కరీమాబాద్, నవంబర్ 4: ‘కోతులు పోవాలె.. వానలు వాపస్ రావాలె’ అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం హరితహారం చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వానరాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మంకీ ఫుడ్ కోర్టు చిట్టడవిలా మారి కనువిందు చేస్తున్నది. వరంగల్ అండర్రైల్వేగేట్ 40వ డివిజన్ రంగశాయిపేటలో వివిధ రకాల మొక్కలు చెట్లుగా ఎదుగుతున్నాయి. ఇందులో అరటి, పనస, సంత్రాలు, జామ, దానిమ్మ పండ్లు చేతికొస్తున్నాయి. సిబ్బంది నిరంతర పర్యవేక్షణలో పచ్చదనం వెల్లివిరుస్తోంది.
కోతుల ఆహారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంకీ ఫుడ్ కోర్టులు ఫలితాలనిస్తున్నాయి. వరంగల్ అండర్ రైల్వేగేట్ 40వ డివిజన్ రంగశాయిపేటలో నాటిన 1600 మొక్కలు పెరిగి పెద్దవై ఫుడ్ కోర్టు చిట్టడవిలా మారింది. హరితహారంలో భాగంగా కోతుల కోసం ప్రత్యేకంగా రాష్ట్రంలోనే ప్రయోగాత్మకంగా వరంగల్లో మంకీ కోర్టును ఏర్పాటు చేయాలని సర్కారు భావించింది. ఇందులో భాగంగా 25 జూన్ 2020 రోజున రంగశాయిపేటలో దీనికి శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి దీనిపై వరంగల్ మహా నగరపాలక సంస్థ ప్రత్యేక దృష్టి నిలిపింది. చెట్లే మన భావితరాలకు అందించే ఆస్తి.. నగరంలో అడవిని తలపించేలా వాటి పెంపకం చేపట్టాలని ఏర్పాటు చేసిన మంకీ ఫుడ్ కోర్టు కనువిందు చేస్తోంది. నాటి వరంగల్ మహా నగరపాలక సంస్థ మేయర్ గుండా ప్రకాశ్ రావు కృషి.. ఎమ్మెల్యే చొర వతో తూర్పులో ఓ చిట్టడవి చూపరులను ఆకర్షిస్తోంది.
ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం.. ఏకదర్శనం, తోటమాలి
మంకీ ఫుడ్ కోర్టులో నిరంతరం పనులు చేస్తూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. ముగ్గురు మనుషులం ప్రతి రోజూ మొక్కల మధ్యలో ఉన్న గడ్డిని తొలగిస్తూ, వాటికి నీరు పోస్తున్నాం. ప్రభుత్వం చేపట్టిన ఈ మంకీ ఫుడ్ కోర్టుతో ఉపాధి పొందుతున్నాం. మొక్కలు చెట్లుగా ఎదుగుతున్నాయి. పలు రకాల పండ్లు సైతం కాస్తున్నాయి. ఇందులో దాదాపు 12 రకాల పండ్లకు సంబంధించిన 1600 మొక్కలు ఉన్నాయి.
దాదాపు 1600 మొక్కల పెంపకం..
సుమారు ఎకరం స్థలంలో దాదాపు 1600 మొక్కలు నాటారు. పశు పక్ష్యాదుల ఆహారం కోసం వివిధ రకాల పండ్ల మొక్కలు నాటి వాటిని కాపాడుతున్నారు. ముగ్గురు సిబ్బందితో వాటిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మొక్కల కోసం ప్రత్యేకంగా బోర్ను వేసి 16 చోట్ల నల్లాలను ఏర్పాటు చేసి వాటిని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలను పెంచేందుకు అధికారులు అన్ని విధాలా చర్యలు చేపట్టారు. నాటిన ప్రతి మొక్క చెట్టుగా ఎదిగేలా వాటికి పూర్తి స్థాయి రక్షణ కల్పిస్తున్నారు. కోర్టు చుట్టూ కంచెను సైతం ఏర్పాటు చేశారు.ఈ ఫుడ్ కోర్టులో 12 రకాల పండ్లకు సంబంధించిన 1600 మొక్కలు నాటగా, ఇందులో అరటి, పనస, సంత్ర, జామ, దానిమ్మ పండ్లు కాస్తున్నాయి.