నల్లబెల్లి : గుప్తనిధుల తవ్వకాలకు నల్లబెల్లి మండలం నిలయంగా మారింది. నిత్యం ఏదో ఒక గ్రామంలో దుండగులు గుప్తనిధుల తవ్వకాలు చేపడుతూనే ఉన్నారు. ఈ గుప్తనిధుల తవ్వకాల ముఠా సభ్యులకు, కొంతమంది రాజకీయ నాయకుల అండతో పాటు కొందరు పోలీసుల అండ కూడా ఉన్నట్లు మండలంలో బాహటంగా చర్చ జరుగడం గమనార్హం. శనివారం రాత్రి అర్శనపల్లి గ్రామం సమీపం వ్యవసాయ గిడ్డంగుల సమీపంలోని డంపింగ్యార్డు స్థలం వద్ద కొందరు గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేసి తవ్వకాలు జరిపే స్థలాన్ని అస్టదిగ్భందనం చేసి గుప్తనిధుల తవ్వకాలు చేపట్టారు.
ఆదివారం ఉదయం రైతులు గుప్తనిధుల కోసం తవ్విన స్థలాన్ని చూసి భయబ్రాంతులకు గురయ్యారు. ఈ తవ్వకాల్లో బొల్లోనిపల్లె గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు గుప్తనిధుల తవ్వకాల్లో పాల్గొన్నట్లు సమాచారం. గుప్తనిధుల తవ్వకాలకు పాల్పడుతున్న ముఠా సభ్యులు పగటి వేల గ్రామాల పరిసరాల్లో సంచరిస్తూ రాత్రి వేల పాత పాడు భూముల్లో, పాడుబడ్డ దేవాలయాలను ఎంపిక చేసి గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపడుతున్నారు.
ఇలాంటి సంఘటనలు పోలీసుల దృష్టికి వచ్చినప్పటికీ తూతూ మంత్రంగా విచారణ చేపట్టి అనుమానితులను వదిలేయడం వల్ల దుండగులకు అడ్డూ అదుపు లేకుండా పోతుందని మండల ప్రజలు వాపోతున్నారు.