ఖిలావరంగల్, జూన్ 2 : తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి దిశ గా పయనిస్తోందని మంత్రి ఎర్రబె ల్లి అన్నారు. ఓరుగల్లు కోటలో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఆ యన ముఖ్య అతిథిగా హాజరయ్యా రు. ఈసందర్భంగా ఆయన జిల్లా సాధించి అభివృద్ధిని ప్రజలకు వివరించారు. ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడమే ధ్యేయంగా ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు.
మూడేళ్లల్లో జిల్లాలోని 645 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. మొదటి విడుతలో 223 పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. బాలికా విద్యను బలోపేతం చేసేందుకు 10 కేజీబీవీలను నిర్వహిస్తున్నామన్నారు. 3 కేజీబీవీల్లో ఇంటర్ విద్యను ప్రవేశపెట్టామన్నారు. వచ్చే సంవత్సరం ఖానాపురం, సంగెం కేజీబీవీల్లో ఇంటర్ ప్రవేశపెడుతున్నామని చెప్పారు. అలాగే, ప్రభుత్వం వైద్య, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. జిల్లాలో కొవిడ్ టీకా మొదటి డోసు 100 శాతం, 2వ డోసు 96 శాతం, 15 నుంచి 18 ఏళ్ల వయసు కలిగిన పిల్లలు 88 శాతం మందికి వ్యాక్సిన్ వేశామన్నారు. 302 గ్రామాల్లో 100 శాతం పూర్తిచేశామన్నారు. 53 పల్లె దవాఖానల్లో డాక్టర్లను నియమించామని తెలిపారు. టెలీ, వీడియో కన్సల్టెన్సీ ద్వారా ఇప్పటి వరకు 4,215 మంది రోగులకు చికిత్సఅందించాన్నారు. జిల్లాలో 52 ఆరోగ్య ఉప కేంద్రాలకు పక్కా భవనాలు నిర్మిస్తున్నామన్నారు. ఒక్కో ఉప కేంద్రానికి రూ.16లక్షలు కేటాయించామని చెప్పారు. ఈ ఏడాది ప్రభుత్వ దవాఖానల్లో 6,698 ప్రసవాలు జరుగగా, ప్రైవేట్ హాస్పిటళ్లలో 5,105 ప్రసవాలు అయినట్లు తెలిపారు. 7,345 మందికి కేసీఆర్ కిట్లు పంపిణీ చేశామన్నారు.
ఎంజీఎం దవాఖానకు రూ.100 కోట్లు..
ఎంజీఎం దవాఖానకు బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనన్నా రు. రెండేళ్లల్లో రూ.150 కోట్లు ఖర్చు చేశామన్నారు. 1500 పడకలను పెంచినట్లు చెప్పారు. రూ.1100 కోట్ల నిధులతో 24 అంతస్తులు 2 వేల పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణంలో ఉందన్నారు. ఎంజీఎంలో 300 యాంజియో పరీక్షలు, స్టంట్లు, 65 మోకాళ్ల కీళ్ల మార్పిడీ శస్త్ర చికిత్సలు చేశారన్నారు. రూ.10 కోట్లతో ఎంఆర్ఐ, రూ.2కోట్లతో సీటీస్కాన్ మిషన్ ఏర్పాటు చేశామన్నారు.
వ్యసాయానికి ప్రాధాన్యత..
రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచే రైతు సంక్షేమపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. రుణమాఫీ, సకాలంలో విత్తనాలు, ఎరువులు అందించారన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు ద్వారా ఎకరాని కి రూ.10వేలు, రైతు మరణిస్తే బీమా కింద రూ.5ల క్షలు అందజేస్తున్నారన్నారు. 2021-22 కాలంలో 306 మంది రైతు కుటుంబాలకు రూ.15.30కోట్లు అందించామని తెలిపారు. వానకాలానికి రూ.133.8కోట్లు, యాసంగికి రూ.133.71 కోట్లను రైతుబంధు కింద రైతుల ఖాతాల్లో జమచేశామన్నారు. జిల్లాలో రూ12.98 కోట్లతో 59 రైతు వేదికలు నిర్మాణ పనులు పూర్తయ్యాయన్నారు. 2022-23లో 9231 ఎకరాల్లో పామాయిల్ తోటలు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. వేయి మంది రైతులకు ఖమ్మంలో శిక్షణ ఇప్పించామని చెప్పారు.
