హనుమకొండ, నవంబర్ 12 : ‘పుటుక నీది.. చావు నీది… బతుకంతా దేశానిది…’ అని రాయడంతోనే ఆగకుండా ఆచరించిన వ్యక్తి కాళోజీ నారాయణరావు. వెట్టిచాకిరీ, బాల్యవివాహాలు, మద్యపానం, మతాంతీకరణ, దమననీతి, నిరంకుశత్వం, అరాచకత్వాలకు వ్యతిరేకంగా సభలు, సమావేశాలు నిర్వహించారు. తాను గళమెత్తి తన కలంతో ప్రజల్లో చైతన్యం రగిలించారు. 23 ఏళ్ల వయసులోనే స్టేట్ కాంగ్రెస్ పిలుపు మేరకు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. హన్మకొండలో ఆర్య సమాజ్ శాఖకు మొదటి అధ్యక్షుడిగా ఉండి కార్యక్రమాలు నిర్వహించారు. 1939 ఫిబ్రవరి 8 నుంచి 11 వరకు నాలుగు రోజులు వరంగల్ సెంట్రల్ జైలులో విచారణ ఖైదీగా తొలిసారి జైలు శిక్ష అనుభవించారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. 1947లోనూ జాయిన్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు జైలు జీవితం గడిపారు. హైదరాబాద్ సంస్థానం విలీనం తర్వాత 1948 సెప్టెంబర్ 26న జైలు నుంచి విడుదలయ్యారు. ఆ తరువాత, కాళోజీ ప్రత్యేక తెలంగాణ కోసం పరితపించారు. వామపక్ష ఉద్యమం రూపంలో చేసే హింసను వ్యతిరేకించారు. హింస ఏ రూపంలో ఉన్నా తప్పేనని గట్టిగా చెప్పేవారు. స్వతంత్ర భారతదేశం పూర్తి ప్రజాస్వామికంగా మారకపోతే ఏ రాజ్యమైనా ఒకటేగదా అని ప్రశ్నించారు. ప్రజలకు ఏది కంటకంగా ఉన్నా.. అక్షరాలతో, మాటలతో ఖండిస్తూ ముందుకు సాగారు. జీవిత పోరాటాల అనుభూతులకు మాటలు తొడిగి ప్రజల భాషలో ‘నా గొడవ’ పేరుతో కవిత్వం రాశారు. ప్రజల సమస్యలను, ఆకాంక్షలను చాటిచెప్పడంతోనే ఆగకుండా ప్రత్యక్షంగా ఉద్యమాల్లో పాల్గొన్నారు. అందుకే కాళోజీ ప్రజాకవిగానే కాకుండా ప్రజల మనిషిగా గుర్తింపు పొందారు. 1914, సెప్టెంబర్ 9న కర్ణాటకలోని బీజాపూర్ జిల్లా రట్టహళ్లిలో కాళోజీ నారాయణరావు జన్మించారు. ఆయన రెండో ఏట వాళ్ల కుటుంబం వరంగల్ సమీపంలోని మడికొండకు వచ్చి స్థిరపడింది. కాళోజీ ప్రాథమిక విద్య మడికొండలో, ఉన్నత విద్య వరంగల్, హైదరాబాద్లో సాగింది. నిస్వార్థ హృదయం, త్యాగబుద్ధి సొంతమైన కాళోజీ, తోటి స్వాతంత్య్ర యోధుల్లోనూ ప్రత్యేకంగా నిలిచిన వ్యక్తి. 2002, నవంబర్ 13న ఈ లోకం విడిచన ఆయన, తన మరణానంతరం కూడా ప్రజలకు ఉపయోగపడ్డారు. ఎల్వీ ప్రసాద్ నేత్ర పరిశోధనా సంస్థకు తన కండ్లను, వరంగల్లోని కాకతీయ వైద్య కళాశాలకు తన భౌతికకాయాన్ని అప్పగించాలని కుటుంబ సభ్యులకు ముందే చెప్పారు.
