కొడకండ్ల, నవంబర్ 10 : కొడకండ్లలో మినీ టెక్స్టైల్ పార్కుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చొరవతో ఏర్పాటు కానున్న పార్కు కోసం మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు కలెక్టర్ శివలింగయ్య గురువారం స్థల పరిశీలన చేశారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ గిడ్డంగుల వద్ద ఉన్న సర్కారు స్థలాన్ని పరిశీలించారు. ఇక్కడ కలెక్టర్ మాట్లాడుతూ చేనేతల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కొడకండ్లలో ఏర్పాటు చేస్తున్న టెక్స్టైల్ పార్కు పనులకు మరో పది రోజుల్లో మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేసే అవకాశం ఉందన్నారు. పార్కు కోసం ప్రస్తుతం 29ఎకరాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పార్కుకు మొత్తం 50 నుంచి 70 ఎకరాల స్థలం అవసరమని, మరో 30-35 ఎకరాల స్థలం కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు. టీఎస్ఐఐసీకి పనులను అప్పజెప్పి వెంటనే ప్రారంభించాలని ఆదేశించినట్లు తెలిపారు. పార్కు అందుబాటులోకి వస్తే పదివేల మందికి ఉపాధి దొరుకుతుందని, వలస వెళ్లినవారు కూడా స్వగ్రామాలకు తిరిగివచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. అనంతరం మండల కేంద్రంలోని వసతి గృహాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలో ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడ టీఎస్ఐఐసీ జోనల్ మేనేజర్ సంతోష్కుమార్, అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, ఆర్డీవో కృష్ణవేణి, ఎంపీపీ ధరావత్ జ్యోతి, సర్పంచ్ పసునూరి మధుసూదన్, ఏఎంసీ డైరెక్టర్ కుందూరు అమరేందర్ రెడ్డి, తహసీల్దార్ చంద్రమోహన్ ఉన్నారు.