అద్భుతం కాళేశ్వరం ప్రాజెక్టు..
ప్రపంచంలో మానవ నిర్మిత అద్భుతం కాళేశ్వరం ప్రాజెక్టు అని, సీఎం కేసీఆర్ను కొంత మంది గవర్నర్లు కాళేశ్వరం చంద్రశేఖర్రావు అని పిలిచేవారని గుర్తు చేశారు. జిల్లాలో 1,106 చెరువుల కింద 85,208 ఎకరాలకు సాగునీరు అందుతోందన్నారు. దేవాదుల ప్రాజెక్టు కింద 55,706 ఎకరాల ఆయకట్టుకు నీరు ఇవ్వడమే కాకుండా చెరువులను నింపుతున్నామన్నారు. నర్సంపేట నియోజక వర్గంలోని 4 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంల కింద 1,418 ఎకరాల ఆయకట్టు ఉందన్నారు. అలాగే మిషన్ కాకతీయతో భాగంగా నాలుగో దశలో రూ.250 కోట్లతో 745 చెరువులకు మరమ్మతులు చేసి కాళేశ్వరం నీళ్లతో నింపుతున్నామన్నారు.
ధరణితో దళారులకు చెక్..
ధరణి పోర్టల్తోనే భూ దందా దళారులకు చెక్ పడిందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 12,984 రిజిస్ట్రేషన్లు, 7,066 ఇతర సమస్యలను పరిష్కరించామన్నారు. సుమారు రూ.174 కోట్ల నిధులతో 11 మండలాల్లో 708 ఆవాసాలకు నల్లాల ద్వారా శుద్ధ గోదావరి నీటిని అందిస్తున్నామన్నారు.
24 గంటలు నాణ్యమైన విద్యుత్..
తెలంగాణ వస్తే అంధకారం అవుతుందన్న వాళ్లే చీకట్లోకి వెళ్లిపోయారన్నారు. సీఎం నిరంతర కృషితో 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నారన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, దోభీ ఘాట్లు, సెలూన్లకు 250 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ అందుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ వినియోగదారుల విద్యుత్ చార్జీలు ప్రభుత్వమే భరిస్తున్నదన్నారు. రూ.19.9 కోట్ల వ్యయంతో తుప్పు పట్టిన స్తంభాలను తొలగించి కొత్తవి వేశామన్నారు.
ప్రగతిపథంలో పల్లెలు..
పల్లె ప్రగతిలో భాగంగా 323 జీపీల్లో 923 కిలోమీటర్ల మేర రోడ్లు, 351 కిలోమీటర్ల మేర మురుగు కాల్వలను నిర్మించామని మంత్రి తెలిపారు. ప్రతి జీపీకి ట్రక్, ట్రాలీ, ట్యాంకర్లను కొనుగోలు చేశామన్నారు. గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేసి 41లక్షల మొక్కలు పెంచుతున్నామన్నారు. వైకుంఠ ధామాలు, మండలంలో బృహత్ పల్లె ప్రకృతి వనాలు, 576 పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశామన్నారు. అలాగే, తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారన్నారు. ఇందులో భాగంగా వరంగల్లో మొదటి విడుతలో 22 ప్రాంగణాలు ఏర్పాటు చేశామన్నారు. హరితహారం ద్వారా 7వ విడుతలో 27.83లక్షల మొక్కలు నాటామని చెప్పారు. ఉపాధి హామీ ద్వారా 2022-23 సంవత్సరంలో 1,23,545 మంది కూలీలకు రూ.9.77 కోట్లు వేతనంగా ఇచ్చామన్నారు. 487 మంది యువతకు ఈజీఎంఎం ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు.
పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో..
సీఆర్ఆర్ గ్రాంట్ కింద రూ.37.17 కోట్లతో 42 రోడ్లు, ఎంఆర్ఆర్ కింద రూ.39.22 కోట్లతో 57 రోడ్లు నిర్మిస్తున్నామన్నారు. రూ.3.20కోట్లతో 16 జీపీ భవనాలు, రూ.10.54 కోట్లతో 75 మెటల్ రోడ్లు, రూ.2కోట్లతో 39 డ్రైనేజీల నిర్మాణ పనులు చేపట్టినట్లు మంత్రి చెప్పారు.
పక్కా భవనాల నిర్మాణం..
అద్దం లాంటి రోడ్లు, పక్కా భవనాల నిర్మాణం ప్రభుత్వ లక్ష్యమన్నారు. డీఎంఎఫ్టీ పథకం కింద 21 రహదారుల నిర్మాణం, నిర్వహణ కోసం రూ.31 కోట్లు మంజూరుకాగా, ఇప్పటి వరకు 18 రోడ్లు పూర్తయినట్లు తెలిపారు. ఆకేరు వాగుపై వర్ధన్నపేట మండలం కట్య్రాల నుంచి కొత్తపల్లి వరకు రూ.15కోట్లు, జగన్ తండా నుంచి ల్యాబర్తి వరకు రూ.18 కోట్లతో చేపట్టిన వంతెన నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. 2021-22 సంవత్సరంలో మద్యం అమ్మకాలు, లైసెన్స్ ఫీజుల ద్వారా ప్రభుత్వానికి రూ.599 కోట్లు సమకూరిందన్నారు. 59 మంది కల్లు గీత కార్మికుల కుటుంబాలకు రూ.89లక్షలు ఎక్స్గ్రేషియా అందించామన్నారు. అలాగే 404 చెరువులు, 2 రిజర్వాయర్లలో కోటీ 16 లక్షల చేప పిల్లలు వేశామని, ప్రస్తుత ఏడాది 223 టన్నుల చేపలు, 487 టన్నుల రొయ్యల దిగుబడి సాధించడం టార్గెట్గా పెట్టుకున్నామన్నారు. 11,073 మంది మత్స్యకారులకు ఒక్కొక్కరికి రూ.40వేల ఆదాయం సమకూరిందన్నారు. గొల్ల, కురుమ కుటుంబాలకు 10,207 మంది లబ్ధిదారులకు రూ.95.69 కోట్ల సబ్సిడీతో గొర్రెల యూనిట్లు ఇచ్చామన్నారు.
పాడి పశువుల పంపిణీ పథకం ద్వారా 1,069 మందికి లబ్ధి చేకూరిందన్నారు. 2లక్షల 67వేల 168 మంది నిరుపేద కుటుంబాలకు రూపాయికి కిలో బియ్యం సరఫరా చేస్తున్నామన్నారు. 31 సంక్షేమ హాస్టళ్లకు 388 క్వింటాళ్లు, 70 ప్రభుత్వ పాఠశాలలకు ప్రతినెలా మధ్యాహ్న భోజనం పథకం కింద 531 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. యాసంగిలో 11,920 మంది రైతుల నుంచి 52 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. మూడు ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లోని 919 అంగన్వాడీ కేంద్రాల ద్వారా 5,812 మంది గర్భిణులు, 5,708 మంది బాలింతలు, 25,696 మంది చిన్నారులు లబ్ధి పొందుతున్నారన్నారు. ప్రతి నెలా 1,02,441 మందికి పింఛన్లు ఇస్తున్నామన్నారు. బ్యాంక్ లింకేజీల ద్వారా 6,910 డ్వాక్రా సంఘాలకు 381.87 కోట్లు అందజేశామన్నారు.
కల్యాణలక్ష్మి ద్వారా జిల్లాలో 23,702 కుటుంబాలు, షాదీముబారక్ ద్వారా 2,891 కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.లక్షా 116 అందించామని చెప్పారు. 11,255 మంది బీసీ విద్యార్థులకు రూ.30.50 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ అందిస్తున్నామన్నారు. దళిత బంధులో భాగంగా 301 దళిత కుటుంబాలు లబ్ధి పొందాయన్నారు. వచ్చే ఏడాది రూ.150 కోట్ల విలువైన 1500 యూనిట్లను ఇవ్వనున్నట్లు మంత్రి చెప్పారు. దివ్యాంగులను వివాహం చేసుకున్న 14 మందికి రూ.లక్ష ప్రోత్సాహక బహుమతులు అందజేశామన్నారు. 32 మంది దివ్యాంగులకు బ్యాటరీ స్కూటీలు, వీల్ చైర్లు, స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు సమకూర్చామన్నారు.
జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం కాకతీయ టెక్స్టైల్ పార్క్ను ప్రతిష్టాత్మకంగా స్థాపించిందన్నారు. గణేశా ఎకోటెక్, గణేశా ఎకోపెట్, కైటెక్స్ ఇండియా, యంగ్వన్ పరిశ్రమలను గత నెల 7న పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారన్నారు. ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 15 వేల మంది ఉపాధి పొందనున్నారన్నారు.