భూపాలపల్లి రూరల్ : అమ్మకానికి గురైన బాలున్ని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తిరిగి కన్నతల్లికి అప్పగించారు. రేగొండ మండలం చెన్నపూర్ గ్రామానికి చెందిన బాలుని తల్లి జిల్లా కలెక్టర్ను కలిసి తన కొడుకుని తమకు అప్పగించాలని వేడుకొగా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ చూపి బాలల సంక్షేమ సమితి సభ్యులతో మాట్లాడి బాలున్ని కొన్న వారి నుంచి వాపస్ రప్పించి గురువారం కలెక్టర్ కార్యాలయంలో కన్నతల్లికి బాలుడిని అప్పగించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కన్న బిడ్డలను సంరక్షించవలసిన తల్లిదండ్రులు వ్యసనాలకు బానిసైతే పిల్లల భవిష్యత్పై ప్రభావం పడుతుందన్నారు. తల్లిదండ్రులు బిడ్డల సంక్షేమం కోసం తమ జీవితాలను త్యాగం చేయలన్నారు.
మద్యానికి బానిసై తమ కొడుకును అమ్ముకున్న సంఘటన దురదృష్టకరమని, కన్నతల్లి ఫిర్యాదుతో వెంటనే స్పందించిన బాలల సంక్షేమ సమితి, బాలల సంరక్షణ అధికారుల ద్వారా తిరిగి బాలుడిని కన్న తల్లికి అప్పగించమన్నారు. భవిష్యత్లో మళ్లీ ఇలాంటి సంఘటనలు జరగకుండా పర్యవేక్షించాలని బాలల సంరక్షణ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సామ్యూల్, సీడబ్ల్యూసీ చైర్మన్ వేణుగోపాల్, బాల రక్షాభవన్ కో-ఆర్డినేటర్ శిరీష, డీసీపీవో హరికృష్ణ, పాల్గొన్నారు.