కరీమాబాద్, జూలై 2: సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడొద్దని వరంగల్ మహానగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ అన్సీర్ రషీద్ కోరారు. వరంగల్ 40వ డివిజన్ పరిధిలో కార్పొరేటర్ మరుపల్ల రవి ఆధ్వర్యంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అన్సీర్ రషీద్ మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణం దెబ్బతింటుందన్నారు. దాన్ని నిర్మూలించడం మనందరి బాధ్యత అన్నారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ వస్తువులు వాడొద్దని కాలనీల్లో నినాదాలు చేస్తూ ర్యాలీ తీశారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు పూజారి విజయ్, మరుపల్ల గౌతమ్, జీడబ్ల్యూఎంసీ సిబ్బంది పాల్గొన్నారు.
ప్లాస్టిక్ వాడితే అనర్థాలు
నర్సంపేట: ప్లాస్టిక్ వాడితే అనర్థాలు వస్తాయని ఏఎస్ఆర్ ఫౌండేషన్ నిర్వాహకుడు ఎర్రబోయిన రాజశేఖర్ అన్నారు. నర్సంపేటలోని జేపీఎస్ఎస్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ను వాడబోమని విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను ప్రతి ఒక్కరూ నిషేధించాలని కోరారు. ప్రత్యామ్నాయంగా భూమిలో కలిసిపోయే బయో డిగ్రేబుల్ అరటి, అడ్డాకు, మోదుగు విస్తరాకుల ప్లేట్లు, పేపర్ ప్లేట్లు, గ్లాసులు, కవర్స్, జనుపనార సంచులు, క్లాత్ బ్యాగులు, స్టీల్ ప్లేట్లు, గ్లాసులు, మట్టి పాత్రలు వాడాలని పిలుపునిచ్చారు. భావితరాల కోసం మనమంతా కాలుష్యాన్ని నివారించాలని కోరారు. ప్లాస్టిక్ నిషేధంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సురేశ్, భిక్షపతి, శ్రీనివాస్, బుచ్చిరాములు, సీఆర్పీ శ్రీనివాస్, రాములు, ఉమాదేవి, సంస్థ సభ్యుడు రాము సేవక్ పాల్గొన్నారు.
ప్లాస్టిక్ వస్తువులకు దూరంగా ఉండాలి
పోచమ్మమైదాన్: వరంగల్ 3వ డివిజన్ ఆరెపల్లిలో స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా పాస్టిక్ వస్తువుల నిషేధంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ జన్ను షిభారాణి-అనిల్ మాట్లాడుతూ ప్రతి ఒకరూ ప్లాస్టిక్ వస్తువులకు దూరంగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు. అలాగే, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. కార్యక్రమంలో వర్క్ ఇన్స్పెక్టర్ ఎల్లస్వామి, స్వరూప, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి
పర్వతగిరి: ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఆర్డీఎఫ్ కళాశాల ప్రిన్సిపాల్ ఏ జనార్దన్ పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణపై కల్లెడలో విద్యార్థులు క్షేత్ర సందర్శన చేశారు. చెట్లను పెంచడం వల్ల అనేక ప్రయోజనాలను తెలియజేశారు. అడవుల పెంపకం, వన్యప్రాణి సంరక్షణలో అరుదైన పక్షి జాతులను కాపాడుకోవడం, జలవనరుల సంరక్షణ, ప్లాస్టిక్ నిషేధంపై పాటలు, ఉపన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులతో మొక్కలు నాటించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రాజు, ఏవో యాకంబరం, మౌనిక, రాధిక, అశ్విని, సునీత, శ్రీలత, గురుకుల పాఠశాలకు చెందిన 40 మంది పాల్గొన్నారు.