వరంగల్ చౌరస్తా, మే 23 : ఉత్తరాలు, మనయార్డర్స్ అందిచడం ప్రధాన సేవగా మొదలైన తపాలా శాఖ పోటీప్రపంచానికి అనుగుణంగా తన సేవల్ని విస్తరిస్తూ ముందుకుసాగుతోంది. వినియోగదారుల అవసరాలకు తగినట్లు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ డిజిటల్ పేమెంట్స్తో మరింత సౌకర్యవంతమైన సేవలందిస్తోంది. ఇందులో భాగంగా రిజిస్టర్ పోస్ట్, స్పీడ్ పోస్ట్, పార్సిల్ సర్వీసెస్, బుక్పాకెట్ రిజిస్ట్రేషన్, రైల్వే, ఆర్టీసీ టికెట్ బుకింగ్, ఈ-దర్శన్ టికెట్ బుకింగ్, బిజినెస్ పోస్ట్, ఇంటర్నేషనల్ సేవలు, ఎయిర్ పార్సిల్, వ్యాపార సంబంధ సేవలు, ఈ-పేమెంట్స్ లాంటి సేవలకు సంబంధించిన చార్జీలు, ఫీజుల చెల్లింపులకు గాను నగదుతో పనిలేకుండా నేరుగా యూపీఐ ద్వారా చెల్లించే అవకాశం కల్పిస్తోంది. ప్రస్తుతం భారతదేశంలో యూపీఐ చెల్లింపుల కాలం నడుస్తున్నందున వినియోగదారులకు యూపీఐ సేవలను సైతం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేవల ద్వారా వినియోగదారుడు తపాలాశాఖకు చెల్లించాల్సిన చార్జీలు, ఫీజులను నేరుగా తన బ్యాంకు ఖాతా నుంచి తపాలా శాఖకు అందించవచ్చు. తద్వారా తపాలా శాఖ ఆధ్వర్యంలో నగదు రహిత సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఈ సేవలను సేవింగ్ ఖాతాలు, డిపాజిట్లు కార్యకలాపాలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు.
సేవల వినియోగంలో మనమే ముందు
రెండు వారాల క్రితం దేశవ్యాప్తంగా చేపట్టిన ఈ యూపీఐ సేవలను వినియోగించుకోవడంలో రాష్ట్రవ్యాప్తంగా వరంగల్ డివిజన్ మొదటి స్థానంలో నిలిచిందని వరంగల్ డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ ఉమామహేశ్వరరావు తెలిపారు. వినియోగదారులకు తక్కువ సమయంలో చెల్లింపులు పూర్తి చేసే అవకాశం కల్పించడం ద్వారా సిబ్బందికి పనిభారం తగ్గడంతో పాటు నేరుగా నగదు చెల్లింపులు ఖాతాలోకి చేరుకోవడంతో పారదర్శకంగా పని పూర్తవుతుందని పేర్కొన్నారు. యూపీఐ సేవలపై అవగాహన పెంచడం వల్ల తక్కువ సమయంలో ఈ సేవలకు మంచి స్పందన వస్తున్నదని చెప్పారు.
పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచుతాం
తపాలా శాఖ అందిస్తున్న సేవలకు గాను తీసుకొనే చార్జీలు, ఫీజులను పూర్తిగా నగదు రహితంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నాం. తక్కువ సమయంలో పూర్తిస్థాయి నాణ్యత, నమ్మకంతో కూడిన సేవలను వినియోగదారులకు అందించేందుకు గాను విస్తృత ప్రచారం చేస్తాం. గ్రామీణ స్థాయిలో సైతం ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావడం వల్ల మరింత పారదర్శకంగా సేవలందిస్తాం. -ఉమామహేశ్వరరావు,వరంగల్ డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్