వర్ధన్నపేట, జూన్ 29: చెరువుల కింద చివరి ఆయకట్టు వరకూ సాగునీరు అందించేందుకు ఉపాధిహామీ పథకంలో పంట కాల్వలకు కూలీలు మరమ్మతులు చేస్తున్నారు. దశాబ్దాల తరబడి చెరువుల కింద ఉన్న పంట కాల్వలను శుభ్రం చేయకపోవడంతో కూడుకుపోయి చివరి ఆయకట్టుకు నీరందడం లేదు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అంతేకాకుండా నిబంధనల మేరకు ఉండాల్సిన కాల్వలను కూడా పక్క రైతులు ఆక్రమించుకోవడంతో కాల్వల్లో నీరు ప్రవహించే పరిస్థితి లేకుండాపోయింది. దీంతో అన్ని గ్రామాలకు చెందిన రైతులు ఉపాధి పథకంలో కూలీలతో పంట కాల్వలకు మరమ్మతులు చేపట్టాలని విన్నవిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత వానకాలం పంటకు చివరి ఆయకట్టు వరకూ సాగునీరు అందించాలనే లక్ష్యంతో ఐబీ, ఈజీఎస్ అధికారులు కూలీలతో మండలంలోని ఇల్లంద గ్రామంలో పంట కాల్వలకు మరమ్మతులు చేపట్టారు. చెరువుల పెద్ద తూముల నుంచి కొంతదూరం వరకు కాల్వల విస్తీర్ణం ఎక్కువగా ఉండడం వల్ల జేసీబీ సహాయంతో కాల్వలను తీయించారు.
కానీ, చిన్న కాల్వలను పూర్తిగా కూలీలతో తీయిస్తేనే రైతులకు మేలు కలుగడంతోపాటు పంటల సాగు విస్తీర్ణం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. గతంలో రైతులు కాల్వలు తీసేందుకు ఆర్థిక ఇబ్బందులకు గురికావాల్సి వచ్చేది. ఈ ఏడాది పంట కాల్వలను ఈజీఎస్ కూలీలతో తీయిస్తుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి కూలీలకూ వర్షాకాలంలో కూడా పనులు దొరుకుతున్నాయి. పంట కాల్వలకు మరమ్మతులు చేస్తుండడంతో ఈ ఏడాది చివరి వరకూ సాగునీరు అందుతుందని తెలియడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.