వరంగల్ చౌరస్తా, మే 16 : గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని, రోడ్డు భద్రతా నియమాలను బాధ్యతగా పాటించాలని సూచిస్తూ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో అవేకెన్ వరంగల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాకతీయ మెడికల్ కళాశాల మైదానంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన ఈ కార్యక్రమం ఆద్యంతం ఆకట్టుకుంది. డిజైనర్లు చేతన్ వీణ, రామ్ అగర్వాల్ రూపొందించిన వస్త్ర డిజైన్లతో మేల్, ఫిమేల్ మోడల్స్ చేసిన ర్యాంపు వాక్ యువతను ఉర్రూతలూగించింది. డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలను, రోడ్డు భద్రతా నియమాలు పాటించకపోవడం వల్ల కలిగే నష్టాలను హైదరాబాద్కు చెందిన సాండ్ ఆర్టిస్ట్ వేణుగోపాల్ కళ్లకు కట్టినట్లుగా చూపించాడు. వివిధ విభాగాల్లో చిన్నారులు నృత్య ప్రదర్శనలు చేశారు.
యువత మత్తు పదార్థాలకు బానిస కావొద్దు : మంత్రి ఎర్రబెల్లి
మత్తు పదార్థాలను వినియోగించి యువత జీవితాలను నాశనం చేసుకోవద్దని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. అవేకెన్ వరంగల్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ప్రమాదాల్లో 11 శాతం భారత్లోనే జరుగుతున్నాయని అన్నారు. తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్టాల్లో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. ప్రతి సంవత్సరం సుమారు 4 లక్షల 50 వేల రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా సగటున ప్రతి నాలుగు నిమిషాలకు ఒకరు చొప్పున చనిపోతున్నారని చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రచురించిన గ్లోబ్ స్టేటస్, ఆన్ రోడ్ సేఫ్టీ రిపోర్టు ప్రకారం అతివేగం, మద్యం మత్తు, హెల్మెట్ , సీట్ బెల్ట్ లాంటి జాగ్రత్తలు, నిబంధనలు పాటించకపోవడం, మొబైల్ డ్రైవింగ్తో ప్రమాదాలు సంభవిస్తున్నాయని చెప్పారు. యువత సన్మార్గం వైపు నడపడానికి వరంగల్ పోలీసులు అవైకన్ వరంగల్ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని అన్నారు. సీపీ తరుణ్జోషి మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాల వినియోగంతో కలిగే నష్టాలను ఈ కార్యక్రమం ద్వారా వివరించామని తెలిపారు. యువత మత్తు పదార్థాలు వినియోగించడం మూలంగా జరుగుతున్న అనర్థాలను నివారించడానికి వరంగల్ కమిషనరేట్ పరిధిలో చేపట్టిన నయీ కిరణ్ కార్యక్రమం మంచి ఫలితాలను ఇస్తుందని మేయర్ గుండు సుధారాణి అన్నారు. హనుమకొండ కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, వరంగల్ కలెక్టర్ గోపి, గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్య, నిట్ డైరెక్టర్ రమణారావు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.