ఉదయం 11గంటలకు కాళోజీ సోదరుల యాది సభ
కాళోజీ సోదరుల యాది సభను నేడు ఉదయం 11గంటలకు వాగ్దేవి డిగ్రీ అండ్ పీజీ కళాశాల సెమినార్ హాల్లో నిర్వహిస్తున్నట్లు కాళోజీ ఫౌండేషన్ అధ్యక్షుడు నాగిళ్ల రామశాస్త్రి, కార్యదర్శి వీఆర్ విద్యార్థి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సాహితీవేత్త, పత్రిక సంపాదకుడు డాక్టర్ కే రామచంద్రమూర్తికి ప్రజాకవి కాళోజీ నారాయణరావు స్మారక పురసారం, ప్రముఖ ఉర్దూ కవి, విమర్శకుడు, అనువాదకుడు డాక్టర్ ఖుత్భ్సర్షార్కు సుప్రసిద్ధ ఉర్దూ కవి కాళోజీ రామేశ్వర్రావు స్మారక పురసారం ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రముఖ కవి ఎలనాగ అనువాదం చేసిన మై లామెంట్.. కాళోజీ కవితల ఇంగ్లిష్ అనువాద కావ్యం ఆవిష్కరణ ఉంటుందని తెలిపారు. కవులు, రచయితలు, సాహిత్య కారులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు.
కాళోజీ లోగిలిలో..
అనుభూతి అనుభూతి కాళోజీ లోగిలిలో..
కళ్లు రెండు మెరిసినట్లు.. పేరుపెట్టి పిలిచినట్లు
కూర్చోమని అంటూనే ‘బాగున్నవ’ అన్నట్లు
తనువు నెవరొ తట్టినట్లు.. మనసు నెవరొ ముట్టినట్లు
అనుభూతి అనుభూతి కాళోజీ లోగిలిలో..
గదిలోని జ్ఞాపికలూ గంధాలను పూసినట్లు
పద్మవిభూషణ బిరుదం పూలవాన కురిపినట్లు
ప్రజాకవి బిరుదేమో షహెనాయీ ఊదినట్లు
ఇంటి నిండ కాళోజీ అభిషేకం జరిగినట్లు – అనుభూతి!!
కవి మిత్రులు వచ్చినట్లు.. మిత్రమండలి జరిగినట్లు
కవిత జల్లు కురిసినట్లు.. ముషాయిరా విరిసినట్లు
పులకరించి ‘షాద్’ ఆత్మా వహ్వా అని మురిసినట్లు
పరవశించి కాళోజీ అనుభవాలు విప్పినట్లు – అనుభూతి!!
కవులందరు కలాలను ఎక్కుపెట్టి నడిచినట్లు
కలాలన్ని గళం విప్పి కరవాలం ఝళిపినట్లు
నినాదాలు లేచి లేచి నింగెత్తుకు తాకినట్లు
కదం తొక్కి కాళోజీ సారధ్యం నెరిపినట్లు – అనుభూతి!!
పీడితులూ శ్రామికులూ చేతులెత్తి మొక్కినట్లు
మానవీయ విలువన్ని నివాళులర్పించినట్లు
విప్లవాలు ఉద్యమాలు సలామీలు ఇచ్చినట్లు
తుదియాత్రకు కాళోజీ భూజాలపై లేచినట్లు – అనుభూతి !!
ఆత్మీయులు అభిమానులు ఆసాంతం మూగినట్లు
కొడుకూ కోడలి తోటి ‘రుక్మిణమ్మ’ నిలిచినట్లు
తాతయ్యను చూడండని ‘సంతోషు’ అరచినట్లు
ఛాతి విరిచి రామశాస్త్రి కాళోజిని చూపినట్లు – అనుభూతి!!
మనసు మనసులోనా ఓ కాళోజీ మొలిచినట్లు
ప్రతి మనిషీ నా గొడవను తన గొడవగ తలచినట్లు
ఒక్కొక్కరు అన్యాయాల్నెదిరిస్తూ లేచినట్లు
నింగి నుంచి కాళోజీ కృతజ్ఞతలు కురిపినట్లు – అనుభూతి!!
తెలంగాణ గడ్డేమో నాడోవని అన్నట్లు
కాదుకాదు నావోడని భరతమాత పలికినట్లు
ఈ బిడ్డా నా బిడ్డని భూగోళం చాటినట్లు
కాళోజీ కపోతమై నింగిలోకి ఎగిసినట్లు – అనుభూతి!!
-మహమ్మద్ సిరాజుద్దీన్