కరీమాబాద్, జూన్ 26: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 19 ఏళ్లుగా ఎదుర్కొంటున్న తాగునీటి కష్టాలకు మిషన్ భగీరథ పథకంతో పుల్స్టాప్ పడింది. వివరాల్లోకి వెళ్తే.. రెక్కాడితేగాని డొక్కాడని నిరుపేద కుటుంబాలు గుడిసెల్లో జీవనం సాగిస్తూ సుమారు 19 ఏండ్లుగా నీటి కోసం పడరానిపాట్లు పడ్డారు. వాటర్ ట్యాంకర్ల ద్వారా వచ్చే తాగునీరే వారికి ఆధారం. ట్యాంకర్ వచ్చిన సమయంలో ఇంట్లో లేకపోతే ఇక అంతే సంగతులు. తాగునీరు తెచ్చుకోవాలంటే కిలో మీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి వచ్చేది. ఇదంతా మారుమూల పల్లెలో కాదు. నగరం నడిబొడ్డున ఉన్న 32వ డివిజన్ బీఆర్నగర్, రాజీవ్నగర్, రాజీవ్గృహకల్ప వాసుల కన్నీటి వ్యథ. ఏండ్ల తరబడిగా తాగునీరు కోసం కష్టాలు పడిన వారి గోసను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ భగీరథ తీర్చింది. తెలంగాణలోని ఇంటింటికీ తాగునీరు అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ పథకం పేదలకు వరంగా మారింది. ఇందులో భాగంగా ఆయా ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఇచ్చారు. దీంతో వారంతా ఇప్పుడు తమ ఇండ్ల వద్దే నల్లా ద్వారా తాగునీరు పట్టుకుంటున్నారు. ఏండ్ల నాటి తమ గోసను తీర్చిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్కు కాలనీల వాసులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
700 కుటుంబాలకు లబ్ధి
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకం ద్వారా 32వ డివిజన్లోని మూడు కాలనీల్లో దాదాపు 700 నల్లా కనెక్షన్లు ఇచ్చారు. ఉర్సు బైపాస్రోడ్డులోని బీఆర్నగర్లో 19 ఏండ్ల క్రితం 200 కుటుంబాలు గుడిసెలు వేసుకున్నాయి. అప్పటి నుంచి కూలీనాలి చేసుకొని జీవనం సాగిస్తున్నారు. ఆ పక్కనే ఉన్న రాజీవ్నగర్కాలనీలో దాదాపు 150 పైచిలుకు కుటుంబాలు గుడిసెల్లో జీవిస్తున్నాయి. అక్కడే ఉన్న రాజీవ్ గృహకల్పలో మరో 300 కుటుంబాలు ఉన్నాయి. వీరందరూ తమ కుటుంబాలతో ఏండ్ల తరబడిగా జీవిస్తున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా వీరి తాగునీటి కష్టాలను పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం టీఆర్ఎస్ ప్రభుత్వం కాలనీల్లో సైతం మిషన్ భగీరథ ద్వారా పైపులైన్లు వేయించి ప్రతి ఇంటికీ తాగునీటి కోసం నల్లా కనెక్షన్లు అందించింది. దీంతో ఆయా కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పేదలకు టీఆర్ఎస్ సర్కారు అండ..
టీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తున్నది. ఒకవైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తున్నది. ఏండ్ల తరబడి తాగునీటి కోసం గోసపడ్డ మా డివిజన్లోని బీఆర్నగర్, రాజీవ్నగర్, రాజీవ్గృహకల్పలో మిషన్ భగీరథ ద్వారా పైపులైన్లు ఏర్పాటు చేశారు. తద్వారా నీటి సరఫరా చేస్తున్నాం. ప్రతి ఇంటికీ శుద్ధి చేసిన తాగునీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన మిషన్ భగీరథ పథకం డివిజన్ వాసులకు వరంగా మారింది. గుడిసెలు వేసుకొని ఏండ్ల తరబడిగా జీవనం సాగిస్తున్న పేదలకు ప్రభుత్వం అన్నివిధాలా వసతులు కల్పిస్తున్నది.
– పల్లం పద్మ, 32వ డివిజన్ కార్పొరేటర్