వరంగల్, జూన్ 26: పట్టణాల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి సత్ఫలితాలను ఇచ్చింది. ఈ నెల 3 నుంచి 18 వరకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 66 డివిజన్లలో చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం స్థానిక సమస్యలకు పరిష్కారం చూపింది. 16 రోజులపాటు ప్రజా ప్రతినిధులు, అధికారులు డివిజన్లలో పర్యటించి సమస్యలను గుర్తించారు. కాలనీ కమిటీలు, ప్రజలను భాగస్వామ్యం చేయడంతో అనేక సమస్యలు పరిష్కారం కావడంతోపాటు డివిజన్ అభివృద్ధికి బాటలు పడ్డాయి. పట్టణ ప్రగతిలో పారిశుధ్య సమస్యలు, లోతట్టు ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించారు.
6,219 వినతులు
పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వినతులు వెల్లువెత్తాయి. డివిజన్లలో మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ ప్రావీణ్య, అధికారులు క్షేత్రస్థాయి పర్యటించారు. ప్రజలు స్థానిక సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. 66 డివిజన్లలో 6,219 వినతులు అందాయి. వాటిలో పారిశుధ్యం, పైపులైన్ లీకేజీలకు సంబంధించిన సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ప్రాధాన్యతా క్రమంలో సమస్యలు పరిష్కరించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
645 కిలోమీటర్ల డ్రైన్లలో పూడికతీత..
వర్షాకాలం నేపథ్యంలో పట్టణ ప్రగతిలో భాగంగా ముందస్తు చర్యలు చేపట్టారు. 645 కిలోమీటర్ల మేరకు డ్రైన్లలో పూడికతీత పనులు చేపట్టారు. కల్వర్టులు, మురుగు కాల్వల వద్ద 204 జాలీలను ఏర్పాటు చేశారు.188 పనిచేయని, ఎండిపోయిన బోర్లను పూడ్చివేశారు. 24 ఇంకుడు గుంతలను పునరుద్ధరించారు. శిథిలావస్థలో ఉన్న 43 భవనాలను తొలగించారు. 115 కొత్త పార్కుల కోసం స్థలాలను గుర్తించారు. నగర రోడ్లపై ఉన్న 3,315 గుంతలను పూడ్చివేశారు. 252 పైపులైన్ల లీకేజీలకు మరమ్మతులు చేశారు. 125 పంపుసెట్ల మరమ్మతులు, 250 వంగిన స్తంభాలు, 109 తుప్పుపట్టిన విద్యుత్ స్తంభాలను మార్చారు. పది వైకుంఠధామాల పనులు ప్రారంభించారు. గ్రేటర్ పరిధిలో 20 తెలంగాణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశారు.