వరంగల్, మే 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పల్లె ప్రగతి గ్రామీణాభివృద్ధిలో కొత్త దిశను చూపుతున్నది. నగరాలు, పట్టణాలకు దీటుగా గ్రామాల్లో మౌలిక వసతులు మెరుగుపడ్డాయి. ఒకప్పుడు పల్లెలంటే చెత్తాచెదారం, మురికికాల్వలతో అధ్వానంగా ఉండేది. ఇప్పుడు ఏ గ్రామాన్ని చూసినా పచ్చదనం, పరిశుభ్రతతో కకళకళలాడుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ రూపొందించిన పల్లె ప్రగతి కార్యక్రమంతోనే ఇది సాధ్యమవుతున్నది. ప్రభుత్వ కార్యక్రమం అంటే ఏడాదిలో కొద్ది రోజులు మొక్కుబడిగా చేసి వదిలేయడం అనే పాత సంప్రదాయాన్ని పల్లె ప్రగతి మార్చివేసింది. అధికారులు, సిబ్బంది సమన్వయం.. ప్రజల భాగస్వామ్యంతో ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతున్నది. ముఖ్యంగా పారిశుధ్య నిర్వహణ కోం అవసరమైన స్వచ్ఛ రిక్షాలు, ట్రాక్టర్లను సమకూర్చింది. అవసరమైన పనుల కోసం ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తోంది. సరిపడా నిధులు, నిరంతర పర్యవేక్షణతో గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ మెరుగుపడింది. రోడ్లను ఊడ్చడం, డ్రైనేజీలను శుభ్రం చేయడం, చెత్తను ఊరి చివరకు తరలించడంతో ప్రతి పల్లె పరిశుభ్రంగా కనిపిస్తున్నది.
పల్లె మెరిసేలా..
గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ‘పల్లె ప్రగతి’ని రూపొందించారు. 2019 సెప్టెంబర్ 2న పల్లె ప్రగతి మొదలైంది. మొదటి విడుతలో నెల రోజుల పాటు నిర్వహించారు. అన్ని రకాలుగా గ్రామాల్లో మార్పులు మొదలయ్యాయి. 2020 జనవరి 2 నుంచి 12వరకు రెండో విడుత కొనసాగింది. పల్లె ప్రగతి నిరంతర కార్యక్రమమని.. గ్రామాల్లో పరిశుభ్రత, పచ్చదనం, మౌలిక వసతుల కల్పన పనులు ప్రతిరోజూ కొనసాగుతూనే ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో రాష్ట్రవ్యాప్తంగా పల్లె ప్రగతి నిరంతరాయంగా కొనసాగుతున్నది. ఆరు నెలల సమీక్ష అనంతరం మరోసారి పూర్తిస్థాయిలో పల్లె ప్రగతిని నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతి ఊరు మెరిసేలా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషిచేయాలన్నారు. స్థానిక ప్రజల భాగస్వామ్యంతో అన్నీ సాధ్యమేనని చెప్పారు. అప్పటినుంచి ‘పల్లె ప్రగతి’ నిరంతరం కొనసాగుతున్నది. ఏడాదిలోనే అన్ని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన పూర్తయ్యింది. అలాగే పారిశుధ్య కార్మికుల వేతనాలను రూ.8,500కు పెంచింది. పారిశుధ్య నిర్వహణలో ఈ అంశం బాగా పనిచేసింది. చెత్త తరలింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఊరికి ట్రాక్టర్-ట్రాలీని ఇచ్చింది. అవసరమైన చోట గ్రామ పంచాయతీలు స్వచ్ఛ ఆటోలను సమకూర్చుకున్నాయి. అన్ని గ్రామాల్లోని సిబ్బంది, ప్రజాప్రతినిధులు పారిశుధ్య నిర్వహణపై ప్రజలకు అవగాహన పెంచారు. అందరు కలిసి ఊర్లను పరిశుభ్రంగా తీర్చిదిద్దుకున్నారు.
పారిశుధ్య నిర్వహణపై పక్కాగా..
పారిశుధ్య నిర్వహణ తీరుపై రాష్ట్ర ప్రభుత్వం పక్కాగా పర్యవేక్షిస్తున్నది. పల్లె ప్రగతి స్ఫూర్తిని నిరంతరం కొనసాగించేందుకు ప్రత్యేక తనిఖీ విధానాన్ని అమలుచేస్తున్నది. ఈమేరకు జిల్లాల్లోని కొన్ని గ్రామాలను ఎంపిక చేసి అధికారుల బృందాలతో తనిఖీ చేయిస్తోంది. ఈ ప్రక్రియలో గుర్తించిన అంశాల ఆధారంగా పారిశుధ్య నిర్వహణపై నివేదికలు రూపొందిస్తున్నారు. తనిఖీ అంశాల సమాచారంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆయా జిల్లాలకు ‘పారిశుధ్య స్కోరు’ను ఇస్తున్నది. గ్రామంలో ప్రతిరోజూ చెత్త ఊడ్వడం, రోడ్లు, మురుగుకాల్వలు శుభ్రం చేయడం, చెత్తను తరలించడం, డంపింగ్యార్డు నిర్వహణ.. తదితర అంశాల ఆధారంగా గరిష్ఠంగా 40మార్కులు ఇవ్వాలని నిర్ణయించింది. ప్రతి నెల జిల్లాలోని కొన్ని గ్రామాల్లో తనిఖీలు చేసి పారిశుధ్య మార్కులను ఖరారు చేస్తున్నది. వరుసగా మూడు నెలల తనిఖీల వివరాలతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక నివేదికలు రూపొందిస్తున్నది. 2022 ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో చేసిన తనిఖీలతో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు పారిశుధ్య స్కోరు ఇచ్చారు. హనుమకొండ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు సగటున 38మార్కులు నమోదయ్యాయి. వరంగల్, ములుగు జిల్లాలకు 37, జనగామకు మూడు నెలల సగటు మార్కులు 34 ఉన్నాయి. ప్రజలు, ప్రజాప్రతినిధులు, స్థానిక అధికారుల సమన్వయంతోనే పల్లె ప్రగతి విజయవంతమవుతున్నది. అందరి సహకారంతోనే ఆరు జిల్లాలకు మంచి మార్కులు వచ్చాయి.