నర్సంపేటరూరల్, జూన్ 26: మండలంలోని రైతులు ఆరుతడి పంటల సాగుపై ఆసక్తి చూపుతున్నారు. పంట వేసిన మూడు నుంచి నాలుగు నెలల్లో వేరుశనగ, మక్కజొన్న చేతికి వస్తుండడంతో రైతులు ఉత్సాహంగా సాగుకు శ్రీకారం చుట్టారు. ఇటీవల రైతులు మండలంలో వేరుశనగ, మక్కజొన్న విత్తనాలు నాటారు. ముఖ్యంగా దాసరిపల్లి, కమ్మపల్లి, భాంజీపేట, చంద్రయ్యపల్లి, మాదన్నపేట, నాగుర్లపల్లి, గురిజాల, ముగ్దుంపురం, చిన్నగురిజాల, జీజీఆర్పల్లి, భోజ్యానాయక్తండా, ఆకులతండా, రాజపల్లి గ్రామాలు, శివారు పల్లెలు, తండాల్లో రైతులు ఎక్కువగా వేరుశనగ, మక్కజొన్న సాగు చేశారు. వచ్చే సెప్టెంబర్ నెల లో వేరుశనగ, మక్కజొన్న పంటలు చేతికి రానున్నాయి. ఆ తర్వాత రైతులు భూమిని చదును చేసి మిర్చి, మక్కజొన్న ఇతర పంటల సాగు చేపట్టనున్నారు. వాణిజ్య పంట లు సాగు చేసి ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టాలను చవిచూసిన అన్నదాతలు.. ప్రస్తుతం ఆరుతడి పంటల సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. కొందరు రైతులు ఇప్పటికే బావుల కింద పత్తి విత్తనాలు నాటగా, మరికొందరు ఇప్పుడిప్పుడే సాగు చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలు రైతాంగానికి అనుకూలంగా మారాయి. ఈ దఫా కాలం కలిసి వస్తుందనే ఆశతో రైతాంగం పనులకు శ్రీకారం చుట్టింది.