‘ఒక సంస్థను కాపాడుకోవాలంటే ఎంతో ధైర్యం, పట్టుదల కావాలి.. ఆ రెండూ ఉన్న నాయకుడు కేసీఆర్.. కార్మిక పక్షపాతి అయిన ముఖ్యమంత్రి చొరవతో ప్రైవేటీకరణ కోసం మోదీ సర్కారు చేస్తున్న కుట్రలను బద్దలు కొట్టి సింగరేణిని కాపాడాం. కోలిండియాలో లేని అనేక ప్రయోజనాలను కార్మిక సోదరులకు సాధించి పెట్టాం.. గని కార్మికుల సంక్షేమానికి పాటుపడుతూ వారి జీవితాల్లో వెలుగునింపుతున్నం.18వేల మంది ‘వారసులకు’ ఉద్యోగాలిచ్చాం. ఈ విషయాలన్నీ సోషల్ మీడియా ద్వారా దేశమంతా చెప్పి యావత్ భారత్లోని బొగ్గు గని కార్మికులను ఐక్యం చేసి, జాగృతం చేయాలి’ అని టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత యువ కార్మికులకు పిలుపునిచ్చారు. ఆదివారం మంత్రి సత్యవతిరాథోడ్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావుతో కలిసి జయశంకర్ భూపాలపల్లిలోని యూనియన్ నూతన కార్యాలయాన్ని(కొక్కుల తిరుపతి భవన్) ప్రారంభించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ దేశంలో కీలకంగా పనిచేయబోతున్నదని చెప్పారు.
జయశంకర్ భూపాలపల్లి, జనవరి 22 (నమస్తే తెలంగాణ) : ఎన్నో అవాంతరాలను అధిగమించి సింగరేణి కార్మికుల వారసులకు కారుణ్య నియామక ఉద్యోగాలు ఇప్పించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆదివారం మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావుతో కలిసి జయశంకర్ భూపాలపల్లి జిల్లా
కేంద్రంలో పర్యటించారు. తొలుత టీబీజీకేఎస్ భూపాలపల్లి బ్రాంచ్ కమిటీ ఉపాధ్యక్షుడు కొక్కుల తిరుపతి స్వగృహానికి వెళ్లి, చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
తిరుపతి సతీమణి స్వరూపరాణి, కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు. కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం నూతనంగా నిర్మించిన టీబీజీకేఎస్ యూనియన్ కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావు అధ్యక్షతన జరిగిన సింగరేణి యువ కార్మికుల సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరైన టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు కవిత ప్రసంగించారు. కారుణ్య, పెండింగ్ డిపెండెంట్, ఎక్స్టర్నల్ రూపంలో మొత్తం 18వేల ఉద్యోగాలు ఇప్పించిన ఘనత సీఎం కేసీఆర్దేనని స్పష్టం చేశారు. టీబీజీకేఎస్ నేత కొక్కుల తిరుపతి పేరును టీబీజీకేఎస్ నూతన భవనానికి పెట్టడం మంచి పరిణామమని పేర్కొన్నారు.
సింగరేణిలో యువ కార్మికులు మూడో వంతు ఉన్నారని, వారు తెలంగాణ ప్రభుత్వం, టీబీజీకేఎస్ యూనియన్ సాధించిన హక్కులు, ప్రయోజనాలు, అభివృద్ధి, సంక్షేమ ఫలాలు దేశవ్యాప్తంగా తీసుకుపోవడంలో కీలకపాత్ర పోషిస్తారని, ఈ తరుణంలో వారికి తగు బాధ్యతలతో పాటు యూనియన్ పదవులను కూడా ఏ కమిటీలోనైనా మూడో వంతు యువ కార్మికులకు ఇవ్వాలని
టీబీజీకేఎస్ అగ్ర నాయకులకు కవిత సూచించారు. బొగ్గుబావిని కాపాడేదుకు సీఎం కేసీఆర్ కంకణబద్ధులై ముందుకుసాగుతున్నారన్నారు. సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమస్యలకు సంబంధించి ఒక విధానపరమైన నిర్ణయాన్ని త్వరలో తీసుకోనున్నట్లు చెప్పారు.
సింగరేణి వ్యాప్తంగా ఉన్న డిస్మిస్ కార్మికులను త్వరలో విధుల్లోకి తీసుకునేలా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను స్వరాష్ట్రం వచ్చిన తర్వాత చేపట్టి అమలు చేసినట్లు చెప్పారు. వాటిని ప్రజలకు విస్తృతంగా వివరించాలని సూచించారు. మంత్రి సత్యవతి మాట్లాడుతూ రాష్ట్రం రాకముందు నీడ, గూడు లేని పక్షులుగా సింగరేణి కార్మికులు ఉండేవారని, అదే స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభు త్వం సింగరేణి సంస్థ పరిరక్షణకు పాటుపడుతూనే కార్మికుల నివాసార్థం పెద్ద సంఖ్యలో క్వార్టర్లను నిర్మించి ఇచ్చిందన్నారు. ప్రజల కష్టాలను పట్టించుకోని ప్రభుత్వం కేంద్రంలో ఉన్నదని మండిపడ్డారు.
స్వరాష్ట్రంలో సింగరేణిలో పీడీఎఫ్, బ్యాక్లాగ్ పోస్టులు వెయ్యి మంది గిరిజన యువతకు సీఎం కేసీఆర్ దయవల్లే వచ్చాయన్నారు. ఆ కు టుంబాలు ఇప్పుడు సీఎం కేసీఆర్, టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు కవిత ఫొటోలను ఇంట్లో పెట్టుకొని మొక్కుతున్నారని పేర్కొన్నారు. భూపాలపల్లి జిల్లాకు నిత్యం వస్తూనే ఉన్నానని, ఎమ్మెల్యే గండ్ర నేతృత్వంలో నియోజకవర్గం అభివృద్ధి పథంలో పయనిస్తున్నదని తెలిపారు.