వరంగల్, డిసెంబర్ 19 : విద్యార్థి దశ నుంచే మానవ విలువలు పెంపొందించే దిశగా ఆలోచనలు చేయాలని, సమాజంలో ప్రతి ఒక్కరిని గౌరవించడం అలవర్చుకోవాలని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి అన్నారు. సోమవారం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో బాలల విద్యపై 50వేల మంది విద్యార్థులతో నిర్వహించిన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. సమాజంలో కులమతాలకు అతీతంగా విద్య అందించాలన్నారు. ఎలాంటి తారతమ్యం లేకుండా అందరూ సమానంగా విద్యను అభ్యసించాలన్నారు. తమ అభిరుచికి అనుగుణంగా కలలు సాకారం చేసుకోవాలని, అందుకోసం కష్టపడాలని సూచించారు. డాక్టర్లు, ఇంజినీర్లు, రాజకీయ నాయకులుగా ఎదిగేందుకు ఆలోచనలు చేయాలని చెప్పారు. ముందుగా తల్లిదండ్రులను గౌరవించాలని అన్నారు. పాఠశాలల్లో విద్యార్థులు కలిసి ఉండేలా వ్యవహరించాలని అన్నారు.
కలిసిమెలిసి ముందుకుసాగాలి..
ఎవరి శరీరంలో అయినా ఎర్రని రక్తమే ఉంటుందని, కులం, మతం అనే తేడా లేకుండా విద్యార్థులందరూ కలిసిమెలిసి ఉంటూ మానవ విలువలకు ప్రాధాన్యం ఇచ్చేలా ఎదగాలని ఆకాంక్షించారు. భారతదేశంలో వనరులకు కొరత లేదని అన్నారు. నీరు, ఆహారం వృథా చేయవద్దని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పేద పిల్లలు ఇప్పటికీ కలుషిత నీరే తాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను జర్మనీలో ఒక నోబెల్ ప్రైజ్ విజేతను కలిసి షేక్ హ్యాండ్ తీసుకున్నానని, ఆ స్ఫూర్తితోనే సామాజిక సమస్యలపై పోరాటం ప్రారంభించినట్లు ఆయన విద్యార్థులకు తెలిపారు. కుల, మత, ప్రాంతాలకతీతంగా ప్రతి ఒకరికీ నిర్బంధ విద్య అందించే దిశగా ప్రభుత్వాలు దృష్టిసారించాలని సూచించారు. విద్యార్థులు కలలు కంటే సరిపోదని.. వాటిని సాకారం చేసుకునేందుకు కష్టపడాలని చెప్పారు.
ఆడపిల్లలు ఎకువ ఉన్న కుటుంబాల్లో బాల్య వివాహాలు ఇప్పటికీ జరుగుతున్నాయని, వారి హకుల పరిరక్షణకు చట్టాలను మరింత కఠినతరం చేయాల్సిన అవసరమున్నదని అభిప్రాయపడ్డారు. చిన్నతనం నుంచే ప్రశ్నించేతత్వాన్ని అలవర్చుకోవాలని ఈ మేరకు తల్లి దండ్రులు, గురువులు ప్రోత్సహించాలన్నారు. విద్యార్థులు సమాజం కోసం ఆలోచించాలని.. దేశం ఒకటే ప్రజలంతా ఒకటే అన్న భావన ఉండాలన్నారు. ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని సూచించారు. బాల కార్మిక వ్యవస్థను కలిసికట్టుగా నిర్మూలించాలని కైలాష్ సత్యార్థి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు రాజీవ్గాంధీ హన్మంతు, గోపి, పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్, గ్రేటర్ కార్పొరేషన్ కమిషనర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్వో వాసుచంద్ర, డీఆర్డీవో శ్రీనివాస్కుమార్, హనుమకొండ, వరంగల్ జిల్లాల విద్యాశాఖాధికారులు అబ్దుల్ హై, వాసంతి పాల్గొన్నారు.
