కరీమాబాద్, జూన్ 16: నకిలీ విత్తనాల అమ్మితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని మామునూరు ఏసీపీ నరేశ్కుమార్ హెచ్చరించారు. గురువారం మామునూరు సీఐ రమేశ్ ఆధ్వర్యంలో నాయుడు పెట్రోల్బంకు జంక్షన్లోని పలు ఫర్టిలైజర్ షాపుల్లో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ అనుమతులు పొందిన విత్తనాలను నిర్ణీత ధరలకే విక్రయించాలన్నారు. అనుమతి లేని విత్తనాలు అమ్మితే పీడీ యాక్టు నమోదు చేస్తామన్నారు. రైతులకు బిల్లులు కూడా ఇవ్వాలన్నారు. రైతులు సైతం విత్తనాల కొనుగోలులో అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
పర్వతగిరిలో..
మండలంలోని పలు ఫర్టిలైజర్ షాపుల్లో పోలీసులు తనిఖీలు చేసినట్లు ఏఎస్సై యాదగిరి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు నకిలీ విత్తనాలు అమ్మవద్దని, ప్రతి కొనుగోలుకు రసీదు ఇవ్వాలని సూచించారు. సామాన్య ప్రజలకు నష్టం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.