వరంగల్, ఆగస్టు 2(నమస్తేతెలంగాణ) : చెరువులు, కుంటల స్థలాల్లో ఇండ్ల నిర్మాణం.. చెరువుల శిఖం భూముల్లో అక్రమ కట్టడాలు.. నాలాల ఆక్రమణ.. ప్రభుత్వ స్థలాల కబ్జా.. ఇవే వరంగల్ నగరాన్ని కష్టాల్లోకి నెట్టాయి. వర్షం కురిసిన ప్రతిసారి వరదలో ముంచెత్తుతున్నాయి. ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఆర్థికంగా నష్టపరుస్తున్నాయి. ఏటా వరదలొచ్చిన సమయంలో అనేక కాలనీల్లో ఇదే దుర్భర పరిస్థితి తలెత్తుతున్నది. వర్షం పడగానే వరద నీరు లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లలోకి చేరడం, ప్రజలు కట్టుబట్టలతో బయటకు రావడం, వరద నీరు తగ్గిన తర్వాత తిరిగి ఇండ్లలోకి వెళ్లటం సాధారణమైంది.
అత్యంత భారీ వర్షాలు కురిసిన సమయంలో పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది. కొద్దిరోజుల క్రితం మునుపెన్నడూ లేని రీతిలో ఇక్కడ అత్యంత భారీ వర్షం కురిసింది. రికార్డు స్థాయిలో 30 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. వర్షం దంచికొట్టడంతో వరంగల్లో వరద పోటెత్తింది. నగరంలోని అనేక కాలనీల్లోకి నీరు చేరింది. ఇక్కడి కరీమాబాద్ ప్రాంతంలోని కాశికుంట, సాకరాశికుంట, లక్ష్మీనగర్, ఎస్ఆర్ఆర్ తోట, సీఆర్నగర్, ఉర్సు ప్రాంతంలోని డీకేనగర్, బీఆర్నగర్, గాయత్రీనగర్, రాజీవ్నగర్, ఖిలా వరంగల్, శంభునిపేట, రంగసాయిపేట ప్రాంతంలోని మైసయ్యనగర్, గిరిప్రసాద్నగర్, ఏసిరెడ్డినగర్, అబ్బనికుంట, మంగలమ్మకుంట, హంటర్రోడ్డులోని సంతోషిమాతకాలనీ, ఎన్టీయార్నగర్, సాయినగర్కాలనీ, బృందావన్కాలనీ, కాశీబుగ్గ ప్రాంతంలోని ఎస్సార్నగర్, గాంధీనగర్, సాయిగణేశ్కాలనీ, వివేకనందకాలనీ, లక్ష్మీగణపతికాలనీ, గొర్రెకుంట ప్రాంతంలోని గరీభ్నగర్, చిన్నవడ్డేపల్లి ప్రాంతంలోని శాంతినగర్, పద్మానగర్ తదితర కాలనీలు కొద్ది రోజుల పాటు వరద నీటిలోనే ఉన్నాయి.
రాత్రివేళ ఒకేసారి వరద నీరు ముంచెత్తడంతో ఈ కాలనీల్లోని ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పిల్లలను వెంట తీసుకుని కట్టుబట్టలతో సురక్షిత ప్రదేశాలకు చేరుకున్నారు. వరదతో ఇండ్లలోనే చిక్కుకున్న సదరు కాలనీల్లోని ప్రజలను అధికారులు రెస్క్యూ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పడవల ద్వార బయటకు తీసుకొచ్చారు. పోలీసు, ఫైర్ శాఖలతో పాటు జీడబ్ల్యూఎంసీ, రెవెన్యూ తదితర శాఖల సిబ్బంది పలువురిని రక్షించారు. కలెక్టర్ ప్రావీణ్య, జీడబ్ల్యూఎంసీ కమిషర్ షేక్రిజ్వాన్ బాషా, సీపీ రంగనాథ్, స్థానిక ఏసీపీ బోనాల కిషన్ తదితరులు క్షేత్రస్థాయిలో సహాయక చర్యలను పర్యవేక్షించారు. 723 మందిని కాపాడినట్లు అధికారులు ప్రకటించారు. అధికార యంత్రాంగం ముందుజాగ్రత్త చర్యలతో ప్రాణ నష్టం జరగకపోవడం అభినందనీయం. ఇండ్లలో ఉన్న నిత్యావసర వస్తువులు, సామగ్రి, ఫర్నీచర్, దుస్తులు, ఇతర సరుకులు నీటిలో తడిసి పాడయ్యాయి. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, అరూరి రమేశ్, మేయర్ గుండు సుధారాణితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ముంపు ప్రాంతాల్లోని కాలనీల్లో పర్యటించి పరిస్థితిని పరిశీలించారు. బాధితులకు ధైర్యం చెప్పారు.
ముంపునకు కారణాలు ఇవే..
