వరంగల్, జూన్19(నమస్తేతెలంగాణ) : ఈ సంవత్సరం వర్షాలు పడగానే మత్స్యశాఖ అధికారులు ఉచిత చేప పిల్లలను చెరువుల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలోని పదమూడు మండలాల్లో 753 చెరువులు ఉన్నాయి. వీటికితోడు రాయపర్తి మండలంలోని మైలారంలో ఒక రిజర్వాయర్ ఉంది. ఈ రిజర్వాయర్తో పాటు చెరువుల్లో ఈ ఏడాది వానకాలం 2.40 కోట్ల ఉచిత చేప పిల్లల విడుదలకు మత్స్యశాఖ అధికారులు ప్రతిపాదన చేశారు. వీటికి ప్రభుత్వం ఇటీవల ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు చేప పిల్లలను సరఫరా చేసే కాంట్రాక్టర్ల కోసం గత మే నెలలో టెండర్ల ప్రక్రియ చేపట్టింది. 753 చెరువులతో పాటు మైలారం రిజర్వాయర్కు అవసరమైన చేప పిల్లలను సరఫరా చేసేందుకు పలువురు గుత్తేదార్లు టెండర్లు దాఖలు చేశారు. మే 31వ తేదీన మత్స్యశాఖ అధికారులు ఈ టెండర్ల టెక్నికల్ బిడ్ కూడా తెరిచారు. టెండర్లు దాఖలు చేసిన కాంట్రాక్టర్లు పేర్కొన్న చేపల చెరువులను కొద్ది రోజుల నుంచి సందర్శించి క్షేత్ర పరిశీలన చేస్తున్నారు. సాధ్యమైనంత త్వరలో ఈ పరిశీలన పూర్తి చేసి సదరు కాంట్రాక్టర్ల చేపల చెరువులపై ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు. నివేదికను పరిశీలించిన తర్వాత టెండర్ల ఖరారుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. టెండర్లు దక్కిన కాంట్రాక్టర్లు అగ్రిమెంటు చేసుకుని జిల్లాలోని చెరువులు, రిజర్వాయర్కు 2.40 కోట్ల ఉచిత చేప పిల్లలను సరఫరా చేస్తారు. కొద్ది రోజుల నుంచి వానలు పడుతుండడంతో మత్స్యశాఖ అధికారులు ఉచిత చేప పిల్లల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేశారు.
13,650 కుటుంబాలకు లబ్ధి..
జిల్లాలో 172 మత్స్య సహకార సంఘాలు పనిచేస్తున్నాయి. వీటిలో 40 మహిళా సంఘాలు ఉండడం విశేషం. 172 సంఘాల్లో 13,650 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో మహిళలు 2,250 మంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీతో 172 సహకార సంఘాల్లోని 13,650 కుటుంబాలకు ఏటా లబ్ధి చేకూరుతున్నది. ఈ ఏడాది కూడా మత్స్య సహకార సంఘాల్లోని 13,650 మంది సభ్యులకు ప్రయోజనం కలుగనుంది. 132 పురుష మత్స్య సహకార సంఘాల్లోని సభ్యులు 753 చెరువులు, మైలారం రిజర్వాయర్లో చేపలను పడుతుండగా వీటిని 40 మహిళా సంఘాల్లోని సభ్యులు కొనుగోలు చేసి మార్కెట్లో అమ్మడం ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఎస్సారెస్పీ కాల్వల ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు నీరు చేరడం వల్ల ఇప్పటికే జిల్లాలోని మైలారం రిజర్వాయర్తో పాటు చెరువుల్లో నీటి నిల్వ ఉంది. వానలతో వరద నీరు కూడా చేరనుంది.
దీంతో జూలై, ఆగస్టులో 753 చెరువులు, మైలారం రిజర్వాయర్లో ఉచిత చేప పిల్లలను విడుదల చేసే దిశగా మత్స్యశాఖ అధికారులు ముందుకు వెళ్తున్నారు. ఈ ఏడాది జిల్లాలోని చెరువులు, రిజర్వాయర్లో విడుదల చేసే చేప పిల్లల్లో బొచ్చె, రవు, బంగారుతీగ రకాలు ఉంటాయని మత్స్యశాఖ జిల్లా అధికారి నరేశ్కుమార్ నాయుడు వెల్లడించారు. చేప పిల్లల సరఫరాకు సంబంధించి టెండర్ల ప్రక్రియ తుది దశలో ఉన్నట్లు ఆయన తెలిపారు. మైలారం రిజర్వాయర్తో పాటు నర్సంపేట, సంగెం, వర్ధన్నపేట మండలాల్లోని మాదన్నపేట, ఎల్గూరురంగంపేట, దమ్మన్నపేట చెరువుల్లో ఉచిత రొయ్య పిల్లల విడుదలకూ మత్స్యశాఖ అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అవసరమైతే మరో చెరువులో కూడా ఈ ఉచిత రొయ్య పిల్లలను విడుదల చేయాలనే ఆలోచనలో అధికారులు ఉన్నారు.
మత్స్యకారులకు ఏటా ప్రభుత్వం చేప పిల్లలతో పాటు రొయ్య పిల్లలనూ వంద శాతం సబ్సిడీపై పంపిణీ చేస్తున్నది. ఈ ఏడాది ఉచిత రొయ్య పిల్లల పంపిణీపై సెప్టెంబర్లో నిర్ణయం తీసుకోనుంది. మత్స్యశాఖ అధికారులు మైలారం రిజర్వాయర్తో పాటు మూడు లేదా నాలుగు పెద్ద చెరువుల్లో ఈ ఏడాది ఉచిత రొయ్య పిల్లల పంపిణీకి కసరత్తు చేస్తున్నారు. పెరిగిన తరువాత మత్స్యకారులు వాటిని పట్టి మార్కెట్లో విక్రయించడం ద్వారా ఆదాయం పొందుతున్నారు. చేపల రవాణా, అమ్మకానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం వాహనాలు సమకూర్చుతున్నది. ప్రధానంగా ఉచిత చేప పిల్లల పంపిణీతో మత్స్య సంపద గణనీయంగా పెరిగింది. ఆదాయం లభిస్తుండడంతో మత్స్యకారులు మరిసిపోతున్నారు.