వరంగల్, జూలై 2(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అనుకూల వానలతో సాగు జోరందుకున్నది. గత సీజన్లో పత్తికి మంచి ధర పలుకడం, పెట్టుబడికి గ్యారంటీ ఉన్న పంట కావడంతో ఈ సారి రైతాంగం ఎక్కువగా పత్తి వైపే మొగ్గు చూపుతున్నది. ఆరు జిల్లాల్లోనూ పత్తి విస్తీర్ణం బాగా పెరిగింది. జనగామలో అత్యధికంగా ఇప్పటికే ఒకటిన్నర లక్షల ఎకరాలు, వరంగల్ జిల్లాలో 91వేల ఎకరాలు, మహబూబాబాద్ జిల్లాలో 84వేలు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 74వేలు, హనుమకొండ జిల్లాలో 30వేలు, ములుగు జిల్లాలో 14వేల ఎకరాల్లో సాగైంది. మరోవారం దాకా పత్తిగింజలు పెట్టే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పత్తి తర్వాత వరి సాగు ఎక్కువ ఉండే పరిస్థితి కనిపిస్తున్నది.
వరి సాగు కోసం రైతులు నారు సిద్ధం చేసుకుంటున్నారు. మడులు సిద్ధం చేసి రెండు వారాల క్రితమే మొలకలలికారు. మరో రెండు వారాల్లో నాట్లు జోరందుకోనున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇప్పటి వరకు 3,350 ఎకరాల్లో నాట్లు వేశారు. మిగిలిన జిల్లాల్లో నెమ్మదిగానే వరి సాగుతున్నది. పలువురు రైతులు వెదజల్లే సాగు వైపు మొగ్గుచూపుతున్నారు. మక్క, కంది సాగు సైతం ఈ ఏడాది పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. భూపాలపల్లి మినహా మిగిలిన ఐదు జిల్లాల్లోనూ మక్క సాగు పెరుగుతున్నది. మహబూబాబాద్, జనగామ జిల్లాల్లో కంది ఆశించిన స్థాయిలో ఇప్పటికే సాగులో ఉన్నది. ఒకప్పుడు కరువు ప్రాంతంగా ఉండే జనగామ జిల్లాలో నీటి వసతి పెరగడంతో మిగిలిన జిల్లాల కంటే ముందుగానే పంటలు వేస్తున్నారు.
వానలు అనుకూలం
భారీగా కాకున్నా వర్షాలు సాగుకు అనుకూలంగానే పడుతున్నాయి. గతేడాదితో పోలిస్తే తక్కువే అయినా పంటలకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఆరు జిల్లాల్లోనూ సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. వరంగల్ జిల్లాలో ఇప్పటివరకు 127 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 190 మిల్లీ మీటర్లు నమోదైంది. హనుమకొండలోనూ 136కు గాను 199, మహబూబాబాద్లో 124కు గాను, 185, ములుగులో 163 మిల్లీ మీటర్లకుగాను 233, భూపాలపల్లిలో 153కు గాను 212 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జనగామ జిల్లాలోనూ ఈసారి మంచి వానలు పడుతున్నాయి. ఇప్పటికే జిల్లాలో 119 మిల్లీ మీటర్ల సాధారణ వర్షపాతానికి గాను 206 మిల్లీ మీటర్ల నమోదైంది.
అదనులో పెట్టుబడి..
ప్రతి ఎకరాకు సాగునీరు, నిరంతరం ఉచిత కరంటును అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అదనులో రైతుకు పెట్టుబడి సాయం చేస్తున్నది. రైతుబంధు పథకం కింద ప్రతి ఎకరాకు ఒక్కో సీజనుకు రూ.5వేల చొప్పున ఇస్తున్నది. వానకాలం రైతుబంధు సాయం ఇప్పుడు రైతులకు అందుతున్నది. విస్తీర్ణం వారీగా ప్రతిరోజూ రైతుల బ్యాంకు అకౌంట్లలో జమ అవుతున్నది. ఆరు జిల్లాల్లో కలిపి దాదాపు రూ.900 కోట్ల మేరకు రైతుబంధు పథకం కింద 8.50 లక్షల మందికి సాయం అందనుంది. పోడు భూముల్లో ఎన్నో ఏండ్లుగా వ్యవసాయం చేసుకుంటున్న గిరిజన రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఔదార్యంతో రైతుబంధు సాయం అందిస్తున్నారు. వానలు మొదలై పంటల సాగు జోరందుకున్న తరుణంలోనే రైతుబంధు సాయం అందుతుండడంపై రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.