సుబేదారి, జూన్ 16 : మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో అమాయక ప్రజల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసిన ముగ్గురు సభ్యుల ముఠా గుట్టును టాస్క్ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. వారి నుంచి కారు, రూ.10.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. హనుమకొండ సుబేదారిలోని టాస్క్ఫోర్స్ కార్యాలయంలో టాస్క్ఫోర్స్ అడిషనల్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ గురువారం ఇద్దరు నిందితుల అరెస్టు వివరాలు వెల్లడించారు. వరంగల్ కాశీబుగ్గ తిలక్రోడ్డుకు చెందిన బొనగాని రాజుగౌడ్, వరంగల్ రంగంపేటకు చెందిన బొమ్మగాని మల్లేశం, హనుమకొండ జులైవాడకు చెందిన మోటపోతుల వెంకటేశ్ మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో ఈఎస్పీఎన్ ఒరాకిల్ అనే నకిలీ కంపెనీ స్థాపించారు. షేర్ మార్కెటింగ్ పేరుతో అమాయక ప్రజల నుంచి 1.67 కోట్ల రూపాయలు వసూలు చేసి వారి ఖాతాల్లోకి జమ చేసుకున్నారు. ఈ డబ్బులతో నర్సంపేట సమీపంలోని ఖానాపురం వద్ద 52 ఎకరాల భూమిని కొనుగోలు చేసి వెంచర్ ఏర్పాటు చేశారు. సభ్యులకు తిరిగి డబ్బు ఇవ్వకుండా మోసాం చేశారు. పక్కా సమాచారంతో బొనగాని రాజుగౌడ్, బొమ్మగాని మల్లేశంను గురువారం అరెస్టు చేసినట్లు డీసీపీ తెలిపారు. వారి నుంచి రూ.10.50 లక్షల నగదు, క్రెటా కారును స్వాధీనం చేసుకున్నారు. జులైవాడకు చెందిన మోటపోతుల వెంకటేశ్ పరారీలో ఉన్నాడు. ఈ కేసులో ప్రతిభ చాటిన టాస్క్ఫోర్స్ సీఐలు శ్రీనివాస్జీ, సంతోష్, సిబ్బందిని అభినందించారు.