హనుమకొండ సబర్బన్, డిసెంబర్ 24 : ప్రతి పంట సీజన్ మాదిరిగానే ఈసారి కూడా వరి నాట్లు వేసేందుకు పలు రాష్ర్టాల నుంచి వలస కూలీలు వచ్చేశారు. మెట్ట భూముల్లో ఉన్న పంట క్షేత్రాలను రైతులు వరి పొలాలుగా మార్చిన నేపథ్యంలో స్థానికంగా నాట్లు వేసేందుకు కూలీల కొరత భారీగా ఏర్పడింది. దీనికి తోడు నేటితరం యువతులు నాట్లు వేసేందుకు ముందుకు రావడం లేదు. దీంతో ఇతర రాష్ర్టాల కూలీల అవసరం తప్పనిసరైంది. ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్తో పాటు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిషా రాష్ర్టాల నుంచి మగ కూలీలు వచ్చి రైతులకు కూలీల కొరతను తీరుస్తున్నారు. ఇప్పుడు వరినాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి సైతం ఇతర రాష్ర్టాల కూలీలు తరలివచ్చారు. డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని మహిళలు సైతం గతేడాది నుంచి వస్తున్నారు. పెద్ద గ్రామాలకు రెండు మూడు బ్యాచ్లు దిగాయి. దాదాపు ప్రతి గ్రామంలో 70శాతానికి పైగా నాట్లన్నీ వలస కూలీలే పూర్తి చేస్తున్నారు.
వరి నాట్ల కోసం వచ్చిన వలస కూలీలు చలిని సైతం లెక్క చేయడం లేదు. ఉదయాన్నే పొలాల్లోకి దిగి పనిలో నిమగ్నమవుతున్నారు. జనవరి ఒకటో తేదీ నుంచి కాకతీయ కాలువకు నీళ్లు విడుదల చేయనుండడంతో వరి నాట్లు ఊపందుకోనున్నాయి. దీంతో నిత్యం 12 గంటల పాటు పొలాల్లోనే గడుపుతున్నారు. స్థానిక కూలీల మాదిరిగా కాకుండా రైతులకు వీరితో ఎలాంటి ఇబ్బందులు ఉండడం లేదు. నారు పీకడం మొదలు, నారు పంచడం, అవసరం అనుకుంటే ఎరువులు సైతం చల్లుతూ చకచకా చేసేస్తున్నారు. కేవలం రైతు గట్టు మీద కూర్చుని వీరిని గమనిస్తూ తనకు కావాల్సిన తీరులో నాటు వేయించుకుంటే సరిపోతుంది.
స్థానికంగా నాట్లు పూర్తి చేసేందుకు వచ్చిన వలస కూలీలు తమకు కావాల్సిన వంటలు సైతం పొలాల వద్దనే తయారు చేసుకుంటున్నారు. వీరిని ఇక్కడకు తీసుకొచ్చిన ఆసామి వీరికి గ్యాస్తో పాటు ఇతరత్రా వంట సామగ్రి సమకూర్చుతున్నాడు. దీంతో ఈ కూలీల నుంచి ఒకరిద్దరు కేవలం వంట పనులు చూస్తున్నారు. సమయానికి వంట పూర్తి కాగానే పొలం గట్లపైనే తిండి కానిచ్చేస్తున్నారు. స్థానిక కూలీలు ఎకరాకు పది నుంచి 12మంది నాట్లు వేస్తే వీరు మాత్రం ముగ్గురు, నలుగురే ఎకరా నాటు పూర్తి చేస్తున్నారు. దీనికి తోడు వీరు నాటు వేయడం వల్ల రైతులకు ఖర్చు తగ్గుతుంది. దీంతో రైతులు వీరి వైపు మొగ్గు చూపుతున్నారు. వీరు వరి మొక్కలను వంచి వేయకుండా నిటారుగా వేయడంతో పంట దిగుబడి పెరుగుతుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. ఈసారి ఉమ్మడి జిల్లాలో నాట్లు వేసేందుకు సుమారు 30వేల మంది వలస కూలీలు వచ్చినట్లు అంచనా. హనుమకొండ జిల్లాలోనే లక్షా 50వేల 500 ఎకరాల్లో వరి సాగు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది.
మాది పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మేం కొంత వరకు వరిని పండిస్తాం అయితే మా దగ్గర ఇప్పుడు వరి నాట్లు లేవు. రెండు మూడు నెలల పాటు మేం ఇక్కడే ఉండి ఇక్కడి రైతుల నాట్లు పూర్తి చేస్తాం. తర్వాత మమ్మల్ని పిలిపించిన ఏజెంటు చెప్పిన మరో చోటికి వెళ్తాం.
నేను రెండు సంవత్సరాలుగా ఇక్కడికి వరి నాట్లు వేసేందుకు వస్తున్నాను. ఇక్కడి రైతులు మమ్మల్ని మర్యాదగా చాలా బాగా చూసుకుంటున్నారు. మేం నాటు వేసే ఆసాములు మాకు చికెన్లాంటి వంటకాలు కాకుండా అభిమానంతో ఇతర అవసరాలు కూడా చూసుకుంటున్నారు.