వర్షం కురవగానే వరంగల్లోని పలు కాలనీల్లోకి వరద నీరు చేరుతుండటానికి కారణాలను విశ్లేషకులు గుర్తించారు. గతంలో ఖిలావరంగల్ కోట చుట్టూ రక్షణ కవచంగా నీటితో కూడిన అగర్త ఉండేది. వాన పడగానే ఈ అగర్త నుంచి వరద నీరు గొలుసుకట్టు విధానంలో మిల్స్కాలనీ మీదుగా కరీమాబాద్ ప్రాంతంలోని కాశికుంట, సాకరాశికుంటలోకి చేరుకునేది. సాకరాశికుంట నుంచి నీరు నాలా, బొందివాగు ద్వారా భద్రకాళి చెరువులోకి ప్రవేశించేది. నగర విస్తరణతో క్రమేణా కోట చుట్టూ ఉన్న అగర్త స్థలం, కాశికుంట, సాకరాశికుంట స్థలాల్లో మైసయ్యనగర్, గిరిప్రసాద్నగర్, ఏసిరెడ్డినగర్, ఎస్ఆర్ఆర్తోట, సీఆర్నగర్, కాశికుంట, సాకరాశికుంట, లక్ష్మీనగర్ తదితర కాలనీలు వెలిశాయి. సాకరాశికుంట నాలా స్థలం కూడా పలు చోట్ల కబ్జాకు గురి కావడంతో పాటు అక్రమ కట్టడాలు వెలిశాయి. దీంతో వర్షం పడగానే వరద నీరు ఈ కాలనీల్లోని ఇండ్లలోకి చేరుతోంది. అగర్త నీరు చేరే అబ్బనికుంట, మంగలికుంట స్థ్థలంలో ప్రస్తుతం అబ్బనికుంట, మంగలికుంట పేరుతో వెలిసిన కాలనిలదీ ఇదే పరిస్థితి. ఉర్సు చెరువు శిఖంలో వెలిసిన డీకేనగర్ కూడా వరద నీటితో అతలాకుతలం అవుతోంది.
ఇక ఉర్సు చెరువు మత్తడి నీరు ప్రవహించే నాలా ప్రాంతంలో బీఆర్నగర్, నాలా ద్వారా బొందివాగులోకి చేరే ప్రాంతంలో గాయత్రినగర్, రాజీవ్నగర్ తదితర కాలనీలు వెలిశాయి. అక్రమ కట్టడాలతో నాలా ఇరుకుగా మారడం, నీరు ప్రవహించే ప్రదేశంలో ఇండ్ల నిర్మాణం జరగడం వల్ల ఈ కాలనీలు వరద ముంపునకు గురవుతున్నాయి. ఎస్ఆర్ఆర్తోట మీదుగా రైల్వే ట్రాక్ కింది నుంచి బొందివాగు ద్వారా భద్రకాళి చెరువులోకి వరద నీరు చేరుకోవల్సిన హంటర్రోడ్డు ప్రాంతంలో ఎన్టీయార్నగర్, సంతోషిమాతకాలనీ, సాయినగర్కాలనీ, బృందావన్కాలనిల నిర్మాణం జరిగింది. భద్రకాళి చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఈ కాలనీల్లోని అనేక ఇండ్లు అక్రమంగా వెలిశాయనే ఆరోపణలున్నాయి. కాశీబుగ్గ ప్రాంతంలో గతంలో రామసముద్రం చెరువు ఉండేది. ఈ చెరువు మత్తడి నీరు నాలా ద్వారా చిన్నవడ్డేపల్లి చెరువులోకి చేరేది. ప్రస్తుతం రామసముద్రం చెరువు కనుమరుగైంది. దీని స్థానంలో ఎస్సార్నగర్, సాయిగణేశ్కాలనీతో పాటు మరికొన్ని కాలనీలు వెలిశాయి.
ఫలితంగా గతంలో రామసముద్రం చెరువులోకి వచ్చే వరద నీరు ఈ కాలనీల్లోకి చేరుతోంది. చిన్నవడ్డేపల్లి చెరువు శిఖంలో శాంతినగర్, పద్మానగర్ తదితర కాలనీల్లో అక్రమంగా ఇండ్ల నిర్మాణం జరగడం వల్ల ఎస్సార్నగర్ మీదుగా చిన్నవడ్డేపల్లి చెరువులోకి వచ్చే వరద నీరు ఆ కాలనీల్లోకి చేరుతోంది. గొర్రెకుంట ప్రాంతంలో గతంలో ఉన్న మల్లికుంట స్థలంలో గరీభ్నగర్ వంటి కాలనీల నిర్మాణం జరగడంతో వరద నీరు నేరుగా ఈ కాలనీల్లోకి ప్రవేశిస్తున్నది. చెరువులు, కుంటల స్థలాల్లో ఇండ్ల నిర్మాణంతో పాటు వరద నీరు ప్రవహించే నాలాల స్థలాల్లో అక్రమ కట్టడాలు జరగటంతో నాలాలు ఇరుకుగా మారడం వల్ల కూడా కాలనీలు ముంపునకు గురవుతున్నాయి. ముఖ్యంగా కబ్జాదారులు పక్కన ఉన్న పట్టా భూముల సర్వే నెంబర్లతో చెరువుల శిఖం భూములను ఆక్రమించి ప్లాట్లు చేసి అమ్ముతుండడంతో చెరువుల శిఖం భూముల్లో ఇండ్ల నిర్మాణం జరుగుతోంది. ఎఫ్టీఎల్ పరిధిలోని చెరువుల శిఖం భూముల్లోనూ పోటాపోటీగా అక్రమ కట్టడాలు వెలుస్తుండడంతో వరద నీరు కాలనీల్లో నిలిచిపోతోంది. వరద నీరు చేరకుండా ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అత్యంత భారీ వర్షపాతం నమోదైన సమయంలో ఇక్కడి ముంపుకాలనీల్లో సమస్య తలెత్తుతోంది.