అట్లాంటా: తాజాగా జరుగుతున్న ఫిఫా వరల్డ్కప్ టోర్నమెంట్ రిగ్గింగ్కు గురైనట్లు ఈజిప్ట్ కోచ్ హోసమ్ హసన్(Egypt Coach Hassan ) సంచలన ఆరోపణ చేశారు. అర్జెంటీనా కోసం, మెస్సీ కోసం.. ఫిఫా ఆ టోర్నీ నిర్వహిస్తున్నట్లు ఆయన విమర్శించారు. అట్లాంటా స్టేడియంలో మంగళవారం జరిగిన థ్రిల్లర్ మ్యాచ్లో అర్జెంటీనా 3-2 గోల్స్ తేడాతో విజయం సాధించి క్వార్టర్స్కు వెళ్లిన విషయం తెలిసిందే. దాదాపు ఓటమి అంచు నుంచి అర్జెంటీనా అనూహ్య రీతిలో విక్టరీని నమోదు చేసింది. ఓ దశలో 0-2 గోల్స్ తేడాతో వెనుకబడ్డ అర్జెంటీనా.. ఆఖరి 13 నిమిషాల్లో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. రోమిరో, మెస్సీ, ఫెర్నాండేజ్ చకచకా గోల్స్ చేయడంతో.. ఈజిప్ట్ షాక్కు గురైంది. డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా ఓటమి ఖాయం అనుకున్న దశలో.. మెస్సీ బృందం మెరుపు వేగంతో మూడు గోల్స్ చేసి అందర్నీ స్టన్ చేసింది.
అయితే ఈజిప్ట్ జట్టు మాత్రం ఈ విక్టరీ పట్ల విమర్శలు చేస్తోంది. అర్జెంటీనా కోసం, ఆ జట్టు కెప్టెన్ మెస్సీ కోసం టోర్నీని రిగ్గింగ్ చేసినట్లు ఈజిప్ట్ ఆరోపిస్తున్నది. మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈజిప్ట్ కోచ్ హోసమ్ హసన్ మాట్లాడారు. తమ మ్యాచ్లో బాహ్య వత్తిళ్లు పనిచేసినట్లు ఆయన పేర్కొన్నారు. టోర్నమెంట్ ముగిసే వరకు వీలైనంత వరకు మెస్సీ ఉండాలన్న ఉద్దేశంతో ఫిఫా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. అందుకే మ్యాచ్లో అనేక అంశాలు ఆ ప్రభావానికి గురైనట్లు ఆయన ఆరోపించారు. డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా కన్నా మా జట్టు బాగా ఆడిందని, అన్నింటిలో ఉత్తమంగా ఉన్నామని, కానీ మ్యాచ్ ఫలితంపై కొన్ని వత్తిళ్లు ప్రభావం చూపినట్లు ఆయన పేర్కొన్నారు. వరల్డ్ చాంపియన్ అర్జెంటీనాను పోటీల్లోనే నిలపాలన్న ఉద్దేశంతో ఫిఫా వ్యవహరించినట్లు ఆయన ఆరోపించారు. బహుశా మెస్సీ కూడా ఇంకా టోర్నీలో ఆడాలన్న ఆలోచనతో నిర్వహకులు కొన్ని నిర్ణయాలు తీసుకుని ఉంటారని తెలిపారు. ఫుట్బాల్ ఆటలో టెక్నికల్ అంశాల కన్నా.. కొన్ని బయటి అంశాలే ప్రభావాన్ని చూపుతాయని విమర్శించారు. ప్రపంచ చాంపియన్ అర్జెంటీనాకు అన్ని దశల్లోనూ మద్దతు దొరికిందన్నారు. ఓ దశలో తమ జట్టు చేసిన గోల్ను వీఏఆర్ ద్వారా అడ్డుకున్నట్లు ఆయన ఆరోపించారు.
ఆటలో మర్యాద, మంచితనం లేదని, తమకు రావాల్సిన పెనాల్టీ ఇవ్వలేదని, కనీసం వీఏఆర్ చెకింగ్ చేయలేదని, ఓ ప్లేయర్ షర్ట్ లాగేశాడని, కానీ వీఏఆర్ చెక్ జరగలేదని, జీవితం సరైన రీతిలో లేదని, సాధారణ జీవితం కష్టమే అని, ఆటలో ఫెయిర్నెస్ లేదని కోచ్ హసన్ పేర్కొన్నారు. తమకు హార్డ్ లక్ జరిగిందని, సరైన రీతిలో తమ జట్టును ట్రీట్ చేయలేదని, తమకు అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. వరల్డ్కప్ టోర్నమెంట్లో ఎక్కడా న్యాయం జరగలేదని ఆయన పేర్కొన్నారు. అయితే ఈజిప్ట్ మేనేజర్ హసన్ చేసిన వ్యాఖ్యలపై ఫిఫా స్పందించే అవకాశాలు ఉన్నాయి. ఈజిప్ట్ జట్టుపై కూడా జరిమానా విధించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.