కరీమాబాద్, జూన్ 9: ఉన్నత చదువుల కోసం జర్మనీకి వెళ్లిన విద్యార్థి ప్రమాదవశాత్తు నదీ కాల్వలో పడి గల్లంతయ్యాడు. మే 8న దుర్ఘటన జరుగగా మృతదేహం గురువారం వరంగల్లోని స్వస్థలానికి చేరడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తనయుడు గల్లంతయ్యాడని తెలిసిన నాటి నుంచి మృతుడి తల్లిదండ్రులు వనమ్మ, పరశురాములు, కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు చూపరులను కలిచివేస్తున్నది. కుటుంబాన్ని ఓదార్చేందుకు ఇంటికి వచ్చిన ప్రజాప్రతినిధులకు, అధికారులకు తమ కుమారుడి జాడ తెలిసేలా చొరవ చూపాలని మొర పెట్టుకున్నారు. చివరికి నెల రోజుల అనంతరం మృతదేహం ఇంటికి చేరడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. తనయుడి శవాన్ని చూసిన తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు. వరంగల్ నగరంలోని కరీమాబాద్కు చెందిన కడారి అఖిల్ (25) మూడేళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం జర్మనీకి వెళ్లాడు.
హోట్టోవన్ యూనివర్సిటీలో సోలార్ అండ్ ఎనర్జీ ఇంజినీరింగ్లో ఫైనలియర్ చదువుతున్నాడు. ఇటీవల పరీక్షలు సైతం పూర్తికాగా ప్రాజెక్ట్ వర్క్ నిమిత్తం అక్కడ ఉన్నాడు. మే 8వ తేదీన స్నేహితులతో కలసి బయటకు వెళ్లగా ప్రమాదవశాత్తు నదీ కాల్వలో పడి గల్లంతయ్యాడు. నాటి నుంచి అఖిల్ కోసం అక్కడ గాలింపు చర్యలు చేపడుతున్నట్లు జర్మనీలోరి భారత రాయబారి కార్యాలయం నుంచి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. అయితే మే 20న మృతదేహం లభించినట్లు తెలిపారు. అఖిల్ మృతదేహం మాత్రం జర్మనీ నుంచి గురువారం వరంగల్లోని స్వగృహానికి చేర్చారు. పలువురు మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.