తెలంగాణలో అందరికీ విద్య- బోయినపల్లి వినోద్కుమార్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు
రాష్ట్రంలో పేద, ధనిక, కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ విద్య అందుతోంది. ఆర్టికల్ 21 భారతదేశంలో ప్రతి వ్యక్తికి చదువుకునే హక్కు కల్పించింది. దానిని తెలంగాణలో పక్కాగా ప్రభుత్వం అమలు చేస్తోంది. ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. సీఎం కేసీఆర్ అందరికీ విద్య అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించి అన్ని వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తున్నారు. శాంతి ఉంటేనే మానవ మనుగడ సాధ్యమవుతుంది. సాటి మనిషిని ప్రేమగా చూడడం అలవర్చుకోవాలి. అబ్బాయి, అమ్మాయి అనే భేదం లేకుండా చదువుకోవాలి. ప్రస్తుతం ఆడపిల్లలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఇటీవల బాసర ట్రిపుల్ ఐటీలో 1500 సీట్లలో 1300 మంది అమ్మాయిలు సీట్లు సాధించడమే ఇందుకు నిదర్శనం. విద్య ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు. ఆడపిల్లలను ప్రోత్సహించేందుకు సీఎం కేసీఆర్ రాష్ట్రంలో 30 బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలను మంజూరు చేశారు. ఇప్పటివరకు వరంగల్ నగరానికి ఇద్దరు నోబెల్ బహుమతి గ్రహీతలు వచ్చారు. గతంలో కాకతీయ యూనివర్సిటీకి మదర్ థెరిస్సా రాగా, ఇప్పుడు కైలాష్ సత్యార్థి ఈ గడ్డపై అడుగుపెట్టడం చారిత్రక నగరానికి గర్వకారణం. బాలల హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న గొప్ప వ్యక్తి కైలాష్ సత్యార్థి. బాలల హక్కుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటున్నది. దేశాన్ని బాగు చేసేందుకు మంచి రాజకీయ నాయకుడి అవసరం ఉంది, నేటి బాలలే రేపటి మంచి నాయకులుగా ఎదగాలి.
బాలల హక్కుల పరిరక్షణకు పటిష్ట చర్యలు
రాష్ట్ర ప్రభుత్వం బాలల హక్కుల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నది. బాలల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పోరాడుతున్న నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి వరంగల్ నగరానికి రావడం గర్వకారణం. సత్యార్థి ఫౌండేషన్ ద్వారా 86వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి 80వేల మంది బాల కార్మికులను విముక్తి చేసిన గొప్ప వ్యక్తి ఆయన. బాలల హక్కుల పరిరక్షణకు సమాజంలోని ప్రతి ఒక్కరు పాటుపడాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ బాలల హక్కులను కాపాడేందుకు కృషి చేస్తున్నారు.
– ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్
బాలల చేతుల్లోనే దేశ భవిష్యత్
బాలల చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఉంది. వారి హక్కుల పరిరక్షణ కోసం కైలాష్ సత్యార్థి చేస్తున్న పోరాటానికి వెన్నంటి ఉంటాం. ఆడపిల్లల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నది. రాష్ట్రంలో బాలల హక్కులు పటిష్టంగా ఆమలువున్నాయి.
– కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్
ఆ ప్రశ్న అడిగినప్పుడు దుఃఖం ఆగలేదు..
దేశ భవిష్యత్ను నిర్దేశించే నిజమైన రియల్ హీరోలు విద్యార్థులేనని కైలాష్ సత్యార్థి అన్నారు. సినిమాలు చూస్తూ విద్యార్థులు చాలా విషయాలు గమనిస్తారని అందులో డైరెక్టర్ చెప్పినట్లు హీరో, హీరోయిన్ నటిస్తారన్నారు. నిజజీవితంలో మనం నిత్యం ఎదురొంటున్న సమస్యలను అధిగమించడానికి చిన్నప్పటి నుంచే ఆలోచనలు పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. ప్రపంచవ్యాప్తంగా బాలల హకులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. చారిత్రక వరంగల్ నగరం బాలల హక్కుల పరిరక్షణ, బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాల నిర్మూలనలో దేశంలోనే ముందుండాలని ఆయన ఆకాంక్షించారు. ముఖ్యంగా భారతదేశంలో బాలల హకుల పరిరక్షణ కోసం తన ఆలోచనలకు ఒక సంఘటన ఊపిరిపోసిందని గుర్తుచేశారు. పాఠశాలలో చదువుకుంటున్న సమయంలో ఒక పిల్లవాడు తనను ప్రశ్నించిన విషయాన్ని సభలో విద్యార్థులకు వివరించారు. ‘నేను పని చేస్తున్నాను, నీవు చదువుకుంటున్నావు అని ఒక పిల్లవాడు నాతో చెప్పాడు. మనిద్దరి మధ్యన ఈ వ్యత్యాసం ఎందుకు..? అని అడిగినప్పుడు నన్ను నేను ప్రశ్నించుకుంటే.. నాకు దుఃఖం ఆగలేదు’ అని అప్పటి సందర్భాన్ని వారితో పంచుకున్నారు. ముఖ్యంగా బాలలు తమ హకులను కోల్పోకుండా చూడాలనే ఉద్దేశంతో నిరంతరం బాలల హకుల కోసం కృషి చేస్తున్నట్లు వివరించారు.
ఆడపిల్లలను ప్రోత్సహించాలి
ఆడపిల్లలు చదువు దేశానికి దిక్సూచి లాంటిది. ఆడపిల్లలను చదువుకునేలా ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలి. అబ్బాయిలతో పాటు అమ్మాయిలు పోటీ పడి చదువు తున్నారు. అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నది. వారిని చులకనగా చూడకుండా గౌరవించాలి.
– నెమురుగోమ్ముల రమేశ్రావు, వడుప్సా జిల్లా అధ్యక్షుడు