కాశీబుగ్గ, జూన్ 10 : అభివృద్ధిలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్ నిలిచిందని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నదని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. శుక్రవారం 19వ డివిజన్లో పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. ప్రజలతో మాట్లాడి వారి సమస్యలపై వినతులు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కారం అవుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ హయాంలోనే తెలంగాణ అద్భుత ప్రగతి సాధిస్తున్నదన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని తెలిపారు. వీధులు, డివిజన్ల అభివృద్ధికి ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఆరోగ్య నగరంగా వరంగల్ను తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. అనంతరం అభివృద్ధి కమిటీలను వేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఓని భాస్కర్, స్థానిక నాయకులు ఈటల ఉమా మహేందర్, పద్మాగంగాధర్, దేవర ప్రసాద్, పల్లకొండ హరికుమార్, క్యాతం రంజిత్, చిలువేరు పవన్, ఊరుగొండ రవి, కూచన ఏకాంబ్రం తదితరులు పాల్గొన్నారు.
పేదల ఆరోగ్యానికి సర్కారు భరోసా..
పేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో భరోసాగా నిలుస్తున్నదని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. శుక్రవారం 19వ డివిజన్లో లబ్ధిదారులకు రూ.5లక్షల 79వేల విలువైన చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేదలకు సీఎం కేసీఆర్ అన్ని విధాలా అండగా ఉంటున్నారన్నారు. ప్రజల శ్రేయస్సే సీఎం ధ్యేయమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పలుకుబడి ఉన్నవారు, దళారులకే ఈ ఫండ్ అందిందని గుర్తుచేశారు. ఇప్పుడు రాజకీయాలకతీతంగా చెక్కులు అందజేస్తున్నట్లు తెలిపారు. కాశీబుగ్గకు చెందిన రాజుకు రూ.3లక్షలు, శ్రీలతకు రూ.2లక్షల25వేలు, ఎండీ యాకూబ్పాషాకు రూ.54వేల విలువైన చెక్కులు అందజేసినట్లు చెప్పారు. అర్హులందరూ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో మాజీ కార్పొరేటర్ ఓని భాస్కర్, నాయకులు గోరంటాల మనోహర్, వేముల నాగరాజు, గనిపాక సుధాకర్ పాల్గొన్నారు.