్శన్, గౌరవ అధ్యక్షుడిగా గజ్జి రవి, వర్కింగ్ ప్రెసిడెంట్గా లడే సురేశ్, ఉపాధ్యక్షులుగా దుగ్యాల శ్రీనివాసరావు, నారపాక డేవిడ్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా ఆడెపు సురేశ్, పింగిలి సదానందం, గౌరవ సలహాదారులుగా డాక్టర్ గజ్జెల సుధాకర్, శరత్, సంయుక్త కార్యదర్శులుగా గొలుసుల సదానందం, దుర్గనాల బాబురావు, జాయింట్ ట్రెజరర్లుగా కొనిశెట్టి రాము, తొగిడి ప్రభాకర్, కార్యవర్గ సభ్యులుగా మాలి బాబూరావు, పెండ్యాల సంపత్ ఎన్నికయ్యారు. కాగా, ఎమ్మెల్యే వారికి శుభాకాంక్షలు తెలిపి స్వీట్లు తినిపించారు. అనంతరం కాలనీ సమస్యలను వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.