నర్సంపేటరూరల్/సంగెం, నవంబర్ 10: దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నది. బీపీ, షుగర్తో బాధపడుతూ కనీసం మందులు కొనుగోలు చేయలేని స్థితిలో ఉన్న ఎంతో మంది నిరుపేదలకు ప్రభుత్వం ఉచితంగా మందులు అందిస్తూ అండగా నిలుస్తున్నది. ఇందులో భాగంగా వైద్య సిబ్బంది స్వయంగా బాధితుల ఇండ్ల వద్దకే వెళ్లి ఎన్సీడీ కిట్లు పంపిణీ చేస్తున్నారు. గురువారం నర్సంపేట మండలంలోని భాంజీపేటలో పీహెచ్సీ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది బాధితుల ఇండ్లకు వెళ్లి ఎన్సీడీ కిట్లు పంపిణీ చేశారు. ప్రతినెలా వ్యాధిగ్రస్తులు వైద్య పరీక్షలు చేసుకొని డాక్టర్ల సూచన మేరకు మందులు వాడాలని వైద్య సిబ్బంది సూచించారు. కార్యక్రమంలో ఏఎన్ఎంలు కోమల, రజిత, కవిత పాల్గొన్నారు. సంగెం మండలంలోని సబ్ సెంటర్ల పరిధిలోని ప్రజలకు వైద్య పరీక్షలు చేస్తూ బీపీ, షుగర్ ఉన్న వారికి ప్రతినెలా ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు మందుల కిట్లు అందజేస్తున్నారు. సబ్ సెంటర్లకు రాలేని స్థితిలో ఉన్న వారి ఇండ్లకు వెళ్లి పరీక్షలు చేసి నెలకు సరిపడా మందులు ఇస్తున్నారు. ప్రైవేట్ దవాఖానలకు వెళ్తే వేల రూపాయలు వెచ్చించాల్సి వస్తుందని, తమకు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న వైద్య సేవలు బాగున్నాయని దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అంటున్నారు.
హెల్త్ క్యాంపులను వినియోగించుకోవాలి
హెల్త్ క్యాంపులను డివిజన్ ప్రజలు వినియోగించుకోవాలని 25వ డివిజన్ కార్పొరేటర్ బస్వరాజు శిరీష అన్నారు. డివిజన్లోని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఇంటి కూడలి వద్ద ఎన్సీడీ హెల్త్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఇందులో డివిజన్లో బీపీ, షుగర్తో బాధపడుతున్న వారికి వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నేత బస్వరాజు శ్రీమాన్, వైద్యాధికారులు, ఆశవర్కర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. చెన్నారావుపేట మండలంలోని లింగాపురంలో బీపీ, షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న మందుల కిట్లను సర్పంచ్ తప్పెట రమేశ్, ఆశ వర్కర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ రక్తపోటు, మధుమేహంతో బాధపడుతున్న వారు సరైన సమయంలో క్రమం తప్పకుండా మందులు వాడితే ఆరోగ్యంగా నిలకడగా ఉంటుందన్నారు. బీపీ, షుగర్ వ్యాధులు నియంత్రణలో లేకుంటే అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని సూచించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ పసునూటి రమేశ్, కట్టయ్య, ఆశ వర్కర్లు సంధ్య, అరుణ పాల్గొన్